breaking news
calibri font
-
మైక్రోసాఫ్ట్ ఫాంట్ వల్ల పాక్ ప్రధాని పదవి ఊడింది!
అది జులై 13, 2018 లాహోర్ ఎయిర్ పోర్ట్. పాకిస్తాన్లో శక్తివంతమైన నేత, ఆ దేశానికి అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్(72), ఆయన కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ తీవ్ర ఉద్రికత్త, ఉత్కంఠతల మధ్య అధికారులు అరెస్ట్ చేశారు. పనామా పత్రాల స్కామ్లో ఎవెన్ ఫీల్డ్ హౌజ్ అక్రమాస్తుల కేసులో పాకిస్తాన్ సుప్రీం కోర్టు వీళ్లిద్దరిని దోషులుగా ప్రకటించింది. అయితే, నవాజ్ షరీఫ్, కుమార్తె నవాజ్ మరియం షరీఫ్లు కేవలం మైక్రోసాఫ్ట్ ఫాంట్ వల్ల పట్టుబడ్డారనే విషయం మీకు తెలుసా? ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తన కుటుంబం కోసం ప్రభుత్వ నిధులు కాజేశారంటూ ఏప్రిల్3, 2016న జర్మన్ వార్తాపత్రిక Süddeutsche Zeitung ( SZ ) 11.5 మిలియన్ల రహస్య పత్రాలు లీక్ అయినట్లు ప్రకటించింది. పనామా పేపర్స్ అని పిలవబడే ఈ డాక్యుమెంట్లలో క్లయింట్లు ఆయా ప్రభుత్వాలకు పన్ను చెల్లించకుండా బిలియన్ డాలర్లు ఎలా దాచుకున్నారో వెల్లడించింది. వెలుగులోకి వచ్చిన పనామా డాక్యుమెంట్లలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దగ్గర ఉన్న ఆస్తులు కన్నా చాలా ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తేలింది. అంతేకాదు, ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసేలా షరీఫ్ తన కుమార్తె కోసం లండన్లో ఓ విలావంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై 2017లో పాక్ సుప్రీం కోర్టు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయంటూ షరీఫ్ను, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. అనేక వాయిదాల తర్వాత నవాజ్ షరీఫ్ కూతురు మరియం కొన్ని డాక్యుమెంట్లను సాక్షాలుగా చూపించింది. ఈ డాక్యుమెంట్స్లో ఉన్న డేట్ ఫిబ్రవరి 2006, వాడిన ఫాంట్ మైక్రోసాఫ్ట్ కాలిబ్రి. అయితే కాలిబ్రి అనే ఫాంట్ ను మైక్రోసాఫ్ట్ 2007లో అందరికి అందుబాటులో వచ్చింది. కానీ ఆ విషయం తెలియక షరీఫ్ - మరియంలు ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించారు. ఇదే అంశంపై 15 సంవత్సరాల క్రితం కాలిబ్రిని డిజైన్ చేసిన డచ్ టైప్ఫేస్ డిజైనర్ లుకాస్ డి గ్రూట్, షరీఫ్ కుటుంబానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. తాను డిజైన్ చేసిన ఈ కాలిబ్రి ఫాంట్ 2007లో మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. కానీ 2006లో ఎలా వినియోగించారనే అనుమానం లేవనెత్తారు. దీని బట్టి మరియం ఇచ్చింది దొంగ సాక్ష్యాలని కోర్టుకు తెలిసింది. ఒక ఫారెన్సిక్ హ్యాండ్ రైటింగ్ కంపెనీ తప్పును పట్టేసింది. నవాజ్కు వ్యతిరేకంగా ఇదొక పెద్ద సాక్ష్యంగా మారింది. రెండు కేసుల్లో న్యాయస్థానాలు ఆయనకు 2018లో శిక్ష విధించాయి. లండన్లో అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న కేసులో పదేళ్లు; సౌదీ అరేబియాలో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కేసులో ఏడేళ్లు జైలు శిక్ష పడింది. శిక్ష అనుభవిస్తుండగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. 2019, నవంబరులో షరీఫ్ లండన్ వెళ్లి, ఇప్పటివరకూ తిరిగి రాలేదు! అయితే, తన సోదరుడు షెహ్బాజ్ ప్రధాని పగ్గాలు చేపట్టడంతో..షరీఫ్ ఆశలు మళ్లీ చిగురించాయి. ఈ క్రమంలోనే భారత్ చంద్రుణ్ని చేరుకుంటే.. పాక్ ప్రపంచాన్ని అడుక్కుంటోందని విచారించారు. అంతేకాదు, తన ఉద్వాసన వెనుక నలుగురు న్యాయమూర్తులు, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతోపాటు ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ ఉన్నారని ఆరోపించారు. -
పాకిస్తాన్ ప్రభుత్వం కుప్పకూలుతుందా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం సంకటంలో పడింది. షరీఫ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను మైక్రోసాఫ్ట్ ఫాంట్ చిక్కుల్లో పడేసింది. ఆ సంస్థకు చెందిన కాలిబ్రి ఫాంట్ షరీఫ్కు తలనొప్పిగా మారింది. ఇంకా చెప్పాలంటే ఈ ఫాంట్ కారణంగా ప్రధానమంత్రి షరీఫ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఫాంట్ తప్పిదం ఏమీ లేకున్నా.. పనామా పేపర్స్ కుంభకోణంలో చేసిన తప్పును కప్పి పుచ్చుకునే క్రమంలో ఆ ఫాంటే వారిని చిక్కుల్లో పడేసింది. అసలేం జరిగింది.. 1990లలోనే పాక్కు ప్రధానిగా ఎన్నికైన నవాజ్ షరీఫ్, అతడి కుటుంబ సభ్యులు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పాకిస్థాన్ పోలీసులు, మిలటరీ, ఆర్థిక నియంత్రణ సంస్థలు కలిసి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జేఐటీ)గా ఏర్పడి ఆయన కుటుంబ సభ్యులకు విదేశాల్లో ఉన్న ఆస్తుల విషయమై విచారణ చేపట్టాయి. జేఐటీ ఇటీవలే తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. విదేశాల్లో ఉన్న అవెన్ఫీల్డ్ అపార్ట్మెంట్కు షరీఫ్ కూతురే యజమాని అని, గతంలో ఆమె ఎప్పుడూ ఈ విషయాన్ని బయటపెట్టలేదని జేఐటీ కోర్టుకు తెలిపింది. అయితే, తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని విదేశాల్లోనూ ఆస్తులేమీ కూడబెట్టలేదని షరీఫ్ వాదిస్తున్నారు. ఈ క్రమంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. 2006లోనే తన ఆస్తులకు సంబంధించిన డిక్లరేషన్ సమర్పించినట్టుగా షరీఫ్ కూతురు మర్యమ్ నవాజ్.. ఫోర్జరీ డాక్యుమెంట్లను రూపొందించినట్లు జేఐటీ అనుమానించింది. ఫోర్జరీ చేసిన డ్యాకుమెంట్లలో కాలిబ్రి ఫాంట్ను వాడారు. 2007 జనవరి 31 తర్వాతి నుంచే ఈ ఫాంట్ సాధారణ ప్రజానికానికి అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి కాలిబ్రి ఫాంట్ను మైక్రోసాఫ్ట్ 2004లో రూపొందించింది. మూడేళ్ల తర్వాత అంటే 2007లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఒక ఫాంట్గా చేర్చింది. దీంతో మర్యమ్ ఇబ్బందుల్లో పడ్డారు. డాక్యుమెంట్ ఫోర్జరీకి గురైంది విచారణలో తేలడంతో షరీఫ్ ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు.