breaking news
Buddhist sculptures
-
ఆంధ్రా బౌద్ధ శిల్పాలకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: ప్రాచీన కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్కు మరో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. రాష్ట్రానికి చెందిన ఆరు బౌద్ధ శిల్పాలు అమెరికా, దక్షిణ కొరియాల్లో అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఇందులో భాగంగా క్రీ.పూ. 200 ఏళ్ల నుంచి క్రీ.శ. 400 ఏళ్ల మధ్య కాలం నాటి రాష్ట్ర ప్రాచీన శిల్ప కళాసంపద ఖండాంతర ప్రజలకు కనువిందు చేయనుంది. ఈ మేరకు న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్.. ‘టీ అండ్ సర్పెంట్: ది ఎవల్యూషన్’ అనే పేరుతో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించనుంది. ఇందులో భాగంగా భారతదేశంలో బౌద్ధానికి పూర్వం నాటి సంస్కృతిని చాటే శిల్పాలు, బౌద్ధం తొలినాళ్లలోని అలంకారిక కళలు, చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ క్రమంలో మన దేశం నుంచి సున్నపురాయి, బంగారం, వెండి, కాంస్యం, రాక్ క్రిస్టల్, ఐవరీ వంటి 140 రకాల శిల్పాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయంగా రెండు వేదికలపై.. భారతీయ బౌద్ధ శిల్పకళా రూపాల ప్రదర్శనను ముందు అమెరికాలోని న్యూయార్క్లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో జూలై 17 నుంచి నవంబర్ 13 వరకు నిర్వహించనున్నారు. ఈ మ్యూజియాన్ని ‘ది మెట్’ అని పిలుస్తారు. ఇది అమెరికాలో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. 2022లో 32,08,832 మంది దీన్ని సందర్శించారు. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ఆర్ట్ మ్యూజియంల జాబితాలో ఇది ఎనిమిదో స్థానంలో ఉంది. యూఎస్లో అయితే రెండో స్థానంలో నిలుస్తోంది. అమెరికాలో ప్రదర్శన ముగిశాక తర్వాత దక్షిణ కొరియాలో నేషనల్ మ్యూజియం ఆఫ్ కొరియాలో డిసెంబర్ 22 నుంచి 2024 ఏప్రిల్ 14 వరకు శిల్పాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం మెట్రోపాలిటన్ మ్యూజియం ‘స్టార్ వరల్డ్ వైడ్’ సంస్థకు పురాతన కళా రూపాలను తరలించే బాధ్యతను అప్పగించింది. దీనికి మనదేశంలో నేషనల్ మ్యూజియం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఏపీ విగ్రహాల్లో విశిష్టతలు తొలి బౌద్ధ కళల్లో అలంకరణ ముఖ్యంగా కనిపిస్తోంది. అందమైన పువ్వులు, తీగల అల్లికలు, పూర్ణకుంభం, విజ్ఞాన, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా కొలిచే గుర్రం వంటి చిత్రాలు వంటివి శిల్పాల్లో ఉన్నాయి. ముఖ్యంగా శిల్పాలపై చెక్కిన ఆరాధకుల ముఖకవళికల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మహాపురుషుని రూపం, యక్షుల చిత్రాలు, బౌద్ధంలోని వివిధ సంఘటనలను తెలిపే స్థూపం, ఒకే శిలపై సింహం తల, మొసలి, చేప, ఏనుగు తొండం రూపంలోని వాహనంపై సవారీని ప్రతిబింబించే దృశ్యాలున్నాయి. రాష్ట్రం నుంచి ఆరు విగ్రహాలు అంతర్జాతీయ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంవత్సరాల క్రితం నాటి ఆరు తెల్లటి పాలరాతి విగ్రహాలను ఎంపిక చేశారు. ఇందులో ఐదింటిని అమరావతి హెరిటేజ్ మ్యూజియం నుంచి, ఒకదాన్ని గుంటూరులోని బౌద్ధశ్రీ పురావస్తు మ్యూజియం నుంచి తరలించనున్నారు. ఇందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది. మన రాష్ట్రంలో అమరావతి ప్రాంతానికి అంతర్జాతీయ బుద్ధిజం కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. బుద్ధుడు తన శిష్యులకు ఇక్కడే 10 ధరణిలు (మంత్రాలు) బోధించారని.. అందుకే అమరావతి ప్రాంతం ధరణికోటగా పేరొందినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. కాలచక్ర యానం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైందని బౌద్ధులు దృఢంగా విశ్వసిస్తున్నారు. కాగా ప్రదర్శనకు తెలంగాణ నుంచి తొమ్మిది శిల్పాలను ఎంపిక చేశారు. గొప్ప కళా సంపదకు నిలయం.. బుద్ధుడి ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి. అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాలు గొప్ప శిల్ప కళా సంపదను నిక్షిప్తం చేసుకున్నాయి. ఇలాంటి ఎన్నో గొప్ప, అరుదైన శిల్పాలను ఏపీ మ్యూజియాల్లో భద్రపరిచాం. వీటిని అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయడం ఎంతో గర్వకారణం. – జి.వాణీమోహన్, కమిషనర్, ఏపీ పురావస్తు, ప్రదర్శనశాలలు -
బుద్ధుని అవశేషాలపై ఏం చేస్తారు: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా వెనంపల్లిలో ఇటీవల బయటపడ్డ పురాతన బుద్ధుని అవశేషాల ప్రాముఖ్యతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకటి, రెండో శతాబ్దానికి చెందిన బుద్ధుని అవశేషాలు కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) వారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని విజయసాయిరెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా వెనంపల్లిలో రెండు బుద్దుని విగ్రహాలు లభించాయని, ఈ ప్రాంతం చంద్రవరం బుద్దిస్ట్ ప్రాంతంలో ఉందని సాంస్కృతిక, పర్యాటకశాఖ సహాయమంత్రి మహేశ్ చంద్ర రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గతంలోనూ ఏఎస్ఐ వారు ఎన్నో సర్వేలు చేసి తవ్వకాలు జరిపి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అవశేషాలు వెలికితీశారని.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ ఆలయం నుంచి పురాతన నంది విగ్రహం చోరీ అయిందని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఏమైనా చర్యలు తీసుకుంటే ఆ వివరాలు తెలపాలని కోరారు. చోరికి గురైన నంది విగ్రహం గురించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) వారికి ఎలాంటి రిపోర్ట్ రాలేదన్నారు. విగ్రహం చోరీపై ఏదైనా సమాచారం అందితే యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీస్ యాక్ట్-1972 ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి మహేశ్ చంద్ర సమాధానమిచ్చారు. -
అమరేశ్వరుని గాలిగోపురం పునాదుల్లో బౌద్ధ శిల్పాలు
అమరావతి: గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరుని ఆలయ గాలిపోపురం పునాది తవ్వకాల్లో బుధవారం అపురూపమైన బౌద్ధ శిల్పాలు వెలుగుచూశాయి. దాదాపు రెండున్నర శతాబ్దాల కిందట నిర్మించిన ఈ గాలిగోపురాన్ని కూల్చి నూతనంగా నిర్మించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. గురువారం నూతన నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. బుధవారం పునాది తవ్వుతుండగా లభించిన ఈశిల్పాల సమాచారం తెలుసుకున్న స్థానిక పురావస్తుశాఖ మ్యూజియం ఇన్చార్జ్ ఎన్.వెంకటేశ్వరరావు వాటిని పరిశీలించారు. బౌద్ధశిల్పాలుగా గుర్తించి ఆలయ అధికారులతో చర్చించిన అనంతరం మ్యూజియానికి తరలించారు. ఈ సందర్భంగా పురావస్తుశాఖ ప్రతినిధి ఎన్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... తవ్వకాలలో లభించిన శిల్పాలు అరుదైనవని, 3వ శతాబ్దం కాలంనాటివన్నారు.