breaking news
brokers system
-
సిండి‘కేటుగాళ్లు’
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : జీడి పప్పు ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పలాస జీడి పరిశ్రమలు ప్రస్తుతం దళారుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఇక్కడ దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా ధరలు ఉంటున్నాయి. జీడి పిక్కలు, జీడి పప్పు ధరలను వారు నిర్ణయించే స్థితికి నేడు దిగజారాయి. పలాస ప్రాంతం నుంచి గతంలో పరిశ్రమదారులు నేరుగా దేశంలోని కోల్కతా, ముంబయి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, గుజరాత్ వంటి వివిధ ప్రాంతాలకు జీడి పప్పును డిమాండ్ ఉన్న మేరకు స్వేచ్ఛగా విక్రయించుకునే వారు. జీడి పప్పు ధర ఆధారంగా పిక్కల ధరలు కూడా నిర్ణయించేవారు. కాలక్రమేణా జీడి పప్పు ఎగుమతి కొద్ది మంది దళారుల చేతిల్లోకి వెళ్లిపోయింది. గతేడాది ఈ సీజన్లో జీడి పిక్కలు కొనుగోళ్లు ఉద్దానంలో ముమ్మరంగా చేపట్టారు. అప్పట్లో ఒక్కో బస్తా(80కిలోలు) జీడి పిక్కల ధర రూ.13వేలు ఉండేది. ఈ ఏడాది ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో వ్యాపారులు ఒక బస్తాను రూ. 9వేలకు కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో జీడి పప్పు దిగుబడులు బాగా లేవనే నెపంతో రూ.8,600లకు కొంటున్నారు. తప్పని పరిస్థితిలో విక్రయించాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. \ ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పిక్కలు గతేడాది అక్టోబర్లో వచ్చిన తిత్లీ తుపానుకు జీడి తోటలు సర్వనాశనం అయ్యాయి. అక్కడక్కడ మిగిలిన చెట్లుకు చిగుర్లు వచ్చి జీడి పిక్కలు కాపునకు వచ్చాయంటే ప్రస్తుతం గిట్టుబాటు ధర లభించడం లేదు. ఉద్దానంలో పరిస్థితి ఇలా ఉంటే పలాస జీడి పరిశ్రమలకు విదేశాల నుంచి పిక్కలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఘనా, టాంజినియా, బిసావో తదితర దేశాల నుంచి పలాస పట్టణానికి చెందిన కొద్ది మంది దళారులు జీడి పిక్కలను దిగుమితి చేస్తున్నారు. వారు విశాఖపట్నం పోర్టు నుంచి ఈ పిక్కలను తీసుకొచ్చి గొడౌన్లలో నిల్వ చేస్తున్నారు. అవసరం కొద్ది కృత్రిమ డిమాండ్ను సృష్టించి పిక్కలను స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గత నెలలో ఈ జీడి పిక్కల బస్తా ధర రూ.6వేలు ఉండగా నేడు వాటిని పప్పు దిగుబడి పేరుతో రూ.6వేల నుంచి రూ.8వేలకు విక్రయిస్తున్నారు. జీడి పప్పు, పిక్కల ధర మొదటిలో డిమాండ్ను బట్టి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, దళారుల చేతిలోకి వెళ్లి పోయిందని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీటీలపై ఆర్థిక లావాదేవీలు.. దళారులు, స్థానిక వ్యాపారులకు మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలు కూడా అకౌంట్ ఫర్ కాకుండా జాగ్రత్తపడుతున్నారు. చిన్న చీటీలపై ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి. దీంతో ఎవరు ఎప్పుడు ఏ ధర ఇచ్చి కొంటున్నారు. అమ్ముతున్నారు అనే దానికి ఆధారాలు ఉండవు. ఈ విధంగా దళారుల చేతిలో పడి జీడి వ్యాపారులు నలిగిపోతుండగా జీడి రైతులు కూడా గిట్టు బాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలాస నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నప్పటికీ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ అధికారులు ఎప్పటికప్పుడు జీడి పిక్కల ధరలు ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘ నాయకులు కోరుతున్నారు. -
దళారీ తానా.. సీసీఐ తందానా!
సాక్షి, హైదరాబాద్ : తేమశాతం పేరుతో వ్యాపారులు పత్తి రైతును చేస్తున్న దగా అంతాఇంతా కాదు. రైతుకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) దక్కని పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన సీసీఐ పత్తా లేకుండా పోయింది. వ్యాపారులు, దళారులతో సీసీఐ కుమ్మక్కైందని రైతులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించారు. దళారులు, వ్యాపారులు కలసి రైతును నిలువుదోపిడీ చేస్తున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలోనే కీలకమైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ తీరు ఇంత దారుణంగా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ధర రావడం లేదని సీసీఐ కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్దామంటే అక్కడ కనీసం ఒక్కరు కూడా లేరని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పత్తి వ్యాపారులతో సీసీఐ అధికారులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రం వద్ద అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వ్యాపారులు చేస్తున్న అన్యాయాన్ని చెప్పుకునేందుకు రైతులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. వ్యాపారులు ఎంత చెబితే అదే ధర... ఏం చెబితే అదే నడుస్తోంది. ఒకరకంగా మార్కెట్లో వ్యాపారులు, దళారుల మాఫియా నడుస్తోంది. యంత్రాలు లేకుండానే తేమ నిర్ధారణేంటి? పత్తిలో 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ.4,320, 9 శాతం ఉంటే రూ. 4,277, 10 శాతం ఉంటే రూ.4,234, 11 శాతం ఉంటే రూ.4,190కి, 12 శాతం ఉంటే రూ.4,147 చొప్పున కొనుగోలు చేయాలి. రైతులు తెచ్చిన బస్తాలను తేమ శాతం గుర్తించే యంత్రాలతో పరిశీలించి ఇలా ధర ఖరారు చేయాలి. కానీ ఖమ్మం మార్కెట్కు తెస్తున్న పత్తిలో కనీసం రెండు మూడు శాతాన్ని కూడా ఇలా యంత్రంతో పరిశీలించడం లేదు. తేమ శాతం పరిశీలించకుండానే వ్యాపారులు అడ్డగోలుగా ధర నిర్ణయించేస్తున్నారు. చేతితో పైపైన చూసి అశాస్త్రీయంగా ధర నిర్ధారిస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో దాదాపు 50 మంది పత్తి వ్యాపారులుంటే ఇద్దరంటే ఇద్దరే తేమ శాతం గుర్తించే యంత్రాలను తెచ్చి అక్కడక్కడ పరిశీలిస్తున్నారు. వర్షానికి నల్లరంగులోకి మారిన పత్తి ధర క్వింటాలుకు రూ.2–3 వేల మధ్యే కొంటున్నారు. ఇక నాణ్యత కలిగిన పత్తికి ఎంఎస్పీ రూ.4,320 ఇవ్వాల్సి ఉండగా... మార్కెట్లో మాత్రం రూ.3,500 నుంచి రూ.4 వేల మధ్యే కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు చోద్యం చూస్తున్నారు. రూ.2,500కే అమ్మేశా: నాకు ఐదెకరాలుంది. పత్తి, వరి సాగు చేస్తున్నా. నాలుగెకరాల్లో పత్తి సాగుచేశా. పత్తి అమ్మితే ఎంతో ఆదాయం వస్తుందని ఆశపడ్డా. కానీ వర్షాలకు దెబ్బతిన్నది. తొలి తీతలో 2 క్వింటాళ్ల మేర వచ్చింది. అమ్మకానికి తెచ్చా. నాణ్యత లేదని క్వింటాలుకు రూ.2,500 ఇచ్చారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా పూడని పరిస్థితి ఏర్పడింది. పంట సాగుపై రూ.1.50 లక్షల వరకు నష్టం వచ్చేలా ఉంది. పత్తి వేసి నష్టాల పాలవుతున్నా. వచ్చే ఏడాది వ్యవసాయానికి దూరంగా ఉండాలని బావిస్తున్నా. -- పల్లెనుల యూసూబు, అల్లీపురం, ఖమ్మం అర్బన్ మండలం నా జీవితంలో ఇంత దారుణం చూడలేదు ఆరెకరాల్లో పత్తి వేశా. మొదటి తీతలో వచ్చిన 20 బస్తాల పత్తిని ఆరబెట్టి అమ్మకానికి తెచ్చా. వర్షాలకు కొద్దిగా రంగు మారింది. కానీ తేమశాతం నిబంధనల ప్రకారమే ఉంది. వ్యాపారులు క్వింటాలుకు రూ.2,500 ధర పెట్టారు. రూ.3 వేలకైనా కొనండని ప్రాధేయపడ్డా. ఎంత మాత్రం కనికరించలేదు. మరీ అడిగితే మాకొద్దు అని సమాధానం చెప్పారు. 45 ఏళ్ల వ్యవసాయ జీవితంలో ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదు. కిలో పత్తి తీసినందుకు కూలీలు రూ.12 చొప్పున తీసుకుంటున్నారు. అంటే పత్తి ధరలో సగం కూలీలకే పోతుంది. పెట్టుబడుల్లో సగం కూడా పూడని పరిస్థితి ఉంది. పత్తి సాగు ద్వారా ఈ ఏడాది సుమారు రూ.1.80 లక్షల నష్టం వచ్చేట్లు ఉంది. --పగడవరపు రామకృష్ణ, గోపవరం, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా వ్యాపారులదే రాజ్యం పత్తిని తేమ శాతానికి అనుగుణంగా గ్రేడింగ్ చేసి తెచ్చా. కానీ క్వింటాలుకు రూ. 4,100కే కొనుగోలు చేశారు. ఇంతకంటే దారుణమేముంది? మంచి ధర పలికే కాలంలో ఇలాంటి పత్తి క్వింటాలుకు రూ.7–8 వేలు పలికింది. ఇప్పుడు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీసీఐ అడ్రస్ లేదు. ఎక్కడున్నారో కూడా తెలియడంలేదు. రైతు మందు తాగి చావాల్సిన పరిస్థితి తెస్తున్నారు. -- కొమ్ము నాగయ్య, లచ్చగూడెం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా వ్యాపారులను కూర్చొబెట్టి మాట్లాడుతున్నాం వ్యాపారులను కూర్చొబెట్టి రైతులకు సరైన ధర ఇచ్చేలా మాట్లాడుతున్నాం. ఇటీవల కురిసిన వర్షాలతో ధర తక్కువగానే పలుకుతోంది. నిబంధనల ప్రకారం లేకపోవడంతో ధర తక్కువగా ఉంటోంది. తేమ శాతం ఆధారంగానే నిబంధనల ప్రకారం వ్యాపారం జరుగుతోంది. -- రత్నం సంతోష్కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, ఖమ్మం మరి రైతులు ఎక్కడకు పోవాలి? ఇది ఖమ్మం మార్కెట్లో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం! ఫ్లెక్సీ తప్ప ఎక్కడా కొనుగోలు కేంద్రం కనిపించడం లేదే అనుకుంటున్నారా? అయినా ఇది కొనుగోలు కేంద్రమే. ఇలా కేవలం ఒక ఫ్లెక్సీని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గోడకు తగిలించేశారు. దాన్నే కొనుగోలు కేంద్రం అనుకోమన్నారు. అక్కడ సీసీఐ సిబ్బంది ఒక్కరూ లేరు. కాంటా లేదు. తేమ శాతం గుర్తించే యంత్రమూ లేదు. కనీసం ఓ కుర్చీ కూడా లేదు!! -
జేబులకు ‘పరీక్ష’ పెడుతున్న ‘కాసు’పత్రులు
⇒కార్పొరేటు, ప్రైవేటు హాస్పిటళ్ల నిలువుదోపిడీ ⇒అవసరం ఉన్నా.. లేకున్నా అడ్డగోలు పరీక్షలు ⇒యంత్రాలు ఖాళీగా ఉంటే నష్టమంటూ వైద్యులకు టార్గెట్లు ⇒రాత్రివేళల్లోనూ మిషన్లు పనిచేయిస్తే.. నజరానాలు ⇒పరీక్షల ఫీజులు డయాగ్నస్టిక్ సెంటర్లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ⇒రిఫరల్స్ పేరిట ప్రైవేటు అంబులెన్సులకూ వాటా ⇒బ్రోకర్ల వ్యవస్థతో విష వలయంలా మారిన ప్రైవేటు వైద్యం సాక్షి ప్రత్యేక బృందం: కిడ్నాపరు గొంతుపై కత్తి పెడతాడు. డబ్బులిస్తావా! చంపేయాలా? అని బంధువులకు ఫోన్ చేస్తాడు. అంత డబ్బులివ్వలేని వాళ్లకు కనీసం ఏ పోలీసులకో చెప్పే అవకాశం ఉంటుంది. తమ వారిని రక్షించుకునే చాన్సు కొంతయినా ఉంటుంది. కానీ.. ఆసుపత్రి బెడ్పై ఉన్న వ్యక్తికి అప్పటికప్పుడు సర్జరీ చేయాల్సిందేనని డాక్టరు చెబితే!? రెండు సందర్భాల్లోనూ ప్రాణానికి ప్రమాదమే. కాకపోతే ఇక్కడ వేరొకరి సాయం తీసుకోవటమో... మరొకరిని సంప్రదించటమో దాదాపు అసాధ్యం! ఎందుకంటే అంత సమయం ఉండదు. ఆ వైద్యుడో.. ఆసుపత్రో తన విధి తాను నిర్వర్తించి చికిత్స చేస్తే ప్రాణం దక్కొచ్చు. ఆస్తులు అమ్మి, అప్పులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ వారు అదే అవకాశంగా తీసుకుని డబ్బే పరమావధిగా... అందినంత గుంజి పడేయాలని భావిస్తే...!! పైన చెప్పిన కిడ్నాపర్లకూ వీళ్లకూ తేడా ఏమీ ఉండదు. దురదృష్టవశాత్తూ కొన్ని ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు, కొందరు డాక్టర్ల విషయంలో జరుగుతున్నది ఇదే!! చికిత్స మాట దేవుడెరుగు. పరీక్షల నుంచే దోపిడీ మొదలైపోతోంది. సదరు ఆసుపత్రులు చేసే పరీక్షలకే ఉన్న డబ్బంతా ఖర్చయిపోయి చికిత్స ఊసు మరిచి పోయి వెనుదిరిగిన పేదలున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది దందా కాదా..? ఉదాహరణకు ఆదిలాబాద్కు చెందిన రమేలి రాజేశ్వర్నే తీసుకుందాం. నెల కిందట ఆయన తండ్రికి గుండెనొప్పి వచ్చింది. అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ‘ఏం కాదు. మామూలు నొప్పే’ అని చెప్పి పంపేశాడాయన. ఐదారు రోజులు గడవకుండానే మళ్లీ ఛాతీలో నొప్పి!! నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చారు. బాగా పేరున్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. యాం జియోగ్రామ్ సహా కొన్ని పరీక్షలు చేశారు. కాకపోతే అవేవీ ‘ఆరోగ్య శ్రీ’ పరిధిలోకి రావన్నారు. ఆ పరీక్షలకే.. రూ.40 వేలు బిల్లయింది. ఇన్ని పరీక్షల తర్వాత బైపాస్ సర్జరీ చేయాలని తేల్చారు ఆసుపత్రి వైద్యులు. ఆ సర్జరీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదంటూ.. దానికి రూ.4 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఎన్ని అమ్మినా అంత డబ్బు తేలేనని రాజేశ్వర్ చెప్పటంతో.. మాత్రలిచ్చి పంపించేశారు. మరో ఆసుపత్రయితే బాగుంటుందేమోనని భావించిన రాజేశ్వర్.. తన తండ్రిని ఇంకో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అంతకుముందు ఆసుపత్రిలో చేసిన పరీక్షల రిపోర్ట్లు అన్నీ చూపించాడు. అక్కడి డాక్టర్లు మళ్లీ పరీక్షలు చేయాల్సిందేనన్నారు. అప్పుడే కరెక్ట్గా చెప్పగలమనటంతో అక్కడా పరీక్షలు చేయిం చాడు. వాటికి రూ.20 వేలు ఖర్చయ్యాయి. అక్కడ కూడా సర్జరీ అవసరమన్నారు. అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని... కాబట్టి జీవితాంతం మందులు కొనసాగించాలని చెప్పి పంపేశారు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. రాజేశ్వర్ తండ్రి పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఆయనకు ఎలాంటి చికి త్సా జరగలేదు. ముందు ఎలా ఉన్నాడో... ఇప్పుడూ అలానే ఉన్నాడు. కాకపోతే బైపాస్ అవసరమని తేల్చడానికి రూ.60 వేలు ఖర్చయింది. ఆ మేరకు రాజేశ్వర్ అప్పులపాలయ్యాడు. అయినా ఒక ఆసుపత్రిలో పరీక్షలు చేశాక.. మరో ఆసుపత్రి కూడా అవే పరీక్షలు చేయటంలో అర్థమేంటి? ఇది దందా కాదా? అవే పరీక్షలకు ఒక ఆసుపత్రిలో రూ.20 వేలై తే మరో ఆసుపత్రిలో రూ.40 వేలు ఎందుకైంది? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒక్కటే. ప్రైవేటు ఆసుపత్రు ల్లో దోపిడీ అనేది పరీక్షల నుంచే మొదలవుతోంది. ఎమ్మారైతో ఏమార్చి.. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు అవసరం లేని పరీక్షలు చేయటంలోనే కాదు.. ఆ పరీక్షలకు వసూలు చేసే ఫీజుల్లోనూ ‘ప్రత్యేకత’ ప్రదర్శిస్తుంటాయి. కార్పొరేట్ లెక్కల ప్రకరాం.. ఒక ఎమ్మారై మిషిన్ను ఖాళీగా ఉంచితే కూడా దానివల్ల వాటికి నష్టం వస్తుంది. అందుకోసం ఆసుపత్రుల యాజమాన్యాలు తమ డాక్టర్లకూ, విభాగాల నిపుణులకు కోటాలు విధిస్తాయి. అవసరం లేకపోయినా ఎమ్మారై పరీక్షలు రాయాలని డాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తుంటాయి. ఈ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. తమ సంస్థలో పనిచేసే డాక్టర్లనేగాక, బయట తమకు తెలిసిన ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లను కూడా ఇందులో భాగం చేస్తారు. వాళ్లంతా తమ దగ్గరకు వచ్చే రోగులకు ‘‘ఎమ్మారై పరీక్ష యం త్రాలు బిజీగా ఉంటాయి. అదిగో.. అక్కడ రాత్రిళ్లు కాస్త ఖాళీగా ఉంటుంది. మంచి టెక్నీషియన్ ఉంటారు. రాత్రిళ్లు చేయించుకుంటే కొంత ఖర్చు తగ్గుతుంది’’ అని ప్రలోభపెట్టి, అవసరం లేకపోయినా ఆ పరీక్షలు చేయిస్తుంటారు. ఇలా పంపిం చినందుకు వారికి తగిన ప్రతిఫలం ముడుతుంది. కాస్త నిజాయితీగా ఉండి, మనస్సాక్షి అంగీకరించక.. ఇందుకు ఒప్పుకోని డాక్టర్లను సదరు ప్రైవేటు యాజ మాన్యాలు వేధించి బయటకు పంపేస్తాయి కూడా! అవసరం లేకున్నా పరీక్షలూ... రోగ నిర్ధారణ పరీక్షలు బీమా పరిధిలోకి రావు. ఆరోగ్య బీమా ఉన్నవారు కూడా సొంత ఖర్చులపై చేయించుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఏదైనా ఆసుపత్రిలో 24 గంటలపాటు అడ్మిట్ అయితే.. అప్పుడు చేయించుకున్న పరీక్షలకు బీమా వర్తిస్తుంది. ఈ లొసుగును ఆసరా చేసుకున్న కొంతమంది.. హెల్త్ చెకప్ కోసమని ఆసుపత్రిలో చేరి 24 గంటలపాటు అడ్మిట్ అవుతున్నారు. ఇదే అదనుగా వారికి భారీ రేట్లతో మొత్తం పరీక్షలు చేసి బీమా కంపెనీల నుంచి సొమ్ము గుంజుతున్నాయి ఆసుపత్రులు. బీమా కంపెనీలు అధిక సంఖ్యలో పాలసీదార్ల నుంచి ప్రీమియం వసూలు చేసి.. దాన్ని క్లెయిమ్ చేసిన కొద్ది మందికి చెల్లిస్తూ ఉంటాయి. ఈ క్లెయిమ్లు పెరిగే కొద్దీ బీమా కంపెనీలు ప్రీమి యం మొత్తాన్ని కూడా పెంచేస్తుంటాయి. అంటే అంతిమంగా నష్టపోయేది పాలసీదారులే. ఏజెంట్లకు ముద్దుపేరు... రిఫరల్స్ మనం అద్దె ఇల్లు చూయించినందుకు బ్రోకర్కు కమీషన్ ఇస్తాం. కార్పొరేట్ ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లడానికి కూడా అంచెలంచెలుగా ఈ బ్రోకర్ల వ్యవస్థ ఉంది. కాకపోతే దీన్ని గౌరవంగా ‘రిఫరల్’ వ్యవస్థగా పిలుస్తుంటారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వాటి చుట్టు పక్కలుండే ఆర్ఎంపీలు రోగుల్ని పంపిస్తుంటారు. ఉదాహరణకు గుంటూరులో ఉండే డాక్టరు.. తన పేషెంట్కు చిన్న చీటీ ఇచ్చి హైదరాబాద్కు పంపిస్తాడు. ‘అరె! ఈ డాక్టర్ పెద్దాసుపత్రికి పంపిస్తున్నాడు. చాలా మంచాయన’ అని సంతోషిస్తూ హైదరాబాద్కు వస్తారు. అయితే అలా పంపినందుకు ఆ ఆర్ఎంపీకి కమీషన్ ముడుతుందనే విషయం వారికి తెలియదు. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వాళ్లకు అందే డబ్బును ‘ఆర్ఎంపీ రిఫరల్’గా వ్యవహరిస్తుంటారు. ప్రైవేటు అంబులెన్స్ల వాళ్లు రోగిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళితే వారికి చెల్లించే మొత్తాన్ని ‘అంబులెన్స్ రిఫరల్’గా వ్యవహరిస్తున్నారు. వీటన్నిటితోపాటు ప్రైవేటువ్యక్తుల్ని ఏజెంట్లుగా పెట్టుకుని పక్కా మార్కెటింగ్ చేస్తున్న కొన్ని ఆసుపత్రులకు ‘మనీ’తత్వం తప్ప మానవత్వం ఉందనుకోగలమా? ప్రభుత్వ ఉద్యోగులకు సహాయకులుగా.. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు చికిత్స కోసం చేసే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ఇందుకు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఈ నిధుల చెల్లింపు విభాగం కూడా ఉంటుంది. రోగుల నిధులను ఇవి పెద్ద మొత్తాలలో విడుదల చేస్తుం టాయి. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కార్పొరేట్ సంస్థలు ఆశించినంత వేగంగా పనిచేయవు. డబ్బు అందడంలో జాప్యం జరిగితే దాన్ని కూడా తీవ్ర నష్టంగానే పరిగణిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు.. ఇలా నిధులందించే విభాగాల ఉద్యోగులకు సహా యం కోసం ప్రైవేటు సిబ్బం దిని ఏర్పాటు చేస్తున్నా యి. ‘ఇన్ని ఫైల్స్ క్లియర్ చేసినందుకు ఇంత మొత్తం’ అనే రీతిలో ముడుపులు అందజేయటం వీరి పని. కేంద్రం ఇచ్చే రేట్లకు మూడునాలుగు రెట్లు! వ్యాధి నిర్ధారన పరీక్షల కోసం కార్పొరేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న రేట్లు చూస్తే గుండె గుభేలుమంటుంది. పేరున్న డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా సీజీహెచ్ఎస్ కింద కేంద్రం నిర్దేశించిన రేట్లకు మించి భారీగా వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న రేట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువనే చెప్పాలి. రేట్ల తేడా ఇదిగో... రాయితీలు పొందారు.. సేవలు మరిచారు.. ఎమ్మారై, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్సరే తదితర మిషన్లలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రభుత్వం వీటికి రాయితీ కూడా ఇస్తుంది. మిషనరీపై ప్రభుత్వం నుంచి రాయితీ పొందినందుకు ఒప్పందం ప్రకారం కార్పొరేట్ ఆస్పత్రుల్లో 20 శాతం ఉచిత సేవలు అందించాలి. అయితే హైదరాబాద్లో ఒక్క ఆస్పత్రి కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చివరకు వైద్య సేవల పేరుతో ఆస్పత్రుల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి ఖరీదైన భూములు పొందిన హాస్పిటళ్లు సైతం వీటిని అమలు చేయడం లేదు. ఒకే కంపెనీకి చెందిన యంత్రాల్లో, ఒకే పరీక్షలకు వేర్వేరు చార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న రోగ నిర్ధారణ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం.. ఈ అంశాన్ని పట్టించుకున్న దాఖలాలు మచ్చుకైనా కన్పించడం లేదు. దోపిడీలో ఆర్ఎంపీల పాత్ర ఇదీ.. కరీంనగర్ హెల్త్: కార్పొరేట్ ఆసుపత్రులు ఆర్ఎం పీలతో రోగులను రప్పించుకుంటూ ఎంత పక్కాగా దోపిడీకి పాల్పడుతున్నాయో తెలిపే ఘటన ఇదీ. మంగళవారం కరీంనగర్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలోకి వెళ్లగా సాక్షి విలేకరికి కనిపించిన దృశ్యాలివీ.. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్కు చెందిన ఎన్.సమ్మక్క(54) కాళ్లు, కీళ్లు, మెడ నొప్పులతో బాధపడుతోంది. ఆమె నివాసముండే ప్రాంతంలో ఓ ఆర్ఎంపీ.. ఆమెను కరీంనగర్లో పేరున్న కార్పొరేట్ ఆస్పత్రికి అంబులెన్స్లో తీసుకొచ్చాడు. డ్రైవర్ రిసెప్షన్ సిబ్బంది ఇచ్చిన కవర్ తీసుకుని వెళ్లిపోయాడు. ఆర్ఎంపీ ఆసుపత్రిలోనికి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చా డు. సమ్మక్కను లోపలికి తీసుకువెళ్లాడు. న్యూరోఫిజిషియన్.. వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్నా రు. ‘‘నరాల సమస్య ఉందమ్మా. మంచి మం దులు రాస్తాను. ముందుగా మెదడు, వెన్నుపూసకు వేర్వేరు ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలు చేయిం చండి’’ అని చీటీ రాసిచ్చాడు. స్కానింగ్ వద్దకు వెళితే అక్కడ.. ‘‘రూ.12 వేలు ఇవ్వండి. వీటితోపాటు రక్తం, మూత్ర పరీక్షకు మరో వెయ్యి..’’ అన్నారు. కొంచెం తగ్గించండని రోగి బతిమాలుకోగా పక్కనే ఉన్న ఆర్ఎంపీ అక్కడున్న సిబ్బం దికి సైగచేశాడు. కార్పొరేట్ ఆస్పత్రిలో బిల్లు తగ్గింపు ఉండదని నచ్చచెప్పాడు. సమ్మక్క రూ.13 వేల బిల్లు చెల్లించింది. అరగంటలో రిపోర్టు అందింది. డాక్టర్ దాన్ని పరిశీలించి రూ.2,700 మందులు రాశాడు. ఈ మందులు రెండు వారాలకే రాశాడని చెబుతూ ఆ ఆర్ఎంపీ.. డాక్టర్ను కలిసేందుకు లోపలికి వెళ్లాడు. కాసేపటికే డాక్టర్ ఇచ్చిన కమీషన్ కవర్ను జేబులో సర్దుకుంటూ నవ్వుతూ బయటకి వచ్చాడు. ఓ తండ్రి గుండెకోత.. సాక్షి, హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచుకుం టున్న బాబు మరణించాడన్న గుండెకోత ఓవైపు.. మృతదేహం అప్పగించాలంటే లక్షల బిల్లు కట్టాలంటూ ఆసుపత్రి ఒత్తిడి మరోవైపు! ఈ రెండింటి మధ్య ఓ తండ్రి గుండె విలవిల్లాడిపోయింది. ఆవేదన ఆయన మాటల్లోనే.. ‘‘ప్లేట్లెట్లు పడిపోవడంతో ఆగస్టు 29న బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ పిల్లల ఆస్పత్రిలో నా కొడుకు ప్రజయ్ నిహాల్(తొమ్మిది నెలలు) జాయిన్ చేశాం. శుక్రవారం వరకు రికవరీ అవుతున్నారని చెప్పి, శనివారం ఉదయం నుంచి సీరియస్గా ఉందన్నారు. ‘మేం చేయాల్సింది అంతా చేశాం.. మీ బాబును కాపాడలేకపోయాం’ అని మంగళవారం చెప్పారు. రూ.6.43 లక్షల బిల్లుకుతోడు మరో రూ.50 వేల నాన్ మెడికల్ బిల్లు ఇచ్చా రు. ఇన్సూరెన్స్ కంపెనీ క్లియరెన్స్ వచ్చాకే బిల్లు క్లియర్ చేసి బాడీని తీసు కెళ్లమన్నారు. ఈ పరిస్థితి మరెవరికీ రావొద్దు’’ - వినయ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కూకట్పల్లి, హైదరాబాద్ వైద్య పరీక్ష కార్పొరేటు ఆసుపత్రులు సీజీహెచ్ఎస్(రూ.ల్లో) ఓపీడీ కన్సల్టేషన్ 500 - 600 135 ఈసీజీ పరీక్ష 180 - 300 58 సీరమ్ క్రియాటినిన్ 200 - 250 58 టీఎస్హెచ్ 500 - 600 104 హీమోగ్రామ్ (రక్తపరీక్ష) 500 - 700 140 2డి ఎకో 1,500 - 2,000 1,242 ఎల్ఎఫ్టీ 900 - 1,000 245 చాతీ ఎక్స్రే 300 - 500 69 బ్లడ్ షుగర్ రాండమ్ 160- 250 25 హెచ్బీఏ1సీ 850 - 1000 616 బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ 200 - 250 25 లిపిడ్ ప్రొఫైల్ 850 - 1,000 616 యూఎస్జీ అబ్డామిన్ 1,200-1,500 371 విటమిన్-డి 2,500 - 3,000 633 కదులుదాం.. కదిలిద్దాం సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి ‘సాక్షి’తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘సాక్షి’కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి. లేఖలు, మెయిల్స్ పంపాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 sakshihealth15@gmail.com