పాఠశాలలోకి నాగుపాము
భయభ్రాంతులకు గురైన పిల్లలు
చౌడేపల్లె(చిత్తూరు): తరగతి గదిలోకి నాగుపాము రావడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురైన సంఘటన బుధవారం చౌడేపల్లె మండలంలోని బూరగపల్లె ప్రాథమిక పాఠశాలలో చోటచేసుకుంది. ఈ పాఠశాలలో 36 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బుధవారం తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్న సమయంలో ఉన్నట్టుండి ఓ పెద్ద నాగుపాము తరగతిలోకి వచ్చింది.
టీచర్లు అప్రమత్తమై విద్యార్థులను చాకచక్యంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం స్థానికులు పామును గుర్తించి చంపేశారు. పాఠశాలకు సరైన దారి, ప్రహరీ లేకపోవడంతో పాములు తరగతి గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. సమయానికి ఏం జరుగుతుందోనని హడలిపోతున్నారు. అధికారులు స్పందించి పాఠశాలకు దారి ఏర్పాటుచేసి ప్రహరీ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.