breaking news
Bobbili Assembly Constituency
-
బొబ్బిలి సీటు బీసీలకు ఇచ్చే దమ్ముందా?
రామభద్రపురం: బీసీ సామాజికవర్గం తన ఆత్మీయులని ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు నాయుడికి బొబ్బిలి ఎమ్మెల్యే సీటును బీసీలకు కేటాయించే దమ్ము, ధైర్యం ఉందా? అని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ స్థానిక కార్యాలయంలో ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల మీద అంతప్రేమ ఉన్న వ్యక్తి బొబ్బిలిలో రాజులకెందుకు పెత్తనం అప్పగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులు, మహిళలకు ఏదేదో చేస్తానని వాగ్దానాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 40 ఏళ్లు రాజకీయ అనుభవం, పధ్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు దిగజారుడుతనంతో మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఓట్లతో గెలిచి, టీడీపీలోకి వచ్చి మంత్రి పదవి పొంది నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా అవినీతి, కబ్జాలకు పాల్పడిన వారిని పక్కనే పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మత్రులు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు నోరుపారేసుకోవడం విచారకరమన్నారు. పేదల పక్షాన జగన్ తెలుగుదేశం, దాని తోక పార్టీలు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని ఆరోపణలు చేసినా వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని, అది బొబ్బిలితోనే ఆరంభమవుతుందన్నారు. రాష్ట్రంలో పెత్తందారులు, పేదల మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదల పక్షాన నిలిచిన సీఎం వైస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు అప్పికొండ లక్ష్మునాయుడు, మండల జేసీఎస్ కన్వీనర్ సింహాచలం నాయుడు, వైస్ ఎంపీపీ బెల్లాన ప్రసాద్, మండల యూత్ ప్రెసిడెంట్ పత్తిగుళ్ల ఏక్నాథ్, మండల ఉపాధ్యక్షుడు డర్రు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగువాళ్లు నా వల్లే బాగుపడ్డారు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి ప్రతినిధి, కాకినాడ/తుని: తెలుగువాళ్లు తన వల్లే బాగుపడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పుకొన్నారు. టెక్నాలజీకి ప్రాముఖ్యత కల్పించి ముందుగా తాను తీసుకున్న నిర్ణయం వల్లే ప్రపంచమంతా తెలుగువారు రాణిస్తున్నారని అన్నారు. తాను ఆరోజు కష్టపడితేనే ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. ఈరోజు హైదరాబాద్పై తన ప్రగాఢ ముద్ర కనపడుతోందని అన్నారు. రా కదలి రా పేరుతో బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. అబద్ధాలు, ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. ఇటీవల తనకు కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో సంఘీభావం ప్రకటించారని, అదీ తన సత్తా అని చెప్పారు. ఐదేళ్లుగా మన రాష్ట్రం వెనుకబడిపోయిందని, తామొస్తే ప్రజల భవిష్యత్తు బంగారం చేస్తానని అన్నారు. యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, కరెంటు చార్జీలు తగ్గిస్తాం అంటూ పలు హామీలు గుప్పించారు. తాను చంద్రన్న బీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్నది రద్దుల ప్రభుత్వమని, పేదవాడి వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. నోటికొచ్చినట్లు... ‘పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో పెడతారా? ఆయనో ఏసుప్రభువు. ఎక్కడకు పోతున్నారు? ఆయన పంపించారా ఏసు ప్రభువని? సర్వే రాళ్లపై ఆయన ఫొటో ఏంటి? భూ రక్షణ కాదు. భూ భక్షణ చట్టం. ఇది అమలయితే మీ ఇల్లు మీది కాదు. మీ భూమి మీది కాదు. కబ్జా అయితే నేరుగా హైకోర్టుకు పోవాలి. మీ రికార్డులు తారుమారు చేస్తున్నాడు జగన్. దీనికి మద్దతు ఇవ్వం’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. బొత్సపై నోరు పారేసుకున్న బాబు ‘ఉత్తరాంధ్రలో బొత్స ఉన్నాడు. మనిషి లావు. ఆయనేం చెబుతాడో మనకు అర్థం కాదు. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వచ్చారు. బొత్స మాట్లాడడు. పెత్తందార్లకు పెత్తనం’ అంటూ దుర్భాషలాడారు. దేశంలో ధనిక ముఖ్యమంత్రుల్లో నంబర్ వన్ పెత్తందారు జగన్ అన్నారు. తునిలో మంత్రి రాజా చెక్ పోస్టులలో వసూళ్లు. మామూళ్ల దెబ్బకు జనం పారిపోతున్నారన్నారు. బియ్యం మాఫియాకు కర్త, కర్మ, క్రియ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడినే అని ఆరోపించారు. కార్యకర్తలపైనే చులకన మాటలు ఈ సభల్లో కార్యకర్తలపైనే చంద్రబాబు చులకనగా మాట్లాడారు. ‘మా తమ్ముళ్లు మందు బాబులు. సాయంత్రం క్వార్టర్ వేసుకుని నిద్రపోదామనుకుంటారు. మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే బాదుడే బాదుడు. 50 రూపాయల బాటిల్ ఇప్పుడు రూ.200కు అమ్ముతున్నారు. మద్యం ధరలు పెంచి కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు’ అంటూ ఆరోపించారు. ‘టీడీపీ, జనసేన జెండాలు పట్టుకుని ఇంటింటికీ వెళ్లండి. గ్లాసు కూడా తీసుకెళ్లండి. నీళ్లు తాగడానికి పనికొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. పోతాం.. మేమెళ్లిపోతాం.. ‘రా కదిలి రా’ అంటూ టీడీపీ నిర్వహించిన ఈ సభలకు టీడీపీ నేతలు రూ.300ల నుంచి రూ.500 నగదు, క్వార్టర్ మందు, పలావు ప్యాకెట్ ఇచ్చి జనాన్ని అయితే తీసుకు వచ్చారు కానీ, చంద్రబాబు ప్రసంగం అయ్యే వరకు వారిని ఆపలేకపోయారు. పార్టీ కేడర్ ఎంత ప్రయత్నించినా జనం వెళ్లిపోయారు. చంద్రబాబు ప్రసంగం మొదలైన కొద్ది సేపటికే సగం కుర్చీలు ఖాళీ అయిపోయాయి. ముఖ్యంగా మహిళలు మూకుమ్మడిగా లేచి వెళ్లిపోవడంతో పార్టీ కేడర్ చేతులెత్తేసింది. కుర్చీలు ఖాళీ అయిపోయినా, చంద్రబాబు మాత్రం ఎక్కడా ఆపకుండా రెండు సభల్లోనూ గంటకు పైగా ఏకబిగిన ప్రసంగించారు. బొబ్బిలి సభకు పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గైర్హాజరయ్యారు.