breaking news
bhuggana rajendranath
-
తాకట్టులో ఖజానా: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ నుంచి రూ.9 వేల కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇది దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యకు అనుమతించిన అధికారులు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. బుగ్గన గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులకు స్కీంకూటమి ప్రభుత్వం కొత్తగా బడ్జెట్ వెలుపల భారీ అప్పులు చేయడం ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా అప్పులు చేయాలని స్కీం ప్రారంభించారు. ఏపీఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులు చేయాలనేదే ఈ స్కీం. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీ) బాండ్స్ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీ ఎక్కువగా ఔట్ సోర్సింగ్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఆ సంస్థకు మూలధన వ్యయం పెద్దఎత్తున అవసరం లేదు. కానీ, రూ.9 వేల కోట్లు కావాలని బాండ్లు జారీ చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదు..ఇండియా రేటింగ్స్ సంస్థ ప్రభుత్వ ఆదాయం గతేడాది అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. 1.3 శాతమే వృద్ధి కనిపిస్తోందని, ద్రవ్యలోటు స్థూల ఉత్పత్తిలో 4.2 శాతం ఉండాల్సి ఉంటే 4.6 శాతానికి పెరిగిందని చెప్పింది. అయినా ‘సీఈ’ రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే.. డిబెంచర్ కొనుగోలుదార్లకు డీఎస్ఆర్ఏ ఖాతాలో నిల్వ లేకపోతే నేరుగా ఆర్బీఐ నుంచి నిధులు జమయ్యేందుకు అంగీకరించడం వల్లే. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఏపీ ఎండీసీ గత వార్షిక నివేదికలో 9 నెలలకు రెవెన్యూ రూ.910 కోట్లుగా ఉంది. 12 నెలలకు చూస్తే సుమారు రూ.1200 కోట్లు వస్తుంది. కానీ వీరు చేస్తున్న అప్పులు, డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగా పెట్టే 6 నెలల నిల్వలతో కలిపి చూస్తే రూ.10 వేల కోట్లు. వీరి ఆదాయంతో పోలిస్తే చేస్తున్న అప్పులు ఎనిమిది రెట్లు ఎక్కువ. దీనిని ఏ బ్యాంక్ కూడా అంగీకరించదు.గతంలో ఎక్కడా లేని విధానం..ఇటువంటి నిబంధనలు, వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఖజానాలో ఏ కారణంతో అయినా నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసినవారికి వెళ్లిపోతాయి. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల కోసం ముందుగానే నిర్దేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం.. అంటే మూడో భాగం కచ్చితంగా ఉంచాలి. ఇలా ప్రతి నెల ఉంచాలి. ఇదికాకుండా డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్(డీఎస్ఆర్ఏ) ఖాతాలో 6 నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిల్వగా చూపుతూ రావాలి. ఈ నిధులు తగ్గిపోతే ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నేరుగా బాండ్లు కొన్నవారికి వెళ్లిపోతాయి. ⇒ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే.. గనులను తాకట్టులో ఉంచుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. నాడు బెవరేజెస్ కార్పొరేషన్పై అప్పులు తెస్తే భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టుపెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇవాళ గనులను తాకట్టుపెట్టడమే కాక... ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలన్నింటినీ తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీ రెవెన్యూ అంతా ఒకే ఖాతాలోకి వచ్చేలా నిబంధన పెట్టారు. ఆ ఖాతాను సంపూర్ణంగా అప్పుల కోసం తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీకి వచ్చే ఒక్క రూపాయి అయినా ఇతర పనులకు వాడుకునే అవకాశం లేదు.మిసిలేనియస్ జనరల్ హెడ్కు ఇంత భారీ కేటాయింపులా?2025–26 రాష్ట్ర బడ్జెట్లో మిసిలేనియస్ జనరల్ హెడ్–0075 కింద ప్రభుత్వం రూ.7,916 కోట్లు చూపించింది. ఇవి ప్రత్యేకంగా ఏ డిపార్ట్మెంట్కు కేటాయించని ఖర్చులు. చిన్న చిన్న వ్యయాలకు ఈ నిధులను వాడతారు. ఈ హెడ్ కింద 2016 –17లో రూ.131 కోట్లు, 2017 –18లో రూ.307 కోట్లు, 2018 –19లో 135 కోట్లుగా ఉండేది. 2023–24లో రూ.153 కోట్లు, 2024–25లో రూ.226 కోట్లు చూపించారు. కానీ, మొదటిసారి ఏపీ చరిత్రలో ఈ హెడ్ కింద 2025–26కి గానూ రూ.7,916 కోట్లుగా చూపించారు. అంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఆ హెడ్లో చూపించి కూటమి ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులకు ఇష్టం వచ్చినట్లు వాడేందుకు సిద్ధమయ్యారు. ⇒ గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఇలాగైతే చైనా వంటి దేశాల్లో అధికారులను ఉరి తీస్తారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న పనులకు అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. ఏపీఎండీసీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వారికి తాకట్టు పెడుతున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే?తాజా అప్పులూ రాష్ట్ర అప్పుల పరిమితి కిందకేఎప్పుడైతే ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందకు వస్తుంది. రాష్ట్ర అప్పుల పరిమితి కింద రాష్ట్రం చేసే అప్పులకు 7 శాతం కన్నా తక్కువ వడ్డీ పడుతుంది. కానీ ప్రభుత్వం తాజాగా చేయబోయే అప్పు కూడా దీని కిందే వస్తుంది, కానీ దాదాపు 10 శాతం వడ్డీ పడుతుంది. దీనికి బ్రోకరేజీ అదనం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్గా తీసుకుని పోయేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘన. రాజ్యాంగంలోని 293(1), 293(3), 203, 204 ఆర్టికల్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. అధికారులు దీనిని గుర్తించాలి.ఇదేనా సంపద సృష్టి అంటే?రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీలు అబద్ధాలు చెప్పాయి. మొదట్లో రూ.14 లక్షల కోట్ల అప్పులన్నారు. తరువాత రోజుకో రకంగా అప్పులపై అంకెలను మారుస్తూ మట్కా లెక్కల స్థాయికి తెచ్చారు. వైఎస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.3,32,500 కోట్లే. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశారు. 11 నెలలకు రూ.90 వేల కోట్ల మేరకు ఆర్బీఐ ద్వారా అప్పు చేసింది. మార్చి 2025లో రూ.8 వేల కోట్లు అడ్వాన్స్గా తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మరో రూ.5 వేల కోట్ల అప్పు చేశారు. అమరావతి అప్పులు, బాండ్లు, మార్క్ఫెడ్, సివిల్ సప్లయిస్ అప్పులు తదితర అన్నీ కలిపితే రూ.1,47,655 కోట్లు అప్పులు చేశారు. ఈ సొమ్ము ఎక్కడకు వెళ్ళింది? మా ప్రభుత్వ హయాంలో ఏటా పేదలకు సంక్షేమ పథకాలను అందించాం. ఈ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. మరి అప్పులు చేసిన సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉద్యోగుల సొమ్ము రూ.76,516 కోట్లు వాడుకుంది. -
ఏపీ చరిత్రలో ఇది బ్లాక్ డే
సాక్షి, అమరావతి: పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపడం దారుణం అని, ఈ రోజు ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. బుధవారం శాసనమండలిలో ఏపీ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన అనంతరం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘చట్టసభలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదు. శాసనమండలి గ్యాలరీ నుంచి చైర్మన్కు డైరెక్షన్ ఇచ్చి, వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్నారు. వంద సంవత్సరాల చరిత్ర చూసి.. ప్రభుత్వం రెండు బిల్లులను తీసుకొచ్చింది. శాసనసభ ఆమోదించినా మండలి వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధం. బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ)లో యనమల రామకృష్ణుడు మాట్లాడిన దానికి, చేసిన దానికి పొంతన లేదు. రూల్ 71ని అడ్డుపెట్టుకుని సభను పక్కదారి పట్టించారు. రూల్ 71 అనేది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. బిల్లును ప్రవేశపెట్టే సమయంలోనే సెలెక్ట్ కమిటీకి పంపించాలంటే ఒక మోషన్ పెట్టాలి. మొదట ఇది చేయకుండా చివర్లో మోషన్ బిల్లు పెడుతున్నట్లు తాజా తేదీ వేసి సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపించాలని కుట్రలు చేశారు. రూల్స్ను విస్మరిస్తూ.. చివరకు ఇదంతా తప్పు అని, అయినా కూడా విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చైర్మన్ చెప్పారు. రూల్ 71ని అడ్డుపెట్టుకుని బిల్లులకు అడ్డుపడి.. పార్టీకి చైర్మన్ లొంగిపోతే ప్రజల పరిస్థితి ఏంటి? మా నాయకుడు చెప్పినట్లు చేస్తున్నానని చైర్మన్ చెప్పినట్లుగా ఉంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా వ్యవహరించడం దుర్మార్గం. రెండు రోజులుగా బిల్లును ఓటింగ్కు పెట్టకుండా కావాలనే అడ్డుకున్నారు. చంద్రబాబు మాటలు విని మండలి చైర్మన్ నడుచుకుంటారా? చైర్మన్గా తప్పు చేసి, విచక్షణాధికారాలను ఉపయోగించానని ఎలా చెబుతారు? సభను చైర్మన్ రాజకీయాల కోసం వినియోగించారు. 13 జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నారు.. ఆ తర్వాత శాసనసభలో 90 శాతం మెజారిటీతో ఆమోదించిన బిల్లులను మండలిలో ఎలా అడ్డుకుంటారు?’ అని బుగ్గన మండిపడ్డారు. బాబు కనుసన్నల్లో మండలి చైర్మన్ శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్.. చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకున్నారని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. ఒక పార్టీ అధ్యక్షుడు చెబితే చైర్మన్ చేయడం సిగ్గుచేటని.. చంద్రబాబు, చైర్మన్లు చరిత్రహీనులుగా మిగిలిపోతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘శాసన మండలిలో ఈ రోజు జరిగిన ఘటన చట్టసభలకు మాయని మచ్చ. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వ్యహరించాలని మంగళవారం నుంచి చైర్మన్ను కోరుతున్నాం. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి అసెంబ్లీలో రెండు బిల్లుల్ని ఆమోదించాం. వాటిని మండలి ఆమోదించాలి... లేదా సలహాలివ్వాలి. అయితే తన పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు చైర్మన్ వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అదే మాట చైర్మన్ స్వయంగా చెప్పారు. తప్పుచేసే వారికి ఇక విచక్షణాధికారం ఎక్కడుంటుంది. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికారం ఇచ్చారు. రెండు బిల్లుల్ని శాసన సభలో ఆమోదింపజేసుకున్నాం. ఇష్టమో, లేదో మండలిలో ప్రతిపక్ష సభ్యులు తేల్చాలి. నాన్చుడు ధోరణి వల్ల రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. శాసన మండలి రూల్ బుక్ ప్రకారం చేయాలని చైర్మన్ను కోరాం. ఆయన అలా చేయలేదు. చైర్మన్ చర్య రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుంది. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు. ప్రతీ ఒక్కరికి విచక్షణాధికారం ఉంటుంది. చట్టానికి లోబడకుండా విచక్షాణాధికారాన్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. అన్ని వర్గాలకు విచక్షణాధికారం ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తుంటే శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ, దుర్మార్గంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. రాష్ట్రం ఏమైపోయినా బాబుకు పట్టదు. ఆస్తులు కాపాడుకోవడమే ఆయనకు ముఖ్యం. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను.. నీతిమాలిన కార్యక్రమాలను ప్రజలు గమనించాలి. ఇలాంటి చైర్మన్లు ఉంటే వ్యవస్థకే ప్రమాదం. దుర్మార్గపు ఆలోచనతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు చరమగీతం పాడేంతవరకు సీఎం వైఎస్ జగన్కు తోడుగా ఉంటాం. సీఎం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజామోదం మెండుగా ఉంది’ అన్నారు. -
‘గ్రామాల్లో ఎవరు ట్రైనింగ్ ఇస్తారు బాబు?’
కర్నూలు: బ్యాంకుల నుంచి డబ్బుల విత్ డ్రా చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. బ్లాక్ మనీ వెలికితీతకు సామాన్యులను ఇబ్బంది పెట్టే చర్యలకు కేంద్రం దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 92శాతం గ్రామాలకు బ్యాంకింగ్ సదుపాయాలు లేవని అన్నారు. అలాంటప్పుడు నగదు రహిత లావాదేవీలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మొబైల్ బ్యాంకింగ్ చేయాలంటూ సూచనలు చేస్తున్నారని, గ్రామాల్లోని వారికి ఎవరు ట్రైనింగ్ ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.