కష్టసుఖాల్లో తోడుని!
భూమా నాగిరెడ్డి. జిల్లా ప్రజలకు కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. ప్రజా సమస్యలపై
పోరాటంలో వెన్నుచూపని నైజం ఆయన ఆయనది. ఇందుకోసం అక్రమ కేసులకు ఎదురొడ్డి నిలవడం ప్రత్యేకత. తాజాగా నంద్యాల మున్సిపల్ సమావేశంలో సమస్యలపై గళం విప్పేందుకు ప్రయత్నించగా.. అధికార పార్టీ ఏకంగా హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించింది. అంతటితో ఆగక రౌడీ తెరిపించింది. ప్రత్యర్థులకు
ఆయనంటే ఎంతటి హడలో ఈ అక్రమ కేసులే సాక్ష్యం.
ఎన్నికల సమయంలో సహధర్మచారిణిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయనకు నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపుకాస్త ఊరట. ఆ తర్వాత కూడా ప్రజల సమస్యను తనదిగా భావించారు. ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నారు. ఈ నేప థ్యంలో నంద్యాల పట్టణంలోని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా మారారు. యోగక్షేమాలు తెలుసుకుంటూ.. కష్టన ష్టాలు ఓపికగా వింటూ కొండంత ఓదార్పునిచ్చారు. ఎప్పుడు ఎలాంటి కష్టమొచ్చినా అండగా నేనున్నాననే విషయం గుర్తుంచుకోవాలని భరోసానిచ్చారు.
రాజకీయంగా ప్రసిద్ధి గాంచిన. పట్టణం నంద్యాల. ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు, రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన వారే. దాదాపు 15 ఏళ్లుగా పాలకులు పట్టించుకోకపోవడంతో ఇక్కడి పరిస్థితులు పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారయ్యాయి. ఇరుకు రోడ్లతో ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. రోడ్లు విస్తరణకు ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ.. రోడ్డు విస్తరణ కాకుండా 15-16 అడుగుల రోడ్డును ఆక్రమించినా అధికారులు చోద్యం చూస్తున్నారు. ట్రాఫిక్ పెరిగిపోయింది. అంచనాల మేరకు అభివృద్ధి జరగలేదు. మురికివాడల్లో అధికారులు పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయి. ఇక్కడి కాలుష్యాన్ని భరించలేక కొందరు ప్రజాప్రతినిధులు బెంగళూరు వంటి నగరాల్లో జీవనం సాగిస్తున్నారు. కానీ, సామన్య ప్రజలు మాత్రం చాలా దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. వారి సమస్యలను ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
‘వీఐపీ రిపోర్టింగ్’
భూమా : నీ పేరు. మార్కెట్ ఎలా ఉంది? ఆరోగ్యం బాగుందా? ఎలాంటి సమస్యలున్నాయి?
వ్యాపారి: సార్. నా పేరు వలి బాషా. మార్కెట్లో పారిశుద్ధ్య సమస్య ఉంది. పందుల బెడదా ఎక్కువే. దాదాపు 150 వరకు పందులు మార్కెట్లో సైర్యవిహారం చేస్తున్నాయి. దోమలు కుట్టడంతో జ్వరాల బారిన పడుతున్నాం. మున్సిపాలిటీ వాళ్లు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ సమస్య ఎంత చెప్పిన తక్కువే. రోడ్డుపై ప్రశాంతంగా నడిచి వెళ్లే పరిస్థితి కరువైంది.
భూమా : నేనెవరో తెలుసా? ఎక్కడ్నుంచి వస్తున్నారా? ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది?
విద్యార్థి : తెలుసు సార్. మా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు. రామకృష్ణ డిగ్రీ కాలేజీ నుంచి వస్తున్నాం. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడంతో ప్రధాన రహదారిపై కాకుండా షార్ట్కట్లో సందుల్లో వచ్చాం. ఈ దారి కూడా అపరిశుభ్రంగానే ఉంది.
భూమా : ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు?
విద్యార్థి : అభివృద్ధిలో నంద్యాల చాలా వెనుకబడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలి. కనీసం తాడిపత్రి మున్సిపాలిటీలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది.
భూమా : నంద్యాల పట్టణంలో ఇన్ని సమస్యలున్నాయి కదా? వీటి పరిష్కారానికి మీరు చేస్తున్న ప్రయత్నాలేంటి? విద్యార్థులంతా కలిసి ఉద్యమ బాట పట్టొచ్చు కదా?
విద్యార్థి : పట్టణాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను పరిష్కరించాలని విదార్థులంతా నినదించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము ఉద్యమాలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయా? మీలాంటి నాయకులే ముందుకు రావాలి. మేము మీ వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
భూమా : మేము కూడా ప్రయత్నం చేశామమ్మా. మా మీద తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టించే పరిస్థితి వచ్చింది.
భూమా : మీ పేరేంటమ్మా? మార్కెట్కు వచ్చారు కదా? ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
మహిళ: నా పేరు తిరుపతమ్మ సార్. సరుకులు కొనేందకు వచ్చినా. రోజూ ఒకసారి వస్తాను. ఇక్కడ ఇరుకిరుకుగా ఉంది. మహిళలను పురుషులు తగులుకుంటూ వెళ్తున్నారు.
భూమా : ఏం బాబు.. వ్యాపారం ఎలా జరుగుతోంది? రద్దీ ఎలా ఉంది? మనుషులు నడిచే పరిస్థితి ఉందా? శనివారం ఎలా ఉంటుంది?
యువకుడు : వ్యాపారం బాగానే జరుగుతోంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో దుమ్మూధూళి ఎక్కువగా ఉంటోంది. శనివారం రద్దీ అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. వర్షం వచ్చినప్పుడు మాత్రం మార్కెట్లో నడిచే పరిస్థితి ఉండదు. మార్కెట్ బురదమయంగా మారుతుంది.
భూమా : పెద్దాయనా.. ఎలా ఉన్నారు? పట్టణంలో మీకు ఎదురవుతున్న సమస్యలేంటి?
వృద్ధుడు : సార్.. నాపేరు రఫీ. 45 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా? ట్రాఫిక్ సమస్యతో నంద్యాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 20వేల జనాభా ఉన్నప్పుడున్న ఏర్పాటు చేసిన రహదారుల్లో ఇప్పుడు 4 లక్షల మంది తిరగాలంటే ఎలా సాధ్యం. కాబట్టి రహదారుల విస్తరణ జరగకపోతే మహిళలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదు. నంద్యాల నుంచి నూనెపల్లెకు వెళ్లాలంటే 2 గంటలు పడుతోంది. ఇరుకిరుకు రహదారుల్లో 20వేల ఆటోలు తిరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.
భూమా : మార్కెట్ సంగతి ఏంటి?
వృద్దుడు : మార్కెట్ అధ్వానంగా మారింది. ఎక్కడ చూసినా పందులు, ఆవులే. మార్కెట్లో వ్యాపారులు అధిక సంఖ్యలో ఉండడంతో ఇబ్బందిగా ఉంటోంది. అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజలు, వ్యాపారులు రోగాల బారిన పడుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
భూమా : మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?
సీఐ : కర్నూలు టౌన్ డీసీఆర్బీ నుంచి వచ్చాను. నా పేరు ప్రతాప్రెడ్డి.
భూమా : కర్నూలు టౌన్కు నంద్యాల టౌన్కు తేడా కనిపిస్తోందా?
సీఐ : తేడా కనిపిస్తోంది. ఇక్కడ పాతబస్తీ(ఓల్డ్ టౌన్)లో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య ఉంది.
భూమా : ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మీరు ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేస్తున్నారా?
సీఐ : మా ప్రయత్నం చేస్తున్నాం సార్, రోడ్లు విస్తరిస్తే బాగుంటుంది. పట్టణంలో వాహన వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మున్సిపాల్టీ అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టాలి. రోడ్లు విస్తరిస్తే తప్ప ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేం.
భూమా : ట్రాఫిక్ కంట్రోల్ కోసం నేను రూ.20 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిచ్చా. అవి మీకు ఉపయోగ పడుతున్నాయా?
సీఐ : ఉపయోగమే. అయితే వాటికి మున్సిపాలిటీ అధికారులు విద్యుత్ బిల్లులు కట్టడం లేదు. కాబట్టి కొన్ని చోట్ల కెమెరాలు పనిచేయడం లేదు. ఈ సమస్యను మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
భూమా : మున్సిపాలిటీ వాళ్లు చేయకపోయినా నేను చేస్తా. ఎందుకంటే ఆ కెమెరాలు నేను ఏర్పాటు చేశాను కాబట్టి. సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.
మహిళా వ్యాపారి : సార్, ఇక్కడ సమస్యలు అనేకం ఉన్నాయి. మీరు దయతో వీటిని పరిష్కరించండి.
భూమా : ఎలాంటి సమస్యలు ఉన్నాయమ్మా?
మహిళా వ్యాపారి : సార్, వర్షాలు వచ్చినప్పుడు మార్కెట్ అంతా బురదమయమవుతుంది. ఇక్కడ కూర్చొని వ్యాపారం చేసే పరిస్థితి ఉండదు. కొనేవాళ్లు ఎవరూ రారు. కూలీ కూడా గిట్టుబాటు కాదు.
భూమా : ఏమ్మా ఆరోగ్యం ఎలా ఉంది? వ్యాపారం ఎలా జరుగుతోంది?
మహిళా వ్యాపారి : నా పేరు లక్ష్మీదేవి సార్. మార్కెట్లో పందులు, ఆవులతో ఇబ్బందులు పడుతున్నాం. నరకప్రాయంగా ఉంది. ఈ సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఆదుకోండి.
గుర్రమ్మ : సార్... నా పేరు గుర్రమ్మ. మీరు సీమ సింహం సార్. వర్షం వస్తే మార్కెట్ అంతా బురద సార్. నేను ఇప్పటికీ రెండు సార్లు జారి పడినా.
భూమా : మీ సమస్యలు తెలుసుకోవడానికే ఈ రోజు ఇక్కడికి వచ్చాను. తప్పకుండా పరిష్కరిస్తాను.
భూమా : ఇక్కడ షాపింగ్ చేసే బదులు పక్క ఊరికి వెళ్లి షాపింగ్ చేస్తున్నారంటున్నారు? నిజమేనా?
వ్యాపారి : నిజమే సార్, ఇక్కడ వాహనాలు పార్కింగ్ చేసుకునే పరిస్థితి లేదు. చాలా మంది షాపుల యజమానులు స్థలాన్ని ఆక్రమించారు. రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం ఎంతో విశాంగా ఉండేవి. రోడ్ల విస్తరణ చేపడితే తప్ప సమస్య పరిష్కారం కాదు.
భూమా : మీరు రోడ్డు విస్తరణకు సహకరించడం లేదంటున్నారు? అలా చేస్తే ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుంది?
వ్యాపారి : కొంత మంది సహకరించని మాట వాస్తవమే. కానీ, ఒకరిద్దరి కోసం విస్తరణ పనులు చేపట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది.
నూరుల్లా : సార్, మా పెద్దలు చెప్పేవాళ్లు.. 30 ఏళ్ల కిందట ఈ ఏరియాలో రెండు సిటీ బస్సులు తిరిగేవట. చుట్టుపక్కల పల్లెల నుంచి నూనెపల్లెలో దిగి.. రూ.2లతో ఇక్కడికొచ్చి సరుకులు కొనేవారంట. ఇప్పుడు నూనెపల్లెలో దిగి ఇక్కడకు రావాలంటే రూ. 15 అవుతోంది. బస్సులు తిరగకపోవడంతో ఈ సమస్య ఎదురవుతోంది. కాబట్టి మీరు సమస్య పరిష్కారానికి కృషి చేయండి. మీ వెంట విద్యార్థులంతా ఉంటాం.
భూమా : నంద్యాలలో మీరు అనుభవిస్తున్న సమ్యసలేంటి?
అజీమ్ : 30 ఏళ్లుగా నంద్యాలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పరిపాలన సాగిస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. నంద్యాలను అభివృద్ధి చేయమంటే బడ్జెట్ లేదంటున్నారు. 30 ఏళ్లుగా బడ్జెట్ లేకుండానే మున్సిపాలిటీ నడుస్తోందా? మేము మున్సిపాలిటీకి కడుతున్న టాక్స్లకు సంబంధించిన సొమ్ము ఎక్కడికెళ్తోంది. గట్టిగా ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు సహకరించడం లేదంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అభివృద్ధికి అడ్డుపడతారా? ఏంటి సార్ నంద్యాలకు ఈ పరిస్థితి.
భూమా : నంద్యాలలో 40-50 ఏళ్లుగా ఈ సమస్యలున్నాయి. పరిష్కారంలో ప్రజాపతినిధులు, నాయకులు ఘోరంగా విఫలమయ్యారు. మా ప్రయత్నంగా పరిష్కారానికి న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నా. రోడ్ల విస్తరణ, పందుల బెడద, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కోర్టులో పిల్ వేయబోతున్నాం. కోర్టు ఆదేశాలతో నంద్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా.