breaking news
Bharatiya Janata Party
-
లోక్సభలో ఎన్నికల్లో 45% ఖర్చు బీజేపీదే
న్యూఢిల్లీ: గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిపి చేసిన మొత్తం వ్యయంలో 45 శాతం వాటా భారతీయ జనతా పార్టీదేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) శుక్రవారం ఒక నివేదికలో వెల్లడించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ రూ.1,494 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియజేసింది. విపక్ష కాంగ్రెస్ రూ.620 కోట్లు ఖర్చు పెట్టిందని, మొత్తం వ్యయంలో ఆ పార్టీ వాటా 18.5 శాతమని వివరించింది. మొత్తం 32 జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల ఖర్చుల రికార్డులను ఏడీఆర్ విశ్లేషించింది. 2024లో మార్చి 16 నుంచి జూన్ 6 దాకా లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగాయి. ఈ ఎన్నికల కోసం 32 పార్టీలు రూ.3,352.81 కోట్లు ఖర్చు చేసినట్లు ఏడీఆర్ తెలియజేసింది. ఇందులో జాతీయ పార్టీల వాటా రూ.2,204 కోట్లు(65.75 కోట్లు) అని పేర్కొంది. విరాళాలు, నిధుల రూపంలో జాతీయ పార్టీలకు రూ.6,930.24 కోట్లు, ప్రాంతీయ పార్టీలకు రూ.515.32 కోట్లు అందినట్లు వివరించింది. అంటే మొత్తం నిధుల్లో జాతీయ పార్టీలకు 93.08 శాతం, ప్రాంతీయ పార్టీలకు 6.92 శాతం అందినట్లు స్పష్టమవుతోంది. ఏయే పార్టీలు ఎన్ని నిధులు ఖర్చు చేశాయన్నది ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన ‘వ్యయ నివేదికల’ఆధారంగా ఏడీఆర్ గుర్తించింది. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత 90 రోజుల్లోగా, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత 75 రోజుల్లోగా పార్టీలు వ్యయ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఆలస్యంగా ఈ నివేదికలు ఇచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది. పార్టీలు ఎన్నికల ప్రచారం కోసమే అత్యధిక నిధులు ఖర్చు చేసినట్లు తెలిపింది. అన్ని పార్టీలు ప్రచారం కోసం రూ.2,008 కోట్లు వెచ్చించినట్లు తేల్చింది. అంటే మొత్తం ఖర్చులో ఇది 53 శాతంగా తెలుస్తోంది. ఆ తర్వాత రవాణా కోసం రాజకీయ పార్టీలు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు వెల్లడించింది. ఎన్నికల సంఘం గుర్తింపు పొందని 690 పార్టీలు కూడా గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసినట్లు ఏడీఆర్ తెలియజేసింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే ఖర్చుపై నిఘా పెట్టడానికి ప్రత్యేకంగా పరిశీలకులను నియమించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. -
తెలంగాణకు శోభా కరంద్లాజే.. ఏపీకి పీసీ మోహన్
సాక్షి, న్యూఢిల్లీ: సంస్థాగత మార్పుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్టీ నూతన అధ్యక్షుల నియామకానికి శ్రీకారం చుట్టింది. సంక్రాంతిలోగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యులను నియమించేందుకు వీలుగా ప్రత్యేక ఎన్నికల అధికారుల పేర్లను ఖరారు చేసింది. శుక్రవారం 29 మందితో కూడిన జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల అధికారిగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్కు కర్ణాటకకు చెందిన లోక్సభ సభ్యుడు పీసీ మోహన్లను నియమించింది. వీరితో పాటు తమిళనాడుకు కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఉత్తరప్రదేశ్కు పీయూష్గోయల్, అండమాన్ నికోబార్కు తమిళిసై సౌందర్రాజన్, బిహార్కు మనోహర్లాల్ ఖట్టర్, కర్ణాటకకు శివరాజ్ సింగ్ చౌహాన్, గుజరాత్కు భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్కు ధర్మేంద్ర ప్రధాన్, పుదుచ్చేరికి తరుణ్ ఛుగ్లకు ఎన్నికల అధికారులుగా బాధ్యతలు అప్పగించింది. -
బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో జరుగుతుందని పార్టీలోని విశ్వసనీవర్గాలు వెల్లడించాయి. జేపీ నడ్డా నుంచి కొత్త అధ్యక్షుడు ఫిబ్రవరిలో పగ్గాలు చేపడతారని వెల్లడించాయి. సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జనవరి మధ్యకల్లా పూర్తవుతాయని, తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉటుందని వివరించాయి. 60 శాతం రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిందని, వీరి స్థానాల్లో .జనవరి మధ్యకల్లా కొత్త అధ్యక్షులు ఎన్నికవుతారని తెలిపాయి. కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే.. సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికావాలని బీజేపీ నిబంధనావళి చెబుతోంది. మంత్రివర్గంలో నుంచి ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అని ప్రశ్నించగా.. మంత్రి కావొచ్చు లేదా పార్టీలో ఒకరు కావొచ్చు.. అని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. కొత్త అధ్యక్షుడెవరనే విషయంలో ఇంకా ఏదీ ఖరారు కాలేదని వివరించాయి. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా 2020 ఫిబ్రవరిలో పార్టీ పగ్గాలు చేపట్టారు. సాధారణంగా అధ్యక్షుడికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. అయితే లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డాకు పొడిగింపునిచ్చిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్సీ రేసులో ఆశావహులు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులతోపాటు స్వతంత్రులు రంగంలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే బరిలో నిలవనున్న అభ్యర్థులు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారు.సెప్టెంబరులో పట్టభద్రుల ఎన్రోల్మెంట్ ప్రారంభంకానుంది. 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరినీ బరిలోకి దించలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జీవన్రెడ్డి గెలుపొందారు. తాజాగా ఇటీవల కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎనిమిది స్థా నాలు గెలుచుకోవడంతో ఎలాగైనా కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని మరోసారి కై వసం చేసుకోవాలని వ్యూహరచనలో మునిగింది.కాంగ్రెస్ నుంచి ముగ్గురి పేర్లు⇒ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత ఎమ్మెస్సార్ మనవడు మేన్నేని రోహిత్రావు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన సబ్బని వెంకట్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.⇒ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్రావు తనకు 15 రోజులు ముందు టికెట్ కేటాయించడంతో ఆ సమయంలో ఓటర్లందరినీ కలుసుకోలేకపోయానని తనకు ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నట్లు సమాచారం. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో తన తండ్రి వెలిచాల జగపతిరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేశారని.. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తనకు టికెట్ కేటాయిస్తే విజయం ఖాయమని అధిష్టానం వద్ద విన్నవించుకున్నట్లు వినికిడి.⇒ దివంగత సీనియర్ నేత ఎమ్మెస్సార్ మనవడు రోహిత్రావు తనకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని, తాత చేసిన సేవలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పేరును పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం.⇒ హుజూరాబాద్కు చెందిన సబ్బని వెంకట్ ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో హుజూరాబాద్ టికెట్ తనకు కాకుండా వొడితెల ప్రణవ్కు కేటాయిస్తే చిత్తశుద్ధితో పనిచేశానని తన పేరును ఎమ్మెల్సీ టికెట్ కోసం పరిశీలించాలని అధిష్టానం వద్ద ఇప్పటికే విన్నవించుకోవడం తెలిసిందే.బీజేపీ నుంచి వీరే.. భారతీయ జనతా పార్టీ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీచేసి ఓటమిపాలైన జి.రాణిరుద్రమదేవితోపాటు ఆ పార్టీ సీనియర్నేత, న్యాయవాది పొల్సాని సుగుణాకర్రావు పార్టీ అభ్యర్థిత్వం కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విస్తృతమైన సంబంధాలతోపాటు పాత, కొత్త కలయికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే పథకాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం చేకూరుస్తాయని సుగుణాకర్రావు అధిష్టానం వద్ద గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. రాణిరుద్రమదేవి తనదైన శైలిలో టికెట్ కోసం ప్రయత్నాలతోపాటు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.బరిలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేతఅల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవసరమైతే ప్రధాన పార్టీల అభ్యర్థిత్వం, లేనట్లయితే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలిచేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎన్రోల్మెంట్ ప్రక్రియతోపాటు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నాలుగు జిల్లాల పరిధిలో అల్ఫోర్స్ విద్యాసంస్థలు విస్తరించి ఉండడంతోపాటు వేలాది మంది విద్యార్థులను, పట్టభద్రులతో ఉన్న సంబంధాలు తన విజయానికి సోపానంగా ఉంటాయని ఆలోచిస్తున్నారు. 2019లోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించినా రాకపోవడంతో విరమించుకున్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టాలనే నరేందర్రెడ్డి అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.బీఆర్ఎస్లో భారీ పోటీమాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్, బీఎన్ రావు, యాదగిరి శేఖర్రావు తదితరులు మరోసారి గులాబీ సత్తా చాటేందుకు వ్యూహరచనలో మునిగితేలుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పోటీ చేసేందుకు ముందుకొస్తున్న ఆశావహులు ఎవరికి వారు సర్వేలు చేయించుకుంటూ అనుచరగణంతో మంతనాలు సాగిస్తున్నారు.