breaking news
Better medical services
-
విద్యార్థులందరికీ ట్యాబ్లు
ఉద్ధవ్ఠాక్రే ఎన్నికల హామీ సాక్షి, ముంబై: ఢిల్లీ ఆడమన్నట్లు ఆడే ప్రభుత్వం రాష్ట్రంలో వద్దని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ధులే జిల్లాలోని పారోలా రోడ్డుపైగల శివాజీ విగ్రహం వద్ద సోమవారం ఉద్ధవ్ ప్రచార సభ జరిగింది. ప్రచారానికి సోమవారం ఆఖరురోజు కావడంతో ఉద్ధవ్కు తగినంత సమయం దొరకలేదు. దీంతో శివాజీ విగ్రహం వద్ద జిల్లాలోని ఐదు శాసనసభ నియోజక వర్గాల సభ్యులకు మద్దతుగా అక్కడే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎగుమతులకే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అందరం కలిసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని, అయితే ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన వి కావడంతో ఇక్కడ ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉందని అన్నారు. శివసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులందరికి ట్యాబ్, మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, అందుకు జిల్లా ఆరోగ్య కేంద్రాలన్నింటిని అనుసంధానిస్తామని తెలిపారు. రైతులకు తగినన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. -
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు
పెద్దదోర్నాల : నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని చెంచు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి చంద్రయ్య తెలిపారు. మండల కేంద్రంలోని 30 పడకల వైద్యశాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని గిరిజన గూడేల్లో డయేరియా, మలేరియాతో పాటు విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై గిరిజనులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గిరిజన గూడేల్లో చర్మవ్యాధుల నివారణకు అవసరమైన మందులు అందిస్తామన్నారు. గిరిజన గూడేల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయో గుర్తించి, వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, డయోరియా, మలేరియా వంటి వ్యాధులకు సంబంధించి జ్వర పీడీతుల వద్ద రక్తపూత నమూనాలు సేకరించాలని స్థానిక వైద్యాధికారులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. వైద్యశాలలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెంచు గిరిజనులకు సంబంధించి ఆస్పత్రిలో గర్భిణులు వేచి ఉండే గదుల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని వైద్యాధికారులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా త్వరలో కౌన్సెలింగ్ జరగనుందని, కొందరు వైద్యులు, సిబ్బంది ఇక్కడికి బదిలీపై వచ్చే అవకాశం ఉందని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆయనతో పాటు త్రిపురాంతకం ఎస్పీహెచ్ఓ శ్రీనివాసరావు, వైద్యులు విక్టర్, డెంటల్ సర్జన్ ఉమానందిని, ఇతర సిబ్బంది ఉన్నారు.