breaking news
BEd and MED Syllabus
-
ప్రైమరీ టీచర్లకు బ్రిడ్జి కోర్సు తప్పనిసరి
సాక్షి, అమరావతి: బీఈడీ, ఎంఈడీ చేసి ప్రైమరీ స్కూళ్లలో (1–5 తరగతులు) టీచర్లు (ఎస్జీటీ)గా చేరే వారు ఇకపై 6 నెలల బ్రిడ్జి కోర్సును తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. సర్వీసులో చేరిన తర్వాత రెండేళ్లలో ఈ కోర్సులో ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది. ఈ మేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నూతన మార్గదర్శకాలను ఇటీవల జారీ చేసింది. ప్రైమరీ స్కూల్ టీచర్ (సెకండరీ గ్రేడ్ టీచర్లు–ఎస్జీటీ) పోస్టులకు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ (డీఎడ్, డీఎల్ఈడీ) పాసయిన వారిని మాత్రమే గతంలో అనుమతించేవారు. బీఈడీ, ఎంఈడీ చేసిన వారు కేవలం స్కూల్ అసిస్టెంటు పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండేవారు. అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్సీటీఈ ఈ నిబంధనను కొద్దికాలం కిందట మార్పు చేసింది. బీఈడీ, ఎంఈడీ చేసిన వారు కూడా ఎలిమెంటరీ టీచర్ పోస్టులకు అర్హులుగా ప్రకటించింది. మన రాష్ట్రంలో టెట్ నిర్వహణలో ఎస్జీటీ పోస్టులకు పేపర్–1ను, స్కూల్ అసిస్టెంటు పోస్టులకు పేపర్–2ను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఎన్సీటీఈ నిబంధనలు మార్చిన అనంతరం ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులకు పేపర్–1ను తప్పనిసరి చేసింది. ఇలా పేపర్–1ను రాసి ఎస్జీటీ పోస్టులకు ఎంపికయ్యే బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులు సర్వీసులో చేరిన అనంతరం బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఒక ఏడాది బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ శిక్షణ, లేదా 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్, మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీలు చేసి ఉండాలని ఎన్సీటీఈ పేర్కొంది. ఈ అర్హతలున్న వారు ఆయా రాష్ట్రాల్లో టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్), లేదా సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (సీటీఈటీ)లలో అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటిలో ఒక సారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్కు జీవితకాల పరిమితి ఉంటుంది. -
బీఈడీ, ఎంఈడీ సిలబస్లోనూ స్పెషల్ ఎడ్యుకేషన్
ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు బీఈడీ, ఎంఈడీ సిలబస్ల మార్పు చేపట్టిన ఎన్సీటీఈ మరో కీలక చర్య తీసుకుంది. బుద్ధిమాంద్యం, ఇతర శారీరక బలహీనతలు ఉన్న విద్యార్థులకు శిక్షణనిచ్చే నైపుణ్యాలను బీఈడీ, ఎంఈడీ విద్యార్థులకు అందించే విధంగా ఈ రెండు కోర్సుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ను ఒక సబ్జెక్ట్గా తప్పనిసరి చేసింది. ఈ మేరకు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి ఇప్పటి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్లో పూర్తిస్థాయి కోర్సులను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది. దీనివల్ల ఆ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకే శారీరక, మానసిక వికలాంగులైన చిన్నారులకు బోధించే నైపుణ్యాలు లభిస్తున్నాయి. అలాంటి విద్యార్థులకు కేవలం స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లు మాత్రమే విద్యాభ్యాసానికి అనుకూలంగా ఉంటున్నాయి. అయితే గత ఏడాది నేషనల్ శాంపుల్ సర్వే అంచనాల ప్రకారం- 6-13 సంవత్సరాల మధ్య వయసు ఉన్న చిన్నారుల్లో దాదాపు ఆరు లక్షల మంది శారీరక, మానసిక వికలాంగులు తమ వైకల్యం కారణంగా స్కూళ్లకు దూరంగా ఉన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్సీటీఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బీఈడీ, ఎంఈడీ కోర్సు చేసిన అభ్యర్థులందరికీ స్పెషల్ ఎడ్యుకేషన్లోనూ శిక్షణ లభిస్తుందని, ఫలితంగా తమకు సమీపంలోని స్కూళ్లలోనూ శారీరక, మానసిక వికలాంగ చిన్నారులు విద్యనభ్యసించే అవకాశం లభిస్తుందని ఎన్సీటీఈ వర్గాలు తెలిపాయి.