breaking news
balija sudhakar
-
వీడిన హత్య మిస్టరీ
జీపుడ్రైవర్ హత్యలో భార్యే కుట్రదారు ప్రియుడితో కలిసి మట్టుబెట్టిన వైనం కాల్ డేటాతో నిందితుల గుట్టురట్టు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు గుత్తి: కలకలం రేపిన జీపు డ్రైవర్ హత్య కేసు మిస్టరీ వీడింది. భార్యే ప్రధాన నిందితురాలని పోలీసుల విచారణలో తేలింది. ప్రియుడితో కొనసాగుతున్న వివాహేతర సంబంధానికి అడ్డు ఉండకూడదని భర్తను కడతేర్చింది. ఈ కేసులో నిందితురాలైన భార్యతోపాటు హత్యకు సహకరించిన ప్రియుడు, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గుత్తి సీఐ కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ ప్రభాకర్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. పెళ్లికి ముందే ప్రేమాయణం వైటీ చెరువుకు చెందిన (ప్రస్తుతం గుత్తిలో నివాసముంటున్నారు) బలిజ సుధాకర్కు, కర్నూల్ జిల్లా ప్యాపిలికి చెందిన మేనమామ కూతురైన వెంకటేశ్వరితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. దంపతుల ఇరువురు అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. అయితే వెంకటేశ్వరి పదవ తరగతి చదువుతున్న సమయంలో క్లాస్మేట్ అయిన బలిజ రాజేష్తో ప్రేమలో పడింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజేష్ పేదవాడు కావడం, పైగా తండ్రి కూడా లేకపోవడంతో వెంకటేశ్వరిని ఇవ్వడానికి ఈమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో సుధాకర్కు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహేతర బంధం బలపడిందిలా.. వివాహమైన అనంతరం వెంకటేశ్వరి -రాజేష్లు తరుచూ కలుసుకునే వారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రాజేష్ జీపు డ్రైవర్గా పని చేసేవాడు. జీపులో వెంకటేశ్వరిని తీసుకుని అప్పుడప్పుడు ‘టూర్’కు వెళ్లేవాడు. ఈమె కూడా తరుచూ ప్యాపిలికి వెళ్లి రాజేష్తో సన్నిహితంగా మెలిగి వచ్చేది. ఈ క్రమంలో వెంకటేశ్వరి - రాజేష్లకు దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. సుధాకర్ను మట్టుపెడితే తమకు అడ్డు ఉండదని, పెళ్లి కూడా చేసుకోవచ్చుని భావించారు. పథకం ప్రకారం హత్య.. ఈ నెల 15వ తేదీన సుధాకర్ను హత్య చేయడానికి పథ«క రచన చేశారు. రాజేష్ కర్నూల్కు చెందిన శివ కుమార్( డాబాలో పని చేసేవాడు)ను వెంట పెట్టుకుని ఈ నెల 15వ తేదీ రాత్రి గుత్తికి వచ్చారు. వెంకటేశ్వరికి ఫోన్ చేసి ఆరా తీశారు. సుధాకర్ పడుకున్నారని ఆమె చెప్పింది. దీంతో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో (16వ తేదీ) రాజేష్, శివకుమార్లు ఇంటి పైన ఉన్న ద్వారం నుంచి లోపలికి ప్రవేశించారు. నిద్రలో ఉన్న సుధాకర్ను ముగ్గురూ కలిసి డంబెల్తో తలపై మోది హతమార్చారు. అనంతరం ఇదంతా నలుగురు దొంగలు చొరబడి రూ. 5 లక్షల నగదు, 25 తులాల బంగారు ఆభరణాలు దోచుకుని, సుధాకర్ను చంపేశారని, తనను చున్నీతో చేతులు కట్టేసి గదిలో బంధించారని వెంకటేశ్వరి కట్టుకథ అల్లింది. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఎలా చేధించారంటే.. ఈ కేసును సీఐ ప్రభాకర్ గౌడ్,ఎస్ఐలు చాంద్బాషా, రామాంజనేయులు, ఐడీ పార్టీ పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. వెంకటేశ్వరి, రాజేష్, శివ కుమార్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, కాల్ డేటాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సుధాకర్ హత్యకు గురైన రోజు వెంకటేశ్వరి రాజేష్తో గంటల కొద్దీ మాట్లాడినట్లు తేలింది. రాజేష్ను అదుపులోకి తీసుకుని వెంకటేశ్వరికి ఫోన్ చేయించారు. స్పీకర్ ఆన్ చేయించి మాట్లాడించారు. రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలియకపోవడంతో వెంకటేశ్వరి రోజూ మాట్లాడినట్లే మాట్లాడింది. ‘నా భర్త సుధాకర్ను హతమార్చాం కదా ఈ విషయం పోలీసులకు తెలియకముందే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పింది. దీంతో పోలీసులు హుటాహుటినా వెళ్లి వెంకటేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ను, వెంకటేశ్వరిని విడివిడిగా పోలీసులు ఇంటరాగేషన్ చేశారు. తమతో పాటు శివకుమార్ అనే వ్యక్తితో కలిసి డంబెల్తో సుధాకర్ తలపై మోది చంపామని అంగీకరించారు. దీంతో హంతకులు రాజేష్, వెంకటేశ్వరి, శివకుమార్లను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి వీరిని రిమాండ్కు ఆదేశించారు. నగదు రివార్డును అందజేసిన డిఎస్పీ: సంచలనం సృష్టించిన బలిజ సుధాకర్ హత్య కేసును వారం రోజుల్లోనే ఛేదించిన సీఐ ప్రభాకర్ గౌడ్, ఎస్ఐలు చాంద్బాషా, రామాంజనేయులు, ఐడీ పార్టీ పోలీసులు రవి, మోహన్లకు డీఎస్పీ నగదు రివార్డులు ప్రకటించారు. సీఐ ప్రభాకర్ గౌడ్ను ఫోన్లో ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
గుత్తిలో కలకలం
ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. వివాహిత మెడపై కత్తిపెట్టి నగలు దోపిడీ అడ్డుకోబోయిన ఇంటి యజమాని హత్య గుత్తిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి తెగబడ్డారు. వివాహితను గదిలో బంధించి ఆమె మెడపై కత్తి పెట్టి నగలు దోచుకున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇంటి యజమాని అయిన జీపు డ్రైవర్ను డంబెల్తో తలపై మోది హతమార్చారు. రూ.5లక్షల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించారు. గుత్తి: గుత్తి పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జీపు డ్రైవర్ హత్యను చేసి, ఆయన భార్యను కత్తితో బెదిరించి నగలు, నగదుతో ఉడాయించారు. సీఐ ప్రభాకర్గౌడ్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కుమ్మర వీధిలోని కుక్కల బావి సమీపాన బలిజ సుధాకర్(30), వెంకటేశ్వరిలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రామ్చరణ్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. సుధాకర్ సొంతంగా టాటా సుమో (జీపు) పెట్టుకుని బాడుగలకు తిప్పుతూ జీవనం సాగించేవాడు. శుక్రవారం కూడా బాడుగలకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మిద్దెమీద నుంచి లోపలికి ప్రవేశించారు. అలికిడి విని అప్రమత్తమైన సుధాకర్ వారిపై తిరగబడ్డాడు. ముగ్గురు వ్యక్తులు సుధాకర్పై దాడి చేస్తుండగా.. మరొక వ్యక్తి భార్య వెంకటేశ్వరిని పక్క గదిలోకి తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి నోటికి గుడ్డ కట్టి బంధించాడు. ఆమె మెడపై కత్తి పెట్టి బంగారు లాంగ్ చైన్, తాళిబొట్టు, ఉంగరాలు, కమ్మలు లాక్కున్నారు. తర్వాత సుధాకర్పై నలుగురు కలిసీ దాడి చేశారు. ఎదురుదాడికి ప్రయత్నిస్తుండటంతో పక్కనే ఉన్న డంబెల్ తీసుకుని తల వెనుక బలంగా మోదారు. దీంతో సుధాకర్ గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బీరువాను తెరిచి అందులో ఉన్న రూ. 5 లక్షల నగదు, 30 తులాల విలువైన బంగారు ఆభరణాలు (లాంగ్ చైన్లు, కమ్మలు , ఉంగరాలు, వడ్డాణం) ఎత్తుకెళ్లారు. దొంగలు వెళ్లిపోయాక వెంకటేశ్వరి కట్లు విప్పుకుని గదిలో నుంచి బయటకు వచ్చింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. ‘నా భర్తను చంపేశారం’టూ గట్టిగా అరిచింది. ఇరుగుపొరుగు వారు వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ప్రభాకర్ గౌడ్, ఎస్ఐలు చాంద్బాషా, రామాంజనేయులు, ఏఎస్ఐ ప్రభుదాస్, హెడ్ కానిస్టేబుళ్లు చెన్నమయ్య, నాగరాజు, కుమార్, ఐడీ పార్టీ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యోదంతంతో పట్టణ వాసులు భయాందోళన చెందుతున్నారు. డాగ్, క్లూస్ టీమ్ల పరిశీలన బలిజ సుధాకర్ హత్య జరిగిన ఇంటిని అనంతపురానికి చెందిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ పరిశీలించింది. క్లూస్ టీమ్ నిపుణులు హత్యకు వినియోగించిన డంబెల్, గోడపై పడిన రక్తపు మరకలు, బీరువా, తలుపులపై ఉన్న వేలి ముద్రలను పరిశీలించారు. డాగ్ మొదటి ఇంటిలోకి ప్రవేశించి తర్వాత మిద్దె ఎక్కింది. తర్వాత కిందకు దిగి ఇంటికి ఎడమ పక్కకు పరుగుతీసింది. అటు తర్వాత కొంత దూరంలో ఉన్న బారే హిమామ్ పీర్ల మకాన్ వరకు వెళ్లి అక్కడ ఆగిపోయింది. తిరిగి సుధాకర్ను హత్య చేసిన ప్రాంతానికి చేరుకుంది. నిందితులను పట్టుకుంటాం : డీఎస్పీ హత్య సమాచారం తెలియగానే తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి శనివారం గుత్తికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు. నలుగురు వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి డంబెల్తో తలపై మోది హత్య చేశారన్నారు. త్వరలోనే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. హత్యపై అనుమానాలు జీపు డ్రైవర్ సుధాకర్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భార్య వెంకటేశ్వరి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. నలుగురు వ్యక్తులు వచ్చి తనను బంధించి భర్త సుధాకర్ను హత్య చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. నిజంగా దొంగలే అయి ఉంటే సుధాకర్తో పాటు వెంకటేశ్వరిని కూడా హతమార్చేవారు. బంధీగా ఉన్న ఆమె ఎలా తప్పించుకుని బయటకు వచ్చిందో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. డాగ్ స్క్వాడ్ కూడా ఇంటిలోనే కాసేపు తిరిగింది. సుధాకర్ హత్య చేయబడిన గదిలోకి, వంట గదిలోకి రెండు సార్లు డాగ్ వెళ్లింది. దీంతో కొత్తవారు ఇంటిలోకి ప్రవేశించలేదని తేటతెల్లమవుతోంది. ఒక వేళ దొంగలు వచ్చి ఉంటే బీరువా ఉన్న గదిలోకి వెళ్లకుండా వంటగదిలోకి ఎందుకు వెళతారు అనే సందేహం కలుగుతోంది. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.


