Ayyappa Swami Temple
-
‘అది వివక్ష కాదు.. ఆచారం’
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న సుదీర్ఘ వివాదంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) తన వైఖరిని స్పష్టం చేస్తూ, సుప్రీంకోర్టులో కీలక వివరణ ఇచ్చింది. 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలపై ఉన్న నియంత్రణ అనేది లింగ వివక్ష కిందకు రాదని, అది ఆలయ సంప్రదాయంలో భాగమని బోర్డు కోర్టుకు విన్నవించింది.నైష్ఠిక బ్రహ్మచర్యమే ప్రాతిపదికగా..శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని ‘నైష్ఠిక బ్రహ్మచారి’గా భక్తులు ఆరాధిస్తారని దేవస్వం బోర్డు తన వాదనలో పేర్కొంది. స్వామివారికి ఆధ్యాత్మిక శక్తి అనేది ఆయన ఆచరించిన తపస్సు, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం ద్వారానే లభిస్తుందని.. ఈ క్రమశిక్షణను భక్తులు కూడా పాటిస్తారని వివరించింది. దేశవ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా అయ్యప్ప ఆలయాలు ఉన్నప్పటికీ, శబరిమల ప్రత్యేకత ఈ ‘నైష్ఠిక బ్రహ్మచర్యమే’నని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నియంత్రణలు ఉన్నాయని, అయితే 10 ఏళ్లలోపు బాలికలు, 50 ఏళ్లు దాటిన మహిళల ప్రవేశానికి ఎలాంటి అభ్యంతరం లేదని గుర్తు చేసింది.అంతర్జాతీయ పరిశోధనల ప్రస్తావనతన వాదనను బలపరుచుకునేందుకు దేవస్వం బోర్డు అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 1987లో ఒట్టావాలోని కార్లెటన్ యూనివర్శిటీకి చెందిన రాధికా శేఖర్ సమర్పించిన థీసిస్తో పాటు, 2003లో ‘రాయల్ ఆంత్రోపాలజికల్ ఇనిస్టిట్యూట్’ ప్రచురించిన అధ్యయనాలను బోర్డు గుర్తు చేసింది. ఈ పరిశోధనల ప్రకారం.. శబరిమలలో వయోపరిమితి అనేది పురాతన మతపరమైన ఆచారమే తప్ప, సమానత్వ హక్కులను కాలరాయడం కాదని బోర్డు ‘సుప్రీం’లో వాదించింది. ఒక సమూహాన్ని లేదా వర్గాన్ని ‘మతపరమైన శాఖ’గా గుర్తించాలా వద్దా అనేది కేవలం చట్టపరమైన అంశమే కాదని, అది వాస్తవాలతో కూడిన విషయమని బోర్డు అభిప్రాయపడింది. డాక్యుమెంటరీ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది.ఇది కూడా చదవండి: ‘వెయిటింగ్ లిస్ట్’లో వందే భారత్ స్లీపర్ -
రెండో పెళ్లి చేసుకున్న కనకదుర్గ.. ఆమె ఎవరో గుర్తుందా..?
శబరిమల ఆలయ విషయంలో వివాదాస్పద మహిళా కార్యకర్త కనకదుర్గ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తోటి కార్యకర్త విలయోడి శివన్కుట్టీని ఆమె పెళ్లాడింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారిద్దరూ తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, కనకదుర్గకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. అయితే, 2019లో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కేరళ నిరసనలు, ర్యాలీలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి జనవరి 2, 2019లో ఇద్దరు మహిళా కార్యకర్తలు వెళ్లిన విషయం తెలిసిందే. మహిళా కార్యకర్త కనకదుర్గతో పాటు లాయర్ బిందు అమ్మిని.. ప్రత్యేక భద్రత మధ్య ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. దీంతో, ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలు వెళ్లవచ్చు అని సుప్రీం తీర్పు అనంతరం ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో భర్తతో గొడవల కారణంగా కనకదుర్గ విడాకులు తీసుకుంది. 2019 జూన్లో ఆమె విడాకులు తీసుకున్నది. శబరిమల వెళ్లి వచ్చిన తర్వాత అత్త తనపై దాడి చేసినట్లు కనకదుర్గ మీడియాతో ఎదుట చెప్పుకొచ్చింది. అనంతరం.. మావో సానుకూల అయ్యంకలి పద గ్రూపులో కామ్రేడ్గా చేస్తున్న శివన్కుట్టితో పరిచయం అనంతరం వీరిద్దరి మధ్య అంగీకారంతో మంగళవారం వివాహం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి జీవించాలని భావిస్తున్నట్లు శివన్కుట్టి వెల్లడించారు. -
రోజుకు 25 వేల మందికి అయ్యప్ప దర్శనం
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రతి రోజూ గరిష్టంగా 25 వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకోవచ్చని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. ఈ ఏడాది కరోనా ఉధృతిలో తగ్గుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. శబరిమల దర్శనాలకు సంబంధించి దక్షిణాది ఐదు రాష్ట్రాల అధికారులతో కేరళ ప్రభుత్వ అధికారులు మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్లాల్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా ఉధృతి చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులకు అనుమతిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం నుంచి శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు తెలిసేలా విస్త్రత ప్రచారం కల్పించాలని కేరళ ప్రభుత్వం కోరింది. శబరిమల యాత్రికులకు కేరళ ప్రభుత్వం సూచనలు: ► శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ► రెండు డోసుల కరోనా టీకా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం వెంట తీసుకురావాలి. లేదా దర్శనానికి 72 గంటల ముందుగా పరీక్ష చేయించుకుని, కోవిడ్ నెగిటివ్ ధృవీకరణ పత్రాన్ని వెంట తెచ్చుకోవాలి. ► శబరిమల ఆలయ పరిసరాలలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులనూ అనుమతించరు. ► పంబా నదిలో స్నానాలపై ఆంక్షలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయి. నదీ స్నానాలకు బదులు కేవలం నది వెంబడి షవర్ స్నానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. -
కరోనా అలర్ట్: భక్తులెవరూ మా గుడికి రావొద్దు!
తిరువనంతపురం: కరోనా భయాల నేపథ్యంలో కేరళలోని ప్రసిద్ధ శబరిమల దేవస్థానం బోర్డు భక్తులకు ఓ విజ్ఞప్తి చేసింది. నెలవారి పూజా కార్యక్రమాల సందర్భంగా మార్చి నెల ముగిసే వరకు భక్తులు ఆలయానికి రావొద్దని కోరింది. కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ బోర్డు ప్రెసిడెంట్ ఎన్.వాసు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. అయితే, ఎవరైనా తెలియక స్వామివారి దర్శనార్థం వస్తే.. వారిని ఆపే ప్రయత్నం చేయమని వాసు స్పష్టం చేశారు. (చదవండి: కరోనాపై విజయ్ దేవరకొండ అవగాహన కార్యక్రమం) కాగా, రాష్ట్రంలో 12 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు వరకు పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ప్రభుత్వ వేడుకలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మతపరమైన ఉత్సవాలు చేయొద్దని, పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోవాలని కోరారు. ఇదిలాఉండగా..కరోనా ప్రభావం అధికంగా ఉన్న పతనంతిట్ట జిల్లాలో శబరిమల ఆలయం ఉండటం గమనార్హం. 12 కేసుల్లో 7 కేసులు ఈ జిల్లాలో నమోదైనవే. (కరోనా ప్రకంపనలు: ఒక్క రోజులో 54 మరణాలు ) -
మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు
-
ఆలయ ప్రవేశం రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత శబరిమల అ య్యప్ప స్వామి ఆలయంలో మహిళలూ పూజలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎటువంటి వివక్షకు తావులేకుండా పురుషులతోపాటు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంది. ఆలయంలోకి 10 నుంచి 50 మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై శబరిమల దేవస్వమ్ బోర్డు నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ పక్షాన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, అమికస్ క్యూరీగా రాజు రామచంద్రన్ వాదించారు. మహిళలను ఆలయంలోకి రానివ్వక పోవటం ప్రాథమిక హక్కులను నిరాకరించడం, అంటరానితనం పాటించడం వంటిదేనన్నారు. ఆల యంలోకి మహిళల అనుమతికి సంబంధించి ఎటువంటి చట్టాలు లేనప్పటికీ వారిని పూజలు చేయకుండా అడ్డుకోవటం వివక్ష చూపడమేనని కోర్టు పేర్కొంది. ‘ పురుషులకు ఉన్న చట్టాలే మహిళలకూ వర్తిస్తాయి. మహిళలకు ఆలయ ప్రవేశానుమతి చట్టాలపై ఆధారపడి లేదు. అది ఆర్టికల్స్ 25, 26 ప్రకారం రాజ్యాం గం కల్పించిన హక్కు’ అని తెలిపింది. రాష్ట్రం లోని అన్ని ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ కేరళ ప్రభుత్వ లాయరు తెలపడంపై స్పందించిన కోర్టు.. ‘పిటిషనర్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదనలు వినాల్సిన అవసరం లేకపోవటం ఒక్కటే దీని వల్ల కలిగిన ప్రయోజనం. 2015లో ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించిన కేరళ ప్రభుత్వం.. రెండేళ్ల తర్వా త 2017లో అనుమతి నిరాకరించింది. కాలా న్ని బట్టి మీరు నిర్ణయాలు మార్చుకుంటున్నా రు’ అని వ్యాఖ్యానించింది. ఇదే అంశంలో యంగ్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి. మహిళలకు శబరిమల ఆ లయ ప్రవేశం నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది అక్టోబర్లో దాఖలైన పిటి షన్ను కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ బెంచ్ మహిళలను ఆలయం లోకి నిరాకరించడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందా లేదా అనే దానితోపాటు కీలకమైన అంశాలపై వాదనలు వింటుంది. 12 ఏళ్ల న్యాయపోరాటం ► 1965 నాటి కేరళలోని హిందూ ప్రార్థనా స్థలాల (ప్రవేశ అధికారం)నిబంధన 3(బి) కింద ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధానికి చట్టబద్ధత కల్పించారు. ► ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 2006లో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. లింగభేదం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదని, అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న రాజ్యాంగ నిబంధనకు ఇది విరుద్ధంగా ఉందని, మతాచారాలను పాటించే స్వేచ్ఛకు కూడా భంగం కలిగిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. ► విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అదే ఏడాది కక్షిదారులకు నోటీసులిచ్చింది. ► 2008 మార్చి7న ఈ కేసును త్రిసభ్య బెంచ్కు అప్పగించగా ఏడేళ్ల పాటు ఎలాంటి పురోగతీ లేదు. ► 2016 జనవరి 11న సుప్రీంకోర్టు బెంచ్ మళ్లీ కేసు విచారణను మొదలు పెట్టింది. ► కేసు విషయంలో కేరళ ప్రభుత్వం మూడుసార్లు తన వైఖరిని మార్చుకోవడం గమనార్హం. 2006లో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం పిటిషన్ను సవాలు చేయరాదని నిర్ణయించగా, తర్వాత పగ్గాలు చేపట్టిన యూడీఎఫ్ సర్కారు మహిళలపై నిషేధాన్ని సమర్థించింది. మళ్లీ అధికారం చేపట్టిన ఎల్డీఎఫ్ తన పూర్వ వైఖరినే వ్యక్తపరిచింది. ► త్రిసభ్య బెంచ్ 2017లో కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. -
అయ్యప్ప సన్నిధిలోజననేత జగన్
సాక్షి, రాజమండ్రి :పవిత్ర గోదావరి తీరంలోని ప్రసిద్ధ శ్రీ ధర్మశాస్తా ఆధ్యాత్మిక కేంద్రాన్ని (అయ్యప్పస్వామి ఆలయం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి రోడ్ కం రైల్వే వంతెన మీదుగా రాజమండ్రి చేరుకున్న ఆయన సరస్వతి ఘాట్ (వీఐపీ ఘాట్) పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు. శబరిమలైలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని తలపించేలా రాతిశిలలతో మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. పుష్కరాల సందర్భంగా ఈ ఆలయాన్ని దర్శించుకున్న జగన్మోహన్రెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. డాక్టర్ ఎస్.చంద్రమౌళిస్వామి ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు వేదమంత్రోచ్ఛరణలతో జగన్మోహన్రెడ్డికి గులాబీలు, అక్షతలతో ఆశీర్వచనాలు పలికారు. సంప్రదాయ తలపాగాలో.. స్వామివారి పట్టువస్త్రంతో చంద్రమౌళిస్వామి అలంకరించిన సంప్రదాయక తలపాగాలో జగన్మోహన్రెడ్డి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బంగారు పూత పూసిన అయ్యప్పస్వామి పెండెంట్స్ను ఆయనకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని విఘ్నేశ్వరుడు, సువర్చలాదేవి, ఆంజనేయస్వామి, వ్యాఘ్రేశ్వరుడు సుబ్ర హ్మణ్య స్వామివార్లను కూడా దర్శించుకున్న జగన్.. అయ్యప్ప 18 మెట్ల పీఠాన్ని దర్శించుకుని స్వయంగా దీపారాధన చేశారు. అనంతరం కొద్దిసేపు కూర్చున్నారు. ఆలయంలో నిత్యాన్నదానాన్ని పరిశీలించారు. ఆలయ నిర్మాణం, విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన రాజమండ్రికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో దివంగత జక్కంపూడి ఈ ఆలయాన్ని నిర్మించారని ఆలయ చైర్పర్సన్ జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు. యాత్రికులకు పలకరింపు ఆలయానికి వచ్చిన పుష్కర యాత్రికులను జగన్ పలకరించారు. ప్రతి ఒక్కరినీ ఎక్కడ నుంచి వచ్చారు? పుష్కర స్నానం చేశారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అని ఆరా తీశారు. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు జగన్ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రతి ఒక్కరూ కరచాలనం చేస్తూ సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. గర్భగుడిలో జగన్ సంప్రదాయబద్ధంగా పూజలు చేయడాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. భక్తులతోపాటు వేద పండితులు, ఆలయ సిబ్బంది కూడా జననేతను చూసేందుకు ఆసక్తి చూపారు. ఆలయానికి వచ్చిన జగన్కు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు చల్లా శంకర్రావు, పోలసపల్లి హనుమంతరావు, కేశవరాజు స్వాగతం పలికారు. పట్టువస్త్రాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిత్యాన్నదాన వంటశాలను పరిశీలించి క్యూలైన్లో నిలుచున్న భక్తులతో ముచ్చటించారు. గోదారమ్మకు చీర, పసుపు, కుంకుమ, పువ్వులు జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా జక్కంపూడి విజయలక్ష్మి సమర్పించారు. సుమారు 45 నిమిషాలపాటు ఆలయంలో గడిపిన అనంతరం జగన్మోహన్రెడ్డి నేరుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని విమానంలో హైదరాబాద్ పయనమయ్యారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్, రాష్ర్ట కార్యదర్శులు జక్కం పూడి రాజా, కర్రి పాపారాయుడు, సుంకర చిన్ని, తాడి విజయభాస్కరరెడ్డి, యువజన విభాగం రాష్ర్ట కార్యదర్శి గుర్రం గౌతమ్, పార్టీ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, ఆకుల వీర్రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, రాష్ర్ట యువజన విభాగం కార్యదర్శి వాసిరెడ్డి జమీల్, రాజమండ్రి నగరపాలక సంస్థలో పార్టీ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు ఆర్వీవీ సత్యనారాయణచౌదరి ఉన్నారు.


