ఇన్ఫోసిస్ చేతికి అమెరికా కంపెనీ
- ‘పనయా’ కొనుగోలు
- డీల్ విలువ రూ. 1,245 కోట్లు
బెంగళూరు: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా అమెరికాకు చెందిన ఆటోమేషన్ టెక్నాలజీసంస్థ ‘పనయా’ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,245 కోట్లు) ఉంటుందని ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా సోమవారం తెలిపారు. మరింత వైవిధ్యమైన కొత్త సర్వీసులు అందించేందుకు పనయా కొనుగోలు ఉపయోగపడగలదని వివరించారు. తమ క్లయింట్లు వ్యయాలు, రిస్కులను తగ్గించుకునేందుకు పనయా సేవలు తోడ్పడగలవని సిక్కా పేర్కొన్నారు.
మార్చి 31 నాటికల్లా ఈ డీల్ పూర్తి కాగలదని ఆయన పేర్కొన్నారు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సర్వీసుల మార్కెట్లో ఇన్ఫీ స్థానాన్ని మరింత పటిష్టం చేయడానికి ఇది తోడ్పడగలదని పనయా సీఈవో డొరొన్ గెర్స్టెల్ తెలిపారు. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే పనయా.. క్లౌడ్ ఆధారిత సర్వీసులు అందిస్తోంది. కోక కోలా, మెర్సిడెస్-బెంజ్, యూనిలీవర్ వంటి సంస్థలు పనయా క్లయింట్లుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్ 2012 సెప్టెంబర్లో జ్యూరిక్కి చెందిన లోడ్స్టోన్ హోల్డింగ్ను కొన్న తర్వాత ఇది రెండో భారీ డీల్. ప్రస్తుతం ఇన్ఫీ వద్ద దాదాపు రూ. 32,000 కోట్ల నగదు నిల్వలున్నాయి.