breaking news
AUT terrorists
-
ఐసిస్ సానుభూతిపరుడికి ముగిసిన కస్టడీ
హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరుడు అతావుల్ రెహమాన్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హజరుపర్చగా.. ఈ నెల 26 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం రెహమాన్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే కస్టడీ ముగిసిన మరో ముగ్గురు ఐసిస్ సానుభూతిపరులు చంచల్గూడ జైలులో ఉన్నారు. -
మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
-
మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
హైదరాబాద్: కస్టడీ ముగియటంతో ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో ఏ1గా ఉన్న యజ్దానీ, ఏ2 హబీబ్ అహ్మద్ను ఎన్ఐఏ మరో ఎనిమిది రోజుల పాటు కస్టడీ కోరింది. దీంతో మరో ముగ్గురికి న్యాయస్థానం ఈ నెల 26వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇటీవల పాతబస్తీలో అరెస్ట్ చేసిన ఐదుగురిని ఎన్ఐఏ అధికారులు 12 రోజులపాటు విచారణ జరిపి కస్టడీ ముగియటంతో ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. వారి వద్ద నుంచి ఎన్ఐఏ కీలక విషయాలను రాబట్టింది. కాగా నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ అధికారులు మరో ఇద్దరు సానుభూతిపరులు యాసిర్ నియమతుల్లా, అత్తావుల్ రెహ్మాన్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అయిదుగురు సానుభూతిపరుల అరెస్ట్ తో వీరిద్దరూ భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకూ ఎన్ఐఏ అధికారులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. కాగా హైదరాబాద్లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా, మిగిలిన ఆరుగురిని సాక్షులుగా మార్చి విడుదల చేసింది. -
30 రోజులు కస్టడీ కోరిన ఎన్ఐఏ
హైదరాబాద్ : ఐసిస్ సానుభూతిపరుల కస్టడీ పిటిషన్పై శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. 30 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా కస్టడీపై అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని, నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా హైదరాబాద్లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా, మిగిలిన ఆరుగురిని సాక్షులుగా మార్చి నిన్న విడుదల చేశారు. అరెస్టు చేసిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ ఇబ్బు, హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ బిన్ అహ్మద్ అమౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ లను ఎన్ఐఏ అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జూలై 14 వరకు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. తదుపరి విచారణ కోసం ఆ ఐదుగురినీ తమ కస్టడీకి అనుమతించాలని కోర్టులో ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతోంది. -
నాందేడ్లో ఆయుధాలు కొని..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేయాలని, తుపాకులతో బీభత్సం సృష్టించాలని కుట్ర పన్నిన ఏయూటీ ఉగ్రవాదులు.. అందుకోసం కావల్సిన సామగ్రి కోసం పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని అజ్మీర్లో ఆయుధాలు కొనేందుకు వెళ్లి, అక్కడ రూ. 65 వేలు చెల్లించినా, వాళ్లకు ఆయుధాలు మాత్రం లభ్యం కాలేదు. ఉగ్రదాడులు చేయడానికి ఒప్పుకొన్నందుకు వీళ్లు ఒక్కొక్కరికి లక్షన్నర చొప్పున ముట్టందని కూడా జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అజ్మీర్లో ఆయుధాలు దొరక్కపోవడంతో మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లి అక్కడ రెండు సెమీ ఆటోమేటిక్ 9ఎంఎం పిస్టళ్లు కొన్నారు. ఆ తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్లను హైదరాబాద్, అనంతపురం నగరాల్లో కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా లేనిచోట ఐఈడీ పరీక్షలు, ఇతర ప్రాక్టీసు చేసినట్లు కూడా చెబుతున్నారు. బాంబులు ఎలా తయారుచేయాలన్న విషయాన్ని ఇబ్రహీం తమకు యూట్యూబ్ వీడియోల ద్వారా చూపించినట్లు ఎన్ఐఏ విచారణలో హబీబ్ వెల్లడించాడు. ప్రభుత్వంపై భారీ యుద్ధానికి తెగబడాలన్న ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున పేలుళ్లు, కాల్పులకు వాళ్లు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అయితే, కేంద్ర నిఘావర్గాల సమాచారం సరైన సమయంలో అందడం, వెంటనే ఎన్ఐఏ కూడా స్పందించడంతో హైదరాబాద్ నగరానికి భారీ ఉగ్రవాద ముప్పు తప్పినట్లయింది. -
ఉగ్రవాదుల టార్గెట్లో భాగ్యలక్ష్మి ఆలయం: డీసీపీ
చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం చాలా కాలంగా ఉగ్రవాదుల టార్గెట్లో ఉందని, అందువల్ల ఈ ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశామని హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం కావడంతో నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఒక ఐజీ స్థాయి అధికారితో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయం, మక్కా మసీదులలో భద్రతను ఆయన సమీక్షించారు. నెట్ చాటింగ్, మొబైల్ సంభాషణలను ట్రాక్ చేయడం ద్వారానే ఉగ్రవాదుల అరెస్టు సాధ్యమైందని డీసీసీ సత్యనారాయణ వెల్లడించారు. ఇంటర్నెట్ కార్యకాలాపాలపై నిఘా పెంచామని, సున్నితమైన ప్రాంతాలలో భద్రతను మరింత పెంచామని ఆయన చెప్పారు. -
వీకెండ్ విధ్వంసం.. టార్గెట్.. సిటీ
►వారాంతంలో పేలుళ్లు, విధ్వంసాలకు ముష్కరుల కుట్ర ► పేలుళ్ల తర్వాత విచ్చలవిడిగా కాల్పులు జరిపేందుకు పథకం ► ఉగ్రవాదుల జాబితాలో 15 టార్గెట్లు.. వాటిలో మూడింటిని ఎంచుకొని ఒకేరోజు ఏకకాలంలో దాడులకు ప్లాన్ ► బాంబుల తయారీకి అవసరమైన సామగ్రి అంతా ఇక్కడే కొనుగోలు ► ‘మాల్ తయ్యార్ హై..’ అంటూ సిరియాలోని ఆర్మర్తో సంప్రదింపులు ► జూలై 6లోపు ‘ఆపరేషన్’ పూర్తి చేయాలంటూ ఆర్మర్ ఆదేశం ► ఈ వారాంతంలో పేలుళ్లకు స్కెచ్.. ఇంతలోనే భగ్నం చేసిన ఎన్ఐఏ ► అరెస్టైన ఐదుగురికి 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ ►మిగిలిన ఆరుగురినీ సాక్షులుగా మార్చిన ఎన్ఐఏ ముష్కరులు ఈ వారాంతంలోనే హైదరాబాద్లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నారా? గురు, శుక్రవారాల్లో బాంబుల్ని తయారు చేసి, శని, ఆదివారాల్లో పేలుళ్లకు పథకం రచించారా? పాతబస్తీతోపాటు సికింద్రాబాద్లోని ప్రార్థన స్థలాలు.. ఐటీ కారిడార్లోని మాల్స్.. నగరంలోని జనసమ్మర్థ ప్రాంతాలను టార్గెట్ చేశారా? ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వర్గాలు. బుధవారం ఎన్ఐఏ అరెస్ట్ చేసిన అనుమానిత ఉగ్రవాదుల విచారణ, సాంకేతిక అంశాల విశ్లేషణలో వారి కుట్ర వ్యూహాలు వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీలోని 10 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన 11 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ వర్గాలు.. వారిలో ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన ఆరుగురిని సాక్షులుగా మార్చి గురువారం విడుదల చేశారు. - సాక్షి, హైదరాబాద్ అన్నీ ఇక్కడే కొన్నారు.. హైదరాబాద్తోపాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించడానికి సిద్ధమైన ఏయూటీ మాడ్యుల్ అందుకు అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్థానికంగానే సమకూర్చుకున్నాయి. పాతబస్తీలోని వివిధ మెడికల్ షాపులు, ఫెర్టిలైజర్స్ దుకాణాలు, వాచ్షాపులతో పాటు ఇతర దుకాణాల నుంచి తమకు అవసరమైన సామగ్రిని సమీకరించుకున్నారు. యూరియా, పంచదార, మినరల్ యాసిడ్, ఎసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, మూడు లీటర్ల పెయింట్ కొనుగోలు చేసిన ముష్కరులు.. వాటితో బాంబులు తయారు చేసేందుకు అవసరమైన ఉపకరణాలను సిద్ధం చేసుకున్నారు. ఈ ముఠాకు చీఫ్గా వ్యవహరించిన ఇబ్రహీం యజ్దానీ ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. దీంతో ఇబ్రహీం అక్కడ ఆర్మర్కు చెందిన వ్యక్తుల్ని కలసి ఉంటాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది. మాల్ తయ్యార్ హై.. అవసరమైన పేలుడు పదార్థాలు సిద్ధం చేసుకున్న ముష్కరులు వాటన్నింటినీ హష్మాబాద్లో ఉండే హబీబ్ మహ్మద్ ఇంటి పరిసరాల్లో దాచి పెట్టారు. అక్కడే బాంబులు తయారీకి సన్నాహాలు చేశారు. ఇబ్రహీం యజ్దానీ గతనెలలో సిరియాలో ఉన్న షఫీ ఆర్మర్ను ఆన్లైన్లో సం ప్రదించి.. ‘‘మాల్ తయ్యార్ హై... క్యా కర్ నా?’ అని అడిగాడు. దీనికి ఆర్మర్... బాంబులు ఎలా తయారు చేయాలో చెప్పే వీడియోలు పంపిస్తానని చెప్పాడు. అన్న ప్రకారమే కొన్ని వీడియోలను సోషల్ మీడియా యాప్ ద్వారా పంపించాడు. వాటి ఆధారంగా ఇబ్రహీం నేతృత్వంలో హబీబ్ ఇంట్లో ప్రయోగాలు ప్రారంభించారు. బాంబుల్లో టైమర్లుగా వినియోగించడానికి చిన్న సైజు అలారం గడియారం కూడా కొన్నారు. 6 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఆన్లైన్ ద్వారా గతవారం ఇబ్రహీంను సంప్రదించిన షఫీ ఆర్మర్.. జూలై ఆరో తేదీ లోపు ఆపరేషన్ పూర్తి చేయాలని ఆదేశించాడు. వీకెండ్స్లోనే విధ్వంసానికి సిద్ధం కావాలని చెప్పాడు. అందుకు అవసరమైన నగదు అందకపోవడంతో గత వారం చేపట్టాల్సిన ఆపరేషన్ వాయిదా పడింది. తర్వాత రూ.15 లక్షల నగదు అందుకున్న ఇబ్రహీం ఈ వారాం తంలోనే పేలుళ్లకు ప్రణాళికలు రచించాడు. బుధవారం అరెస్టు కాకుండా ఉండి ఉంటే... గురు/శుక్రవారాల్లో బాంబుల్ని తయారు చేసి, శని/ఆదివారాల్లో పేలుళ్లు జరపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు మిగిలిన నలుగురూ అంగీకరించడంతో సన్నాహాలు ముమ్మరం చేశారు. షాక్ నుంచి కోలుకొనే లోపు.. ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో వారాంతంలో బాంబు పేలుళ్లకు పాల్పడటంతో పాటు అక్కడున్న జనాలు ఆ షాక్ నుంచి కోలుకునే లోపే విచ్చలవిడిగా కాల్పులు జరిపేందుకు ముష్కరులు కుట్ర పన్నారు. ఇందుకోసం వారు రెండు .9 ఎంఎం సెమీ ఆటోమాటిక్ పిస్టల్స్తో పాటు కొన్ని తూటాలను మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కొనుగోలు చేశారు. కొందరికి పైరింగ్ రాకపోవడం తో హబీబ్ ఇంటికి సమీపంలో ఉన్న బండ్లగూడ గుట్టల్లో ప్రాక్టీస్ చేసేందుకు ఉపక్రమించారు. అయితే వారి వద్ద కొన్ని తూటాలే ఉండటంతో ప్రాక్టీస్ కోసం వాటిని వాడలేదు. దీంతో ఫహద్ వద్ద ఉన్న టెలిస్కోపిక్ ఎయిర్గన్తో ప్రాక్టీస్ చేశారు. స్థానికంగా కొన్ని పిల్లెట్స్ను ఖరీదు చేసి వాటితో ఎయిర్గన్ ద్వారా గుట్టల్లో ప్రాక్టీస్ చేశారు. అన్ని ప్రాంతాల్లో టార్గెట్స్ ఎంపిక ఏయూటీ మాడ్యూల్ పాతబస్తీతో పాటు ఐటీ కారిడార్లోని మాల్స్, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో సాయంత్రం 5 నుంచి 7 గం. మధ్య పంజా విసిరేందుకు సిద్ధమైంది. ఈలోపు ఎన్ఐఏ అధికారులు వీరి కుట్రను భగ్నం చేయడంతో ఆపరేషన్ ఆగిపోయింది. బుధవారం అరెస్టు చేసిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ ఇబ్బు, హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ బిన్ అహ్మద్ అమౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ లను గురువారం ఎన్ఐఏ అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జూలై 14 వరకు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. తదుపరి విచారణ కోసం ఆ ఐదుగురినీ తమ కస్టడీకి అనుమతించాలని కోర్టులో ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. 20న ఆదేశాలు.. 22న ఎఫ్ఐఆర్.. 29న అరెస్టు కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఏయూటీ హైదరాబాద్ మాడ్యుల్ వివరాలు తెలుసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా జూన్ 20న ఎన్ఐఏకు ఆదేశాలిచ్చింది. దీంతో హైదరాబాద్ ఎన్ఐఏ యూనిట్ 22న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఈ యూనిట్ ఈ ఏడాది నమో దుచేసిన తొలికేసు ఇదే. బుధవారం అరెస్టు చేసిన నిందితులపై ఎన్ఐఏ ఐపీసీ 121 (ఎ), 122, ఎక్స్ప్లోజివ్స్ సబ్స్టాన్సెస్ యాక్ట్లోని 4, 5, అన్లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్లోని 18 , 18 బీ, 38, 39 సెక్షన్లపై దేశద్రోహం తదితర అభియోగాలు నమోదు చేశారు. బుధవారం ఉదయం నుంచే దాడులు, అరెస్టులకు 8 మంది ఉన్నతాధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్తో పాటు కోచి, ముంబైలకు చెందిన అధికారులను ఇందుకోసం రప్పించారు. రెండు నెలల కిందటే ఆ‘రా’ ఐఎస్ అనుబంధ ఉగ్రవాదుల కుట్రను ఛేదించడంలో రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) కీలకంగా వ్యవహరించింది. కుట్రకు సరిగ్గా 2 నెలల కిందట ఫేస్బుక్, వాట్సప్ ద్వారా అనుమానాస్పద మేసేజ్లు చక్కర్లు కొట్టాయి. దాంతో అనుమానం వచ్చిన ‘రా’ అధికారులు వాటిపై దృష్టిసారించారు. వెంటనే ఆ ఖాతాల ఫేస్బుక్ అకౌంట్తో పాటు పాస్వర్డ్లను హైదరా బాద్కు పంపించారు. అలా పంపిన వాటి ద్వారా నిత్యం చాటింగ్ చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించి ఇతర నిఘా సంస్థలను హెచ్చరించారు. రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు అనుమానితులను గుర్తించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. అనుమానిత కదలికలపై పక్షం రోజులుగా నిఘా వేశారు. ఉగ్రకుట్ర భగ్నం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఎయిర్పోర్ట్పై టార్గెట్? ముష్కరులు మొత్తమ్మీద నగరంలోని 15 ప్రాంతాల్లో రెక్కీ చేసి.. వాటిలో మూడింటిని ఎంచుకుని ఒకే రోజు, ఒకే సమయంలో పంజా విసిరేందుకు వ్యూహం రచించారు. ఇప్పటికే కొన్ని చోట్ల రెక్కీ పూర్తి చేశారని సమాచారం. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో ఈ ఏడాది మార్చి 22న విమానాశ్రయంపై దాడి తరహాలోనే ఇక్కడా విరుచుకుపడాలని భావించారు. అందుకు అనుగుణంగానే బ్యాగేజ్ స్కానర్లకూ చిక్కని టీఏటీపీ (ట్రైఎసిటోన్ ట్రై పెరాక్సైడ్)ని వినియోగించాలనుకున్నారు. దీనిపై షఫీ ఆర్మర్తో సంప్రదింపులు జరిపారు. అయితే అంతా కొత్తవారు కావడంతో శంషాబాద్ విమానాశ్రయం వంటి అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడం సాధ్యం కాదంటూ ఆర్మర్ వారించినట్లు తెలిసింది. ఎన్ఐఏ అరెస్టు చేసిన ఐదుగురి నుంచి హైటెక్ సిటీ, ఆ పరిసర ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండే 2 రోడ్లకు సంబంధించిన మ్యాప్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆరుగురితో ‘164’ స్టేట్మెంట్ అరెస్టయిన ఐదుగురితో పాటు అదుపులోకి తీసుకున్న మహ్మద్ ఇర్ఫాన్, సయ్యద్ నైమతుల్లా హుస్సేనీ, మహ్మద్ అథుల్లా రెహ్మాన్, అల్ జిలానీ అబ్దుల్ ఖదీర్ మోసిన్ మహ్మద్, ఏఎం అజర్, మహ్మద్ అరబ్ అహ్మద్ పూర్వాపరాలను ఎన్ఐఏ క్షుణ్ణంగా పరిశీలించింది. వీరు ఇబ్రహీం తదితరులతో సంబంధాలు కొనసాగించినా... అరెస్టు చేయదగ్గ పాత్ర లేదని ప్రాథమికంగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురిని సాక్షులుగా పరిగణిస్తూ మేజిస్ట్రేట్ ఎదుట సీఆర్పీసీలోని 164 సెక్షన్ ప్రకారం వాంగ్మూలం నమోదు చేసి విడిచిపెట్టారు. ఇది నిందితులపై నేరం నిరూపించడానికి బలమైన ఆధారంగా మారనుంది. టార్గెట్లు ఇవే.. 1. చార్మినార్కు ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మీ దేవాలయం 2. సికింద్రాబాద్లోని గణేశ్ దేవాలయం 3. ఐటీ కారిడార్లో ఉన్న హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్ 4. దిల్సుఖ్నగర్ , బేగంబజార్లోని మార్కెట్లు 5. కొందరు ప్రముఖులతోపాటు ప్రభుత్వ ఆస్తులు, పోలీసుల భవనాలు -
ఉగ్ర టార్గెట్.. హైదరాబాద్, బెంగళూరు!
అతి త్వరలోనే హైదరాబాద్, బెంగళూరు నగరాలు టార్గెట్గా మూడు బృందాలతో విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిసింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ)కు చెందిన అనుమానిత ఉగ్రవాదులను బుధవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారించినప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో ప్రవేశపెడతారు. వీరిని పూర్తిగా విచారించేందుకు గాను తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరనుంది. అవసరమైతే పీటీ వారెంటు మీద ఢిల్లీకి కూడా తీసుకెళ్లి విచారిస్తామని చెబుతున్నారు. అనుమానిత ఉగ్రవాదులకు విదేశాల నుంచి భారీగా హవాలా మార్గంలో డబ్బులు అందినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరు పెద్ద ఎత్తును ఆయుధాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. క్రూడ్ బాంబులను తయారుచేయడంలో వీళ్లు నిపుణులని, బ్రసెల్స్ తరహా దాడులకు వీరు కుట్రపన్నారని అంటున్నారు. వీళ్లు తయారుచేసే బాంబులను బ్యాగేజి స్కానర్లతో సైతం గుర్తించలేమని చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే భారీ పేలుళ్లకు వీళ్లు కుట్ర పన్నారని తెలుస్తోంది.