Australian man
-
నిప్పు చల్లగా.. మంచు మంటగా!
మెల్బోర్న్(ఆస్ట్రేలియా): మంటను ముట్టుకుంటే కాలిపోతుంది. మంచును టచ్ చేస్తే చల్లగా ఉంటుంది. కానీ ఈ ఆ్రస్టేలియా వ్యక్తికి మాత్రం నిప్పు చల్లగా ఉంటుంది. చల్లని పదార్థం చురుక్కుమటుంది. అదెలా సాధ్యమంటే, అదో వింత వ్యాధి. అతని కాళ్లు, చేతులు గ్రహణ శక్తి కోల్పోయాయి. ఈ వ్యాధితో అతను ఐదేళ్లుగా బాధపడుతున్నాడు. ఎన్నో పరీక్షలు చేసినా వ్యాధేమిటో తెలిసింది కానీ చికిత్స ఏమిటో తెలియడం లేదు. ఆ్రస్టేలియాకు చెందిన 22 ఏళ్ల ఎయిడెన్ మెక్మానస్ 17వ ఏట హైస్కూల్ చివరి ఏడాదిలో ఉండగా ఈ సమస్య మొదలైంది. పాదాల్లో కొద్దికొద్దిగా అనుభూతిని కోల్పోవడం మొదలైంది. పాదాలు చక్కిలిగింతలు పెట్టినట్టుగా, తిమ్మిరెక్కినట్టుగా అనిపించడం మొదలైంది. పాదాల్లోకి రక్తం, ఇతర ద్రవాల సరఫరా లేదంటూ డాక్టర్ మందులిచ్చాడు. అవేవీ పని చేయలేదు. నడవడమే కష్టంగా మారడంతో న్యూరాలజిస్టులు 20కి పైగా రక్త పరీక్షలు చేశారు. బయాప్సీ కూడా చేసినా వ్యాధీ నిర్ధారణ కాలేదు. చివరకు అతను ఆక్సోనల్ పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడుతున్నాడని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇది శరీరానికి సంకేతాలను ప్రసారం చేయకుండా నాడీ కణాలను అడ్డుకుంటుంది. దాంతో తన కుమారుడు వేడిగా ఏదైనా తీసుకున్నప్పుడు, చల్లగా అనిపిస్తుందని, చల్లగా ఉన్నప్పుడు మండుతున్న అనుభూతిని పొందుతాడని తల్లి ఏంజిలా మెక్మానస్ వాపోయారు. అతని రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోంది. నడక సామర్థ్యం, కాళ్లు, చేతుల్లో సమతుల్యత, సమన్వయం తగ్గుతున్నాయి. నయం చేయలేని ఈ వ్యాధికి చికిత్సను భరించలేమని నేషనల్ డిజేబులిటీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ (ఎన్డీఐఏ) సైతం చేతులెత్తేసింది. చికిత్సేమిటో తెలియకుండా నిధులివ్వలేమని తేల్చేసింది. కానీ నొప్పి నివారణ మందులు తప్ప ప్రస్తుతానికి అతనికి చికిత్స అందుబాటులో లేదని న్యూరాలజిస్ట్ చెప్పుకొచ్చారు. పరిస్థితి నానాటికి దిగజారిపోయే పరిస్థితి ఉంది గనుక ఎన్డీఐఏలో చేర్చాలంటూ ఏజెన్సీకి లేఖ రాశారు. -
కాలి వేలే.. చేతి వేలైంది..
సిడ్నీ: ఆస్ట్రేలియా వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఓ వ్యక్తి ప్రమాదంలో చేతి బొటన వేలు కోల్పోగా అతని కాలి బొటన వేలును చేతి బొటన వేలుగా అతికించారు. పెర్త్కు చెందిన జాక్ మిచెల్(20) పశువుల కాపరి. అతను పనిచేస్తున్న ఫౌంహౌస్లో ప్రమాదవశాత్తు వేలును కోల్పోయాడు. వేగంగా దూసుకొచ్చిన ఎద్దు మిచెల్ను ఢీకొట్టింది. ఆ దాటికి అతని బొటన వేలు ఊడి కిందపడింది. ఇక అతని స్నేహితులు ఊడిన వేలుని ఐస్ మధ్య ఉంచి అతన్ని ఆసుపత్రికి తరలించారు. పెర్త్ డాక్టర్లు అతని వేలు అతికించడానికి శత విధాల ప్రయత్నించారు. రెండు సర్జరీలు కూడా చేశారు. అయినా ఆ వేలు అతకపోవడంతో తదుపరి చికిత్సకు సిడ్నీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని సూచించారు. అవసరమైతే కాలి బొటన వేలిని చేతికి అతికించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి మిచెల్ అంగీకరించడంతో సిడ్నీ డాక్టర్లు విజయవంతంగా కాలి వేలిని చేతికి అతికించారు. -
డేటింగ్కు వెళ్లి.. 14 అంతస్తులపై నుంచి పడి..
న్యూజిలాండ్: ఎప్పుడూ మనచుట్టూ ఉండేవాళ్లనే పూర్తిగా నమ్మలేకుండా ఉన్న నేటి పరిస్థితిలో కొంతమంది కొత్త సంబంధాలను చీకట్లో వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో దెబ్బతిని అర్ధాంతరంగా ప్రాణాలుకోల్పోతున్నారు. అందుకు ఉదాహరణగా నిలిచింది ఈ న్యూజిలాండ్కు చెందిన అమ్మాయి కథనం. ఆమె పేరు వారియెనా రైట్. వయసు 26 ఏళ్లు. అతడేమో ఆస్ట్రేలియాకు చెందినవాడు. పేరు గాబెల్ టోస్టీ(30). ఇద్దరు టిండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. వారి మధ్య గంటలకొద్ది గడిచిన చాటింగ్ కాస్త.. డేటింగ్ వరకు దారి తీసింది. అయితే, అతడిని నమ్మి టూర్ పేరుతో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ సిటీకి వచ్చిన రైట్ అక్కడ ఉన్న గాబెల్ ప్లాట్కు వెళ్లింది. ఈ సంఘటన 2014 ఆగస్టు 8న జరిగింది. అయితే, ఆరోజు తొలుత బాగానే ఉన్న అతడు ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అది కాస్త వారిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. అతడిని తప్పించుకునేందుకు ఇంట్లో వస్తువులు గాబెల్ పై విసిరింది. ఆమెపై చేయి చేసుకొని తన ఇంటి బాల్కనీలో పెట్టి తాళం వేస్తానని బెదిరించాడు. దీంతో మరింత బయపడిని రైట్ తనను ఇంటికి వెళ్లనివ్వాలని ఎంతో ప్రాధేయపడింది. అనంతరం అతడి నుంచి తప్పించుకునే దారిలేక కిటికీలో నుంచి కిందికి దిగే ప్రయత్నం చేస్తూ ఏకంగా పద్నాలుగు అంతస్తుల మీద నుంచి జారికిందపడి ప్రాణాలుకోల్పోయింది. అప్పుడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాజాగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. గాబెల్ ను కోర్టు దోషిగా ప్రకటించే అవకాశం ఉంది. తానేం ఆమెను కిందికి తోసివేయలేదని గాబెల్ న్యాయమూర్తితో చెబుతున్నాడు. సోమవారం తర్వాత జడ్జి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
చేసిన వెధవ పని చాలక..
సిడ్నీ: చేసిన వెధవ పని చాలక దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఆస్ట్రేలియా పౌరుడొకడు కోర్టు మెట్లెక్కాడు. చెడ్డ పని చేసినందుకు సమాజ సేవ చేయాలని అతడిని న్యాయస్థానం ఆదేశించింది. 'మ్యాడ్ మాట్'గా గుర్తింపు తెచ్చుకున్న మాథ్యూ మాలొనే ఈ ఏడాది జనవరిలో బతికున్న ఎలుక తలను నోటితో కొరికేశాడు. తర్వాత వోడ్కాతో దాన్ని శుభ్రం చేశాడు. అనంతరం దాని ముఖంపై బాదుతూ 'దాన్ని కొట్టటండి' అంటూ అరిచాడు. ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్టు చేశాడు. అతడిపై నెటిజన్లు విరుచుకుపడడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. 100 గంటల పాటు సామాజిక సేవ చేయాలని అతడిని బ్రిస్బేన్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఆదేశించింది. 25 ఏళ్ల మాథ్యూ మాలొనే మూడేళ్ల పాటు జంతువులను పెంచుకోకుండా అతడిపై నిషేధం విధించింది. అయితే తాను చేసిన పని పట్ల అతడు విచారం వ్యక్తం చేశాడు. -
దొంగే దొంగా దొంగా అని పోలీసులకు ఫోన్ చేస్తే..
సిడ్నీ: దొంగే దొంగా దొంగా అన్నట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. తమ స్థలంలో పెంచుకుంటున్న గంజాయిని తన తండ్రి తగులబెట్టేశాడని ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి ఓ కుమారుడు చెప్పాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని డార్విన్కు సమీపంలోగల హంప్టీ డూ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్తర్న్ టెర్రిటరీ పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన తండ్రితో తాను గొడవ పడ్డానని, అయితే, ఆ క్రమంలో తండ్రి తమ స్థలంలోని గంజాయి మొక్కలు తగులబెట్టాడని చెప్పాడు. అయితే, తాము ఇన్నాళ్లపాటు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగానే ఆ మొక్కలను కాల్చడంతో అది తప్పనుకొని భ్రమపడిన ఆ కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి ఈ చర్య గురించి చెప్పాడు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి చూడగా అక్కడ గంజాయి మొక్కలు ఉన్నమాట వాస్తవమే అని తేలింది. ఈ ఘటనకు సంబంధించి తండ్రి, కొడుకులు ఇద్దరు దోషులే అని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే, ఇంకా కేసు నమోదు చేయలేదు.