ఆయిల్ఫెడ్పై అదనపు భారం
- ఆంధ్రాకు పామాయిల్ గెలల తరలింపు
- రికవరీలో ఐదుశాతం వ్యత్యాసం
- రైతాంగానికి తీరని నష్టం
- పట్టించుకోని అధికారులు
అశ్వారావుపేట: అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో చెల్లింపులు ఆలస్యమవుతున్నాయనే తప్పుడు సంకేతాలతో ఇక్కడి గెలలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగికి తరలిస్తుండటం చర్చనీయాంశమైంది. ఫ్యాక్టరీ సరిగా నడవడం లేదని కొందరు దుష్ర్పచారం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్షన్ సెంటర్ల నుంచి వచ్చే గెలలను అధికారులే దగ్గరుండి పెదవేగికి తరలిస్తున్నారు. ఇలా చేయడంవల్ల ఏపీ ఆయిల్ఫెడ్పై రవాణ ఖర్చుల భారం పడుతోంది. రెండు రాష్ట్రాల్లోన్ని రైతాంగానికి నష్టాన్ని కలిగించే ఈ చర్యపై అధికారులు, రైతుసంఘాల ప్రతినిధులు స్పందించకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
అశ్వారావుపేట కర్మాగారంలో ముడిచమురు ట్యాంకులు నిండాయని, ప్లాంట్ మరమ్మతులు చేపట్టాలని కొంతకాలం ఫ్యాక్టరీని నిలిపివేశారు. ఇదే అదనుగా అధికారులు గెలలను పెదవేగికి తరలించడం ప్రారంభించారు. దీనివల్ల రోజుకు 80 టన్నుల పామాయిల్ గెలల రవాణాభారం ఆయిల్ఫెడ్పై పడింది. ఇప్పుడు ట్యాంకులు మెరుగయ్యాయి. ప్లాంట్ మరమ్మతులు కూడా పూర్తయ్యాయి. అయినా ఇంకా పెదవేగికి గెలలు సరఫరా అవుతూనే ఉన్నాయి. అశ్వారావుపేటకు రావాల్సిన గెలలను పెదవేగికి తరలించడం వల్ల టన్నుకు రూ.200 అదనంగా భారం పడుతోందని అంచనా.
రికవరీలో భారీ వ్యత్యాసం..
అశ్వారావుపేట, పెదవేగి ప్లాంట్లు రెండూ ఆయిల్ఫెడ్కు చెందినవే అయినా అధికారుల వైఖరి, ఇంజినీరింగ్ పరికరాల్లో వ్యత్యాసం వల్ల ఒకే తోటలో పండించిన గెలలను క్రషింగ్ చేసినపుడు ఐదుశాతం వరకు రికవరీలో తేడా వస్తోందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేట కంటే పెదవేగిలో ఐదుశాతం తక్కువగా చూపుతున్నారంటున్నారు. ఈ ఐదుశాతం తక్కువగా చూపించడం వల్ల జిల్లాలోని పామాయిల్ రైతాంగం నష్టపోతోంది. అందుకే తెలంగాణలోని పామాయిల్గెలలను అశ్వారావుపేటలోనే క్రషింగ్ చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట డివిజనల్ అధికారి రమేష్కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా కలెక్షన్ సెంటర్ల గెలలను ఇకమీద అశ్వారావుపేట ప్లాంటుకు తరలించేలా ఆదేశిస్తామన్నారు.