breaking news
anjana sinha
-
తాత్కాలిక సచివాలయానికి ఎస్పీఎఫ్ భద్రత
పూర్తిస్థాయిలో విధుల నిర్వహణకు సన్నద్ధమవుతున్న ఏపీ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం భద్రత ఏర్పాట్లపై పోలీసు శాఖ దృష్టి సారించింది. దసరా నుంచి సీఎం చంద్రబాబుతోసహా మంత్రులందరూ తాత్కాలిక సచివాలయం నుంచే విధులు చేపడతామని చెప్పడంతో పోలీసు శాఖ కార్యాచరణకు ఉపక్రమించింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం భద్రత బాధ్యతలను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)కు అప్పగించారు. తాత్కాలిక సచివాలయాన్ని ఎస్పీఎఫ్ శుక్రవారం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇకనుంచి తాత్కాలిక సచివాలయ భద్రతతోపాటు ఉద్యోగులు, సందర్శకుల రాకపోకలన్నీ ఎస్పీఎఫ్ పర్యవేక్షిస్తుంది. తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో ఎస్పీఎఫ్కు ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. అదనపు డీజీపీ అంజనాసిన్హా ఈ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం డీఐజీ ఏసురత్నం, ఇతర అధికారులతో సమావేశమై తాత్కాలిక సచివాలయ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. సచివాలయానికి మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దసరా నుంచి డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రతను కల్పిస్తారు. ఎంతమంది అధికారులు, సిబ్బందిని కేటాయించాలన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికి ఒక సీఐ, ముగ్గురు ఎస్.ఐ.లు, ఒక అసిస్టెంట్ కమాండెంట్తోపాటు దాదాపు 100 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు. సచివాలయంలోకి ప్రవేశించే అన్ని మార్గాలు, ఆరుబ్లాకుల వద్ద భద్రత సిబ్బందిని నియోగించారు. ఉద్యోగులు కూడా ఐడీ కార్డులు చూపించే సచివాలయంలోకి ప్రవేశించాలి. అనుమతి పాస్లు ఉన్న సందర్శకులనే లోపలికి అనుమతిస్తారు. సందర్శకుల వివరాలు పరిశీలించి అనుమతి పాస్లు మంజూరుచేసేందుకు ప్రధాన ద్వారం సమీపంలో ఓ కౌంటర్ ఏర్పాటు చేస్తారు. అదనపు డీజీ అంజనాసిన్హా విలేకరులతో మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయం భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 24/7 కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని, ఐడీ కార్డులు, పాస్లు లేనిదే ఎవరినీ సచివాలయంలోకి అనుమతించబోమని చెప్పారు. -
'ఆ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే'
హైదరాబాద్ : ఐపీఎస్ అంజనా సిన్హా నుంచి తనకు ప్రాణ భయం ఉందని సినీనటి పూజిత తెలిపారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండో పెళ్లి చూసుకున్న విజయ్ గోపాల్ పెద్ద మోసగాడని అన్నారు. పలు క్రిమినల్ కేసులు కూడా అతడిని తక్షణమే అరెస్ట్ చేయాలని పూజిత డిమాండ్ చేశారు. విజయ్ గోపాల్ కొద్దిరోజుల క్రితం ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పూజిత మంగళవారం హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డిని కలిసి, తన భర్త మోసం చేసి రెండో పెళ్లి చూసుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ రేఖారాణి, విజయ్ గోపాల్ పెళ్లికి సంబంధించి పూర్తి ఆధారాలున్నాయన్నారు. తనకు కొంతమంది నుంచి ప్రాణహాని కూడా ఉందని, ఈ పెళ్లికి ఐపీఎస్ అంజనా సిన్హానే మొదటి సాక్షి అన్నారు. చట్ట విరుద్ధంగా వివాహం చేసుకున్న వారితో పాటు, వారికి సహకరించినందుకు అంజనా సిన్హాపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసు విచారణ నుంచి అంజనా సిన్హాను తప్పించాలని, లేకుంటే తనకు న్యాయం జరగదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తనకు భద్రత కల్పించి న్యాయం చేయాలని పూజిత వేడుకున్నారు. న్యాయం జరిగేవరకూ తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టంచేశారు. మీడియా కూడా తనకు సహకరించాలని పూజిత విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై విజయ్ గోపాల్ స్పందిస్తూ పూజితతో తనకు వివాహం జరగలేదని, కేవలం సహజీవనం మాత్రమే చేశానని తెలిపారు.