breaking news
All India NR Congress
-
పుదుచ్చేరిలో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరోసారి ప్రజాతీర్పు కోరడానికి సిద్ధమైంది. ఆయన సారథ్యంలోని ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమాగా ఉంది. విపక్ష డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా అదృష్టం పరీక్షించుకుంటోంది. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి ఉన్న పేరు మరోసారి కలిసొస్తుందని ఎన్డీఏ ఆశిస్తోంది. కూటమి భాగస్వామి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం, పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులివ్వడాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తోంది. డీఎంకే, కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. హామీలు నెరవేర్చలేదని, శాంతి భద్రతలు దిగజారాయని ఆరోపిస్తున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ బలపడటంపై బీజేపీ కన్నేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు పుదుచ్చేరిలో ఇప్పటికే పలుమార్లు విస్తృతంగా పర్యటించారు. విజయ్ పార్టీతో చేటెవరికి? అంతర్గత కలహాలు, సీట్లపై సిగపట్లు డీఎంకే కూటమిని కలవరపెడుతున్నాయి. పుదుచ్చేరిలో ఒకప్పుడు ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం డీఎంకేకు జూనియర్ భాగస్వామిగా మారిపోయింది. అలాగని డీఎంకే 20 సీట్లకు పట్టుబడుతుండటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తోంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసినా సీట్ల పంపకంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దాంతో పలు అసెంబ్లీ స్థానాలకు డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులిద్దరూ నామినేషన్లు వేశారు. ఇది వాటి మధ్య స్నేహపూర్వక పోటీలకు దారి తీస్తే కూటమి విజయావకాశాలపై ప్రభావం పడుతుంది. విజయ్ పార్టీ టీవీకే పోటీలో ఉండటం తమకే లాభమని అధికార, విపక్ష కూటములు రెండూ లెక్కలేసుకుంటున్నాయి. తమిళ జాతీయవాది సీమాన్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ మూడో స్థానం దక్కించుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏ కూటమి సానుకూలతలు → సీఎం రంగస్వామి ప్రజాదరణ → ప్రధాని మోదీ కరిష్మా → కేంద్ర నిధులతో జరిగిన అభివృద్ధి పనులు → డీఎంకే కూటమి అనైక్యత ప్రతికూలతలు → ప్రభుత్వ వ్యతిరేకత → మంత్రులపై అవినీతి ఆరోపణలు → విజయ్ పార్టీతో ఓటుబ్యాంకుకు గండి పడే ఆస్కారండీఎంకే కూటమి సానుకూలతలు → రంగస్వామి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత→ డీఎంకే ద్రవిడ జాతీయవాద నినాదం → పలు జనాకర్షక పథకాల హామీలుప్రతికూలతలు → సీట్ల సర్దుబాటుపై ఎడతెగని సిగపట్లు → పలు అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులను బరిలో దింపడం– సాక్షి, నేషనల్ డెస్క్ -
పుదుచ్చేరిలో హస్తం హవా!
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈసారి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) ప్రతిపక్ష హోదాకు పరిమితం కాక తప్పదని సర్వేలు అంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన ఎన్.రంగసామికి భంగపాటు తప్పదని పేర్కొంటున్నాయి. పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్-డీఎంకే 14, ఏఐఎన్ఆర్సీ 9, అన్నాడీఎంకే 2, ఇతరులు 2 సీట్లు దక్కించుకునే అవకాశముందని సీఓటర్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్-డీఎంకే 15-21, ఏఐఎన్ఆర్సీ 8-12, అన్నాడీఎంకే 1-4 సీట్లు దక్కించుకోనున్నాయని ఇండియా టుడే సర్వే తెలిపింది. -
పుదుచ్చేరి పీఠం మళ్లీ రంగసామిదే!
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల్లో అధికార ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) మళ్లీ విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందు సర్వేలు చెప్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన ఎన్.రంగసామి 2011లో కాంగ్రెస్ను వీడి.. ఏఐఎన్ఆర్సీని స్థాపించారు. ఆ పార్టీ మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకుంది. పుదుచ్చేరిలో బలమైన సామాజిక వర్గం వన్నియార్లకు చెందిన రంగసామి.. రాబోయే ఎన్నికల్లోనూ గెలిచి అధికారం నిలబెట్టుకుంటారని పరిశీలకులు చెప్తున్నారు. ఏఐఎన్ఆర్సీతో పొత్తు చర్చలు ఫలించకపోవటంతో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. డీఎంకే - కాంగ్రెస్ ద్వయం కలిసి పోటీ చేస్తున్నాయి. డీఎంకే - కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశాలున్నాయనీ ఒక సర్వే అంచనా వేస్తోంది. అన్నా డీఎంకే కూడా ఒంటరిగానే పోటీ చేస్తోంది. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఆర్ఎస్పీలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పీఎఫ్డబ్ల్యూ) అధికారపక్షానికి గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని యానాం, కేరళలోని కరైకల్, తమిళనాడులోని మాహె ప్రాంతాలు కూడా పుదుచ్చేరిలో భాగం. యానాంలో మల్లాడి కృష్ణారావు 1996 నుంచి ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు. 1996, 2001 సంవత్సరాల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.


