breaking news
Akvaponiks Organic methods
-
చెరై.. ఆక్వాపోనిక్స్ గ్రామం!
కేరళలోని చెరై అనే తీరప్రాంత గ్రామం తొలి పూర్తి ఆక్వాపోనిక్ వ్యవసాయ గ్రామంగా మారిపోయింది. ఆ గ్రామంలోని ప్రతి ఇల్లూ సేంద్రియ కూరగాయలతోపాటు చేపలను కూడా ఆక్వాపోనిక్స్ పద్ధతుల్లో సాగు చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం కొద్ది మంది ప్రారంభించిన ఆక్వాపోనిక్స్ సాగు తామర తంపరగా గ్రామం మొత్తానికీ పాకింది. పల్లిపురం సర్వీసు కో–ఆపరేటివ్ బ్యాంక్ (పి.ఎస్.సి.బి.) చొరవ తీసుకొని రసాయనాల్లేని ఆహారాన్ని ఎవరికి వారు పండించుకోవడానికి ఆక్వాపోనిక్స్ యూనిట్లను ఏర్పాటు చేసుకోమని ప్రోత్సహించింది. తొలుత కొద్ది మందితో ప్రారంభమైంది. ఒకర్ని చూసి మరొకరు ఇప్పుడు దాదాపు ఆ చిన్న ఊళ్లో ఉన్న 200 పైచిలుకు కుటుంబాలన్నీ చేపలు, కూరగాయలను రసాయనాల్లేకుండా పండించుకొని తింటున్నారు. ఆక్వాపోనిక్స్ అంటే? ఆక్వాకల్చర్+హైడ్రోపోనిక్స్ కలిస్తే ఆక్వాపోనిక్స్ అవుతుంది. చెరువులు, మడుల్లో చేపల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. మట్టితో సంబంధం లేకుండా నీటిలో కరిగే మినరల్ సప్లిమెంట్లతో టబ్లు, బక్కెట్లలో కూరగాయలు / పండ్ల మొక్కలు పెంచడాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. చేపలు పెరుగుతున్న టబ్లో నుంచి నీటిని కూరగాయలు, పండ్ల మొక్కలు పెరిగే కుండీలు, మడుల్లోకి నిరంతరం చిన్న విద్యుత్తు పంపు ద్వారా రీసర్క్యులేట్ చేస్తూ ఉంటారు. తవుడు, నూనె తీసిన వేరుశనగ / కొబ్బరి తెలగపిండిని చేపలకు ఆహారంగా వేస్తారు. మిగిలినపోయిన మేత, చేపల విసర్జితాలలోని పోషకాలతో కూడిన నీరు కూరగాయలు / పండ్ల మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. గ్రోబాగ్స్, టబ్లు, కుండీల్లో రాతి చిప్స్ను పోసి వాటిలోనే కూరగాయలు, పండ్ల మొక్కలను నాటుతారు. ఈ టబ్లు, కుండీల పక్కనే ప్లాస్టిక్ షీట్లతో ఏర్పాటు చేసిన తొట్లలో చేపలు పెరుగుతూ ఉంటాయి. చేపల విసర్జితాలు మొక్కలకు ఆహారం అవుతుండగా.. మొక్కల వేళ్లు నీటిని శుద్ధి చేసి తిరిగి చేపలకు అందిస్తూ ఉండటం వల్ల పరస్పరాధారితంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. నీటి వృథా లేకుండా, రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపట్టునే చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పెంచుకోవడానికి ఆక్వాపోనిక్స్ యూనిట్లు చెరై గ్రామ ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఖర్చు ఏడాదిలో తిరిగొస్తుంది! ‘మొదట్లో చాన్నాళ్లు బ్రతిమిలాడినా చాలా మంది రైతులు రుణం ఇస్తామన్నా ఆక్వాపోనిక్స్ యూనిట్లను తీసుకోలేదు. కొద్ది మందే తీసుకున్నారు. ఏర్పాటు చేసుకోవడానికి మొదట ఖర్చు బాగానే ఉంటుంది. అయితే, ఏడాదిలోనే ఆ ఖర్చు చేపలు, కూరగాయల రూపంలో తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఒక్క గ్రామంలోనే 200 మందికిపై ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.’ అని కో–ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు సత్యన మయ్యత్తిల్ అన్నారు. తొలిగా ఆక్వాపోనిక్స్ యూనిట్ పెట్టుకున్న రైతు శశిధరన్ చాలా సంతృప్తిగా ఉన్నారు. ‘14,000 లీటర్ల నీరు పట్టే చేపల ట్యాంకులో 1,500కు పైగా చేప పిల్లలను వేశాను. వందకు పైగా గ్రోబాగ్స్లో కూరగాయలు పెంచుకుంటున్నా. చేపలు, కూరగాయలు మా ఇంటిల్లపాదికీ సరిపోను అందుతున్నాయి..’ అన్నారాయన. రైతులే కాక దిలీప్ వంటి వ్యాపారులు, మాజీ అటవీ శాఖాధికారి కిషోర్ కుమార్ వంటి విశ్రాంత ఉద్యోగులు కూడా ఇళ్ల దగ్గర ఆక్వాపోనిక్స్ యూనిట్లు పెట్టుకున్నారు. అందువల్లనే చెరై గ్రామం సంపూర్ణ ఆక్వాపోనిక్స్ గ్రామంగా మారింది. నీటిని నిమిషం ఆగకుండా పంప్ చేయాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో నిరంతరాయంగా నీటిని రీసర్క్యులేట్ చేయడానికి సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కిషోర్ కుమార్ మిగతా వారికన్నా ఒక అడుగు ముందుకేయడం విశేషం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ(ఎంపెడా) తోడ్పాటుతో పల్లిపురం సహకార బ్యాంకు తీసుకున్న చొరవే సేంద్రియ చేపలు, కూరగాయలను ఈ గ్రామస్తులందరూ పండించుకోగలుగుతున్నారు. ఏ విటమిన్ అధికంగా ఉండే ‘మోల’ / మెత్తళ్లు వంటి చిరు చేపలను ఈ పద్ధతుల్లో పెంచుకోవచ్చు. ఒక్కసారి పిల్లలను వేస్తే చాలు నిరంతరం తనంతట తానే సంతతిని పెంపొందించుకునే లక్షణం కలిగి ఉండటం ఈ చిరు చేపల ప్రత్యేకత. మనం కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయలేమా? ఇంటిపట్టునే చేపలు, కూరగాయలు పండించుకుంటున్న మహిళ -
మెట్ట పొలాల్లోనూ ఆక్వా సాగు!
ఇది ‘ఆక్వాపోనిక్స్’ చూపిన దారి సేంద్రియ పద్ధతుల్లో చేపలు, రొయ్యలతోపాటు పంటలూ పండించొచ్చు తెలంగాణలోనూ ఆక్వా సాగు సాధ్యమేనంటున్న రైతు శాస్త్రవేత్త! రొయ్యలు, చేపల పెంపకం కొత్తపుంతలు తొక్కుతోంది. విస్తారమైన చెరువుల్లో అధిక మొత్తంలో వనరుల ఖర్చుతో, రసాయనాల వాడకం ద్వారా ఆక్వా సాగు చేయడం ఇప్పుడు పాతపడుతోంది. అతితక్కువ విస్తీర్ణంలో, అతితక్కువ జలవనరులతోనే సేంద్రియ పద్ధతుల్లో రొయ్యలు, చేపలు పండించే సరికొత్త పద్ధతి అందుబాటులోకి వస్తోంది. అదే ‘ఆక్వాపోనిక్స్’ పద్ధతి. మెట్ట ప్రాంతాల్లోనూ ఏడాది పొడవునా చేపలు, రొయ్యలు సాగు చేసుకునే అత్యాధునిక పద్ధతి ఇది. నిత్య ప్రయోగశీలిగా పేరుగాంచిన ‘రైతు శాస్త్రవేత్త’ విశ్వనాథరాజు ఆక్వాపోనిక్స్ను తెలంగాణకు ప్రయోగాత్మకంగా పరిచయం చేస్తున్నారు. ఉద్యాన పంటల సాగులో సరికొత్త పద్ధతులకు గత కొన్నేళ్లుగా పెట్టింది పేరైన భూపతిరాజు రామ విశ్వనాథరాజు(46) ఇప్పుడు రొయ్యలు, చేపల సాగులో కొత్త ప్రయోగం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం గుండేడులో 15 ఎకరాల సొంత పొలంలో 14 ఏళ్లుగా ఆయన ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. కరువు కాలంలోనూ 2 బోర్లతో అతితక్కువ నీటిని వాడుకుంటూ ఏడాది పొడవునా పంటలు పండిస్తున్నారు. ప్రయోగశీలతే ఊపిరిగా ఉద్యాన పంటల సాగులో విలక్షణ పోకడలకు శ్రీకారం చుట్టి, చక్కని దిగుబడులు పొందుతున్న ఆయన ఆ ప్రాంత రైతులకు ప్రీతిపాత్రుడుగా మారారు. ప్రతి పంట కాలంలోనూ కొత్త పోకడలను అనుసరించకపోతే ఆయనకు నిద్రపట్టదు. ఆ పంట కాలంలో వచ్చిన అనుభవంతో సరికొత్త పోకడకు ఊపిరిపోయడం, ఈ క్రమంలో అదనపు ఖర్చులకూ వెనకాడకపోవడం ఆయనకెంతో ఇష్టమైన పనులు. ‘మదిలో వచ్చే ఆలోచనలను ఆచరణలో పెట్టుకుంటూ పోతుంటాను. రూ. పది వేలు నష్టమైనా, కష్టమైనా వెనుకాడను.. అందరూ నడిచే దారిలో నడవను..’ అంటుంటారు విశ్వనాథరాజు. ఇంతకాలం ఉద్యాన పంటల్లో చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే.. ఇప్పుడు చేస్తున్నది ఒకెత్తు. ఆక్వా సాగుకు పెట్టింది పేరైన ప.గో. జిల్లా (భీమవరం వద్ద) వేండ్రలో జన్మించిన విశ్వనాథరాజు అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే పాలమూరు జిల్లాలోనూ అతి తక్కువ నీటితో ఆక్వాపోనిక్స్ పద్ధతిలో ఆక్వా సాగును 3 నెలల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించడం విశేషం. ‘ఆక్వాపోనిక్స్’ అంటే..! విశ్వనాథరాజు తన పొలంలోనే 8 సెంట్ల స్థలంలో ‘నెట్హౌస్’, ‘రెయిన్ షెల్టర్’లను పక్కపక్కనే నిర్మించి రూ. 14 లక్షల ఖర్చుతో ఆక్వాపోనిక్స్ సాగు చేపట్టారు. పూర్తిగా సౌర విద్యుత్తునే వినియోగిస్తున్నారు. అతి తక్కువ నీటి ఖర్చుతో, అతి తక్కువ చోటులో అత్యధిక సాంద్రతలో చేపలు, రొయ్యలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం.. వీటి విసర్జితాలతో కూడిన నీటితో సేంద్రియ కూరగాయ పంటలు సాగు చేయడం ఆక్వాపోనిక్స్ ప్రత్యేకత. చెరువుల నుంచి వ్యర్థ జలాలను బయటకు వదిలేయకుండా పునర్వినియోగించడం వల్ల అతి తక్కువ నీటితోనే ఆక్వా సాగు సాధ్యమవుతోంది. విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ పద్ధతి మనకు కొత్త. ఏటా 5 టన్నుల చేపలు, 2 టన్నుల రొయ్యలు 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని చెరువులో 4 వేల ‘గిఫ్ట్ తిలాపియా’ చేపలు సాగవుతున్నాయి. 3 నెలల్లో 100-120 గ్రాముల బరువు పెరిగాయి. మరో 3 నెలల్లో 600 గ్రాముల సైజుకు పెరుగుతాయని, సుమారు 25 టన్నుల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ఏడాదికి రెండు పంటల్లో 5 టన్నుల దిగుబడి పొందొచ్చు. 30 చదరపు మీటర్ల చెరువులో 10 వేల స్కాంపీ రొయ్యలు సాగవుతున్నాయి. 2 నెలల్లో 2-50 గ్రాముల సైజుకు పెరిగాయి. 3 నెలల్లో టన్ను దిగుబడి రావచ్చని అంచనా. ఏడాదికి రెండు పంటల్లో 2 టన్నుల రొయ్యల దిగుబడి పొందొచ్చని విశ్వనాథరాజు ఆశిస్తున్నారు. రొయ్యలకు పూర్తిగా బలపాల(పెల్లెట్స్) మేత వాడుతుండగా, చేపలకు 60% అజొల్లా, 40% పెల్లెట్స్ మేత వాడుతున్నారు. చలి తగ్గిన తర్వాత పెరుగుదల వేగవంతమవుతుందని ఆయన అన్నారు. తిలాపియా చేపలు - స్కాంపీ రొయ్యలు + సేంద్రియ పంటలు! నెట్హౌస్లోని ఒక చెరువులో గిఫ్ట్ తిలాపియా చేపలు, మరో చెరువులో మంచినీటి (స్కాంపీ)రొయ్యలను పెంచుతున్నారు. నెట్హౌస్ పక్కనే నిర్మించిన ‘రెయిన్ షెల్టర్’లో టమాటా, పుదీన, కొత్తిమీర, క్యాబేజి తదితర పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. రెయిన్ షెల్టర్లో మట్టి లేకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మడుల్లో పంట మొక్కలు నాటుతారు. వీటికి రొయ్యలు, చేపల చెరువుల్లో నుంచి నీటిని మోటార్లు నిరంతరం అందిస్తుంటాయి. ఇందుకోసం ప్రత్యేక పైపులైన్లను ఏర్పాటు చేశారు. చిన్న చిన్న రాళ్ల ముక్కలను పేర్చి అందులో మొక్కలు నాటుతారు. కొన్ని బెడ్లపై ధర్మాకోల్ షీట్లపైన బెజ్జాల్లో ప్రొట్రేలను ఉంచి వాటిల్లో కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. చేపలు, రొయ్యల విసర్జితాలతో కూడిన నీటి నుంచి పోషకాలను గ్రహించి పంట మొక్కలు పెరుగుతాయి. బయో ఫిల్టర్ల వల్ల నీటిలోని అమ్మోనియా నైట్రైట్లుగా మారి మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. చెరువుల్లో రసాయనాలేమీ వాడటం లేదు కాబట్టి పంటలు పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పెరుగుతున్నట్లే. కాబట్టి, రైతులతోపాటు వినియోగదారులకూ ప్రయోజనకరమే. సంతోషంగా వ్యవసాయం చేయాలనుకునే వారెవరైనా తన పొలంలో (వారం నుంచి నెల వరకు)ఉండి.. కలిసి పనిచేస్తూ ఉచితంగా శిక్షణ పొందొచ్చని, శిక్షణ పొందేవారికి ఉచిత వసతి కల్పిస్తానని విశ్వనాథరాజు తెలిపారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: పోల్కంపల్లి గాండ్ల నాగరాజు అతి తక్కువ నీటితోనే ఆక్వాపోనిక్స్ సాగు! పాలమూరు వంటి కరువు జిల్లాలో అతితక్కువ నీటితో ఆక్వాపోనిక్స్ సాగుపై చిరు ప్రయత్నం చేస్తున్నా. ఎకరంలో చేపల చెరువును నింపడానికి కోటి లీటర్ల నీరు అవసరం. అందులో 3 వేల చేపలు పెంచొచ్చు. అదనంగా రోజూ 50 వేల లీటర్ల నీరు అవసరం. ఆక్వాపోనిక్స్లో 50 వేల లీటర్ల నీటిలో చిన్న చెరువులోనే 6 వేల చేపలు పెంచొచ్చు. అదనంగా రోజూ వెయ్యి లీటర్ల నీరు చాలు. నా ప్రయోగం రైతుకు లాభదాయకమా కాదా అనేది ఏప్రిల్ నాటికి తేలుతుంది. - భూపతిరాజు రామ విశ్వనాథరాజు (94404 57221), గుండేడ్, షాద్నగర్ మండలం, మహబూబ్నగర్ జిల్లా