breaking news
Airasia X
-
విమాన ఛార్జీలు తగ్గించిన ఎయిర్ ఏషియా ఎక్స్
మలేషియాకు చెందిన తక్కువ ఖర్చుతో విమాన సర్వీసులు అందించే ఎయిర్ఏషియా ఎక్స్ (AirAsia X) ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. జెట్ ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో జూన్ 15 నుంచి విమాన టికెట్ ఛార్జీలను సుమారు 5 శాతం మేర తగ్గించినట్లు సంస్థ సీఈఓ బో లింగం వెల్లడించారు. ఇంధన ధరల మార్పులను ప్రతి వారం సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా ఛార్జీలను సవరించనున్నట్లు ఆయన తెలిపారు.గత కొద్ది నెలలుగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా–ఇరాన్ ఘర్షణల ప్రభావంతో జెట్ ఇంధన ధరలు భారీగా పెరిగి విమానయాన రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఎయిర్ఏషియా ఎక్స్ కొన్ని మార్గాల్లో సర్వీసులను తగ్గించడంతో పాటు ఇంధన సర్చార్జీలు విధించి, టికెట్ ధరలను కూడా పెంచాల్సి వచ్చింది. ఏప్రిల్లో కొన్ని రూట్లలో ఛార్జీలు 30–40 శాతం వరకు పెరిగినట్లు సంస్థ ప్రకటించింది.అయితే ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో జెట్ ఇంధన ధరలు గణనీయంగా తగ్గాయి. మార్చి చివర్లో బ్యారెల్కు 242 డాలర్ల వరకు ఎగిసిన సింగపూర్ జెట్ ఫ్యూయల్ ధర ప్రస్తుతం సుమారు 112 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ పరిణామం విమానయాన సంస్థలకు కొంత ఊరటనిచ్చిందని బో లింగం పేర్కొన్నారు.ఇంధన వ్యయాల పెరుగుదల కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఎయిర్ఏషియా ఎక్స్ నష్టాలను నమోదు చేసింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని నష్టదాయక మార్గాలను నిలిపివేయడం, విమానాల వినియోగాన్ని తగ్గించడం, సరఫరాదారులు, లీజింగ్ భాగస్వాములతో ఒప్పందాలను పునఃసమీక్షించడం వంటి చర్యలు చేపట్టింది.సామర్థ్య పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్న సంస్థ ఆగస్టు నాటికి కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పాత విమానాలను దశలవారీగా విరమించి, ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉన్న కొత్త ఎయిర్బస్ A321LR విమానాలను వచ్చే ఏడాది నుంచి సేవల్లోకి తీసుకురానుంది. 2027 చివరి నాటికి తొలి ఎయిర్బస్ A220 జెట్లను అందుకోవాలని కూడా సంస్థ భావిస్తోంది. -
గాల్లో వాషింగ్ మెషిన్లా వణికిన విమానం
పెర్త్: ఆస్ట్రేలియా నుంచి కౌలాలంపూర్ వెళుతున్న విమాన ప్రయాణీకుల గుండెలు జారిపోయాయి. విమానం ఎడమ రెక్క చివర్లో నిప్పంటుకుని మండిపోతుండటంతో ఇక తామాంతా చనిపోయినట్లే అనుకుని వణికిపోతూ తమ ప్రాణాలు గుప్పిటపట్టుకున్నారు. దాదాపు 90నిమిషాలపాటు తమ ఊపిరిని బిగబట్టుకున్నారు. ఆ సమయంలో వాషింగ్మెషిన్ ఎలా వైబ్రేట్ అవుతుందో అంతకంటే తీవ్ర స్థాయిలో విమానం వణికిపోయింది. దడ దడమంటూ పెద్ద శబ్దాలు చేస్తూ కూలిపోతుందేమో అన్నంత ఉత్కంఠకు గురి చేసింది. చివరకు ఆ విమానాన్ని తిరిగి ఆస్ట్రేలియాకు తిప్పి పైలట్ దించేయడంతో ప్రయాణీకులంతా ఊపిరిపీల్చుకున్నారు. సురక్షితంగా దింపిన పైలట్కు అంతా అభినందనలు తెలిపి కొంతమంది ఆలింగనాలతో, షేక్ హ్యాండ్లతో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఎయిర్ఏసియా ఎక్స్ అనే ప్యాసింజర్ విమానం ఒకటి ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి కౌలాలంపూర్కు బయల్దేరింది. అది గాల్లో ఉండగానే అనూహ్యంగా క్యాబిన్లో నుంచి ఒక రకమైన వాసన రాగా.. విమానం కిటికీలో నుంచి చూడగా రెక్కకు కొన భాగంలో మంట కనిపించింది. అంతలోనే విమానం మొత్తం భారీ మొత్తంగా ఊగిపోవడం మొదలైంది. దీంతో అంతా భయంభయంగా అరవడంతోపాటు ఒకరినొకరు గట్టిగా పట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం కొందరైతే సెల్ఫీలకు ట్రైచేయడం, ఇంకొంతమంది తమ ఇష్టమైన దైవాలను ప్రార్థించడం మొదలుపెట్టారు. అయితే, చివరకు ఎలాంటి హానీ జరగకుండా పైలట్ దానిని దింపేశాడు. విమానం వచ్చే సమయానికే ఎయిర్పోర్ట్లో ప్రత్యేక పోలీసులంతా కూడా ఫైరింజన్లు, వాటర్ కెనాన్లతో సిద్ధంగా ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు ఎయిర్ ఏషియా తెలిపింది. -
ఎయిర్ ఏషియా బిగ్ సేల్
హైదరాబాద్: విమాన టికెట్లకు సంబంధించి ఎయిర్ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్... భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.తమ బిగ్సేల్లో భాగంగా పుణే, గోవా, కోచి, గౌహతి, వైజాగ్ వంటి దేశీయ రూట్లలో విమాన టికెట్లు రూ.990 (అన్ని చార్జీలు కలుపుకొని)నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీగ్ట్రాండ్ టెక్ పేర్కొన్నారు. అలాగే బ్యాంకాక్, కౌలాలంపూర్, వంటి అంతర్జాతీయ నగరాలకు తమ గ్రూప్ విమానాల ద్వారా జరిపే విమాన ప్రయాణాలకు చార్జీలను రూ.3,699కు ఆఫర్ చేస్తున్నామని వివరించారు. ఈ నెల 29 వరకూ ఎయిర్ఏషియాడాటకామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ కాలం వచ్చే ఏడాది మే 1 నుంచి 2017 ఫిబ్రవరి 5 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్కు డెరైక్ట్ విమాన సర్వీస్ను ఎయిర్ ఏషియా ఎక్స్ నుంచి అందిస్తున్నామని వివరించారు.


