Air traffic controller
-
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె.. మరో కోణం
విమానయాన రంగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఒక దేశ గగనతలంలో ప్రయాణించే ప్రతి విమానాన్నీ సమన్వయం చేయడం వారి బాధ్యత. ఒక్క చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదిగా గుర్తించాలి. అయినా విమానయాన సంస్థలు వీరికి తగిన వేతనాలు, పని గంటల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని అనేక ఉద్యమాలు వచ్చాయి. అందులో 2026 మార్చి 7న ఇటలీ రాజధాని రోమ్లో 1,500 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నిర్వహించిన సమ్మె ఒకటి. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ సమ్మె ఇటలీ విమానయాన వ్యవస్థపై గణనీయమైన ప్రభావం కలిగించింది. ముఖ్యంగా రోమ్లోని ‘ఫ్యూమిచినో’ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ఈ సమ్మెతో స్తంభించాయి.ఇటలీ గగనతలం యూరప్లో ప్రధాన మార్గాలలో ఒకటి. యూరప్ నుండి ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా వైపు వెళ్లే అనేక విమానాలు ఇటలీ గగనతలాన్ని దాటుతాయి. అందువల్ల రోమ్లో జరిగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమ్మె కేవలం స్థానిక సమస్యగా కాకుండా అంతర్జాతీయ విమాన రవాణాపై కూడా ప్రభావం చూపే అంశంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఉద్యోగులు తమ పని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు దిగడం ప్రాధాన్యత సంతరించుకున్నది.గత దశాబ్దంలో ప్రపంచ విమానయాన రంగం వేగంగా విస్తరించింది. అంతర్జాతీయ పర్యాటకం, వ్యాపార ప్రయాణాలు పెరగడంతో విమానాల సంఖ్య కూడా పెరిగింది. అయితే ఈ పెరుగుదలతో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంఖ్య తగినంతగా పెరగలేదని యూనియన్లు పేర్కొంటున్నాయి. దీంతో ఒక్కో కంట్రోలర్పై పని ఒత్తిడి పెరిగింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రంగంలో శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఇటలీలో కొన్ని కంట్రోల్ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల్లో కొత్త నియామకాలు లేవు. ఈ సిబ్బంది కొరత కారణంగా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు అదనపు షిఫ్టులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!మరోపక్క ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు తగినంతగా పెరగడం లేదు. ఈ సమ్మెను యూరప్లో పెరుగుతున్న కార్మిక ఉద్యమాలలో భాగంగా చూడాలి. 2025 చివరి నుండి 2026 ప్రారంభం వరకు యూరప్లో రైల్వేలు, విమానయాన, ప్రజా రవాణా వంటి రంగాలలో కార్మిక అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో ఇదే సమయంలో రవాణా కార్మిక సమ్మెలు జరగడం గమనార్హం. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు పెరగడం వంటి అంశాలు ఈ ఉద్యమాలకు కారణమయ్యాయి.– యాటల సోమన్నసీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు -
ఈ ఒక్క ఫొటో చాలు.. ఉక్రెయిన్ పరిస్థితిని చెప్పడానికి!
Russia And Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రష్యా బలగాలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. ప్రాణాలు అరచేత పట్టుకున్న ప్రజలు ఆగమవుతున్నారు. మీడియా, సోషల్ మీడియా అక్కడి పరిస్థితుల్ని, యుద్ధ తీవ్రతను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఒక్క ఫొటో అక్కడి తీవ్రతకు తార్కాణంగా నిలిచింది. ఉక్రెయిన్ సరిహద్దు ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి పలు దేశాలు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ.. యుద్ధాన్ని మాత్రం ఊహించలేదు. ఈ తరుణంలో తమ పౌరుల తరలింపులో జాప్యం జరిగింది. ఇక గురువారం రష్యా మిలిటరీ చర్యతో ఉక్రెయిన్ వణికిపోయింది. ఈ క్రమంలో రాజధాని కీవ్ విమానాశ్రయం మూసేయగా.. అటుగా వెళ్లిన వందలాది విమానాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా ఉక్రెయిన్లో నిత్యం రద్దీగా ఉండే ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుంచి ఎయిర్లైన్ ట్రాఫిక్ను భద్రతా కారణాల దృష్ట్యా హఠాత్తుగా దారి మళ్లించారు. దీంతో గగనతలంలో ఒక్కసారిగా కుప్పపోసినట్లు విమానాలు కనిపించాయి. విమానాలు దారి మళ్లించిన పలు చిత్రాలను ‘ఫ్లైట్ ట్రాకర్ సాఫ్ట్వేర్’ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
హచ్ డాగ్లా వెంటే.. వెన్నంటే..
2014, మార్చి 8.. 239 మంది ప్రయాణికులతో బయల్దేరిన మలేసియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 అంతుచిక్కని రీతిలో మాయమైంది... అన్ని రకాల టెక్నాలజీలను వాడి వెతికారు.. ఇదిగో తోక..అదిగో రెక్క అన్నారు.. మూడేళ్లకుపైగా వెతికారు..చివరికి ఎక్కడుందో కనుక్కోలేక చేతులెత్తేశారు.. విమానం ఎక్కడో కూలి ఉంటుందని..అందరూ చనిపోయిఉంటారని చెబుతూ కేస్ క్లోజ్ చేశారు.. ఇంతకీ అదెక్కడ కూలింది.. ఆ విమానానికి ఏమైంది అని అడిగితే ఏమో.. ఎవరిని అడిగినా ఇదే జవాబు.. అయితే, ఇకపై అలా ఉండదు..ఈ భూప్రపంచం మొత్తమ్మీద ఏ విమానం ఎటు వెళ్లినా.. ఎటు కదిలినా..అనుక్షణం పర్యవేక్షించే కొత్త వ్యవస్థ వచ్చేస్తోంది..విమానం తప్పిపోయినా.. దారి మళ్లినా..క్షణాల్లో గుర్తించి, అప్రమత్తం చేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తోంది.. అదే ఇరిడియం నెక్ట్స్.. ఇరిడియం నెక్ట్స్.. ఇందులో భాగంగా మొత్తం 75 ఉపగ్రహాలను మోహరిస్తున్నారు. తాజాగా ఇందులోని చివరి 10 ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ మొత్తం ఉపగ్రహాల వ్యవస్థ భూమి చుట్టూ ఓ సాలిగూడులా ఏర్పడి.. విమానాల రాకపోకలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి. దీని వల్ల తొలిసారిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు ప్రపంచంలోని ఏ విమానం ఎక్కడుందన్న విషయం క్షణాల్లో తెలుస్తుందని అమెరికాకు చెందిన ఇరిడియం సంస్థ తెలిపింది. 2020 సరికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ ఇలా.. ఇప్పటివరకూ విమానం రాకపోకలను రాడార్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గ్రౌండ్ సిస్టం ద్వారా ట్రాక్ చేస్తున్నారు. విమానం కాక్పిట్లో ఉండే బ్లాక్ బాక్స్ ద్వారా ప్రతి 10 నుంచి 15 నిమిషాలకొకసారి ఈ సిగ్నల్ అందుతుంది. ఎంహెచ్ 370 విషయానికొస్తే.. ఆ బ్లాక్ బాక్స్ అన్నది దొరకనే లేదు. దీని వల్ల అసలేం జరిగిందన్నది తెలియరాలేదు. అసలు.. ఆ 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఆ విమానం ఎక్కడుంది అన్న విషయాన్ని ట్రాక్ చేసే వ్యవస్థ ప్రస్తుతానికి లేదు. ఇరిడియం నెక్ట్స్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే.. ఉపగ్రహాలు అన్ని విమానాలను కనిపెట్టుకుని ఉంటాయి. తేడా వస్తే. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారమందిస్తాయి. అంటే.. ఇక భవిష్యత్తులో ఎంహెచ్ 370లాంటి మిస్టరీలకు చోటు లేదన్నమాట.. ప్రమాదం జరిగినా.. ఎక్కడ జరిగిందన్న విషయం క్షణాల్లో తెలిసిపోతుంది కనుక.. సహాయక చర్యలను వెంటనే చేపట్టడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ఇరిడియం.. ఇరగదీసే ఐడియా కదూ.. – సాక్షి సెంట్రల్ డెస్క్.. -
ఒక్కడు... పది జాబ్స్
ఓ వ్యక్తి... 10 ఉద్యోగాలకు సంబంధించిన విధులు నిర్వర్తించడం సాధ్యమేనా? ఎందుకు కాదు... అంటూ చేసి చూపెడుతున్నాడు 67 ఏళ్ల బిల్లీ మూయిర్. స్కాట్లాండ్లో మారుమూల ద్వీపం... నార్త్ రొనాల్డ్సేలో మూయిర్ నివసిస్తున్నాడు. ఈ బుల్లి ద్వీపంలో ఆయన ఏకంగా పది ఉద్యోగాలు అవలీలగా చేసేస్తున్నాడు. అవేమిటంటారా... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్పోర్ట్ అగ్నిమాపక దళ సభ్యుడు, ట్యాక్సీ డ్రైవర్, లైట్హౌస్ నిర్వాహకుడు, హాలీడే రిసార్ట్స్ యజమాని, స్థానిక కౌన్సిలర్, బిల్డర్... ఇలా మొత్తం పది ఉద్యోగాలను ఏకకాలంలో చేసేస్తున్నాడు. లైట్ హౌస్ పూర్తిగా ఆటోమేటెడ్... అప్పుడప్పుడు వెళ్లి తనిఖీ చేయడం, అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవడం మూయిర్ విధి. అలాగే ఈ దీవికి ఎప్పుడైనా విమానాలు వస్తుంటే... మూయిర్కు ముందే మొబైల్కు సమాచారం వస్తుందట. అప్పుడు ఎయిర్స్ట్రిప్ వద్దకు వెళ్లి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అవతారం ఎత్తుతాడు. దీవిలో అగ్నిమాపక దళంలోని ఏకైక సిబ్బంది కూడా ఇతనే. అగ్ని ప్రమాదాలను నియంత్రించడంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడు. ఇన్ని చేస్తూనే ఖాళీ సమయాల్లో తన గొర్రెలను మేపడానికి వెళతాడు. ఒక్కడే ఇవన్నీ చేయడం ఎందుకంటే... ఈ దీవి జనాభా 50 మంది మాత్రమే. దాంతో మనోడు సాధ్యమైనన్ని పనులు తానే చక్కబెడుతుంటాడు. 67 ఏళ్లు వచ్చినా... ఇప్పుడప్పుడే రిటైరయ్యే ఆలోచనేమీ లేదని హుషారుగా చెబుతాడు. దటీజ్ స్పిరిట్.


