breaking news
Adivasi Villages
-
ప్రతిభకు మారు పేరు ఆ ఊరు
అది ఆదివాసీ గ్రామం. ఆ ఊరికి సర్పంచ్ ఓ మహిళ. అక్కడ రాజకీయాల్లేవు. ఉన్నదంతా జనంలో ఐకమత్యమే. ఊరిలో అవినీతికి తావు లేదు. అభివృద్ధికి చిరునామాగా మారింది. ఊరంతా సస్యశ్యామలంగా ఉంది. జీవవైవిధ్యతకు ప్రతీకగా నిలిచింది. సర్పంచ్ ప్రతిభకు మారుపేరయింది. తెలంగాణ, కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మార్లవాయి గ్రామం. ఆ గ్రామ సర్పంచ్ ప్రతిభ మంగళవారం నాడు (మే, 23వ తేదీ) ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ డే సందర్భంగా ‘తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ’ అవార్డు అందుకున్నారు కనక ప్రతిభ. తన ప్రతిభతో గ్రామాన్ని నందనవనంగా మార్చిన ఆమె సాక్షితో పంచుకున్న విశేషాలివి. ‘‘మహిళా రిజర్వేషన్లో భాగంగా మా పంచాయితీని మహిళలకు కేటాయించారు. చదువుకున్న వాళ్లయితే బాగుంటుందని మా ఊరి వాళ్లందరూ 2019లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగని నేను ఎక్కువేమీ చదువుకోలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా పెళ్లయింది. ఊరిని బాగు చేయాలనే సంకల్పం ఉంటే ఈ చదువైనా చాలు. మా ఊరి జనాభా 708, మొత్తం కుటుంబాలు 130. ప్రాథమిక పాఠశాల, ఆశ్రమ పాఠశాల కూడా ఉంది. ఇక అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ భవనం ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 26 మంది మహిళలకు చేతన ఫౌండేషన్ ద్వారా టైలరింగ్లో శిక్షణ ఇప్పించి, ఎస్బీఐ– ఆర్ఎస్ఈటీ సహకారంతో కుట్టు మిషన్లు ఇప్పించాను. వాళ్లకు చేతిలో పని ఉండడానికి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే ఏర్పాటు చేశాం. డ్వాక్రా గ్రూపులు పదకొండున్నాయి. డ్వాక్రా డబ్బుతో కొంతమంది కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. వీథి వీథీ తెలుసు! మా ఊరిలో ప్రతి వీథీ, ప్రతి కుటుంబమూ తెలుసు. బడి వయసు పిల్లలందరినీ బడికి పంపించాలని ఇంటింటికీ వెళ్లి చెబుతుంటాను. అలాగే పదేళ్లలోపు ఆడపిల్లలందరికీ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరిపించాను. పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వ సహకారం బాగుంది. వీథులన్నీ సిమెంట్ రోడ్లు వచ్చాయి. అన్ని ఇళ్లకూ టాయిలెట్లున్నాయి. కిరోసిన్ దీపం వెలిగించాల్సిన అవసరం లేదు, అన్ని ఇళ్లకూ కరెంట్ ఉంది. వందకు పైగా ఇళ్లలో దీపం పథకం గ్యాస్ సిలిండర్లున్నాయి. చదువుకున్న వాళ్ల కోసం చిన్నపాటి వీథి గ్రంథాలయం కూడా పెట్టాం. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటాం. గ్రామంలో ఏ మూలకెళ్లినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. మంచినీటి సౌకర్యం, పరిశుభ్రతలో భాగంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీ శుభ్రం చేయించడం, ప్లాస్టిక్ వాడకంలో విచక్షణ, తడిచెత్త– పొడి చెత్త పట్ల అవగాహన వంటివన్నీ జీవవైవిధ్య పురస్కారం ఎంపికకు ప్రమాణాలయ్యాయి. అందరూ ఇంటిపన్ను కడతారు మా ఊరిలో అంతా క్రమశిక్షణతో నడుచుకుంటారు. అందరూ ఇంటి పన్ను కడతారు. అంతకుముందెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. ఎక్కువమందికి మంచి ఇళ్లున్నాయి. కొంతమంది పెంకుటిళ్లలో ఉంటే, ఇప్పటికీ కొంతమంది మట్టికప్పు ఇళ్లలోనే ఉన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం రాలేదు. మా ఊరి వాళ్ల గొప్పమనసు ఏమిటంటే... ఊరి బాగు కోసం ఏ పని చేపట్టినా అంతా కలసి వస్తారు. అందరూ ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. జీవవైవిధ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో సంతోషంగా ముందుకు వస్తారు. వీథులకు రెండువైపులా రకరకాల మొక్కలు నాటాం. గిరి వికాస్ పథకం ద్వారా వ్యవసాయానికి 30 బావులు తవ్వించాం. అంతకు ముందు ఇరవై బావులుండేవి. ఊరిలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్కరికి పదెకరాలకు తక్కువ లేకుండా భూమి ఉంది. అసలే భూమి లేని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు ఉపాధి హామీ పనుల కార్డు ఉంది. పొలాలకు గట్లు, చెరువు పూడిక తీయడం, పొలాల్లోకి వెళ్లడానికి మట్టిరోడ్లు వేయడం వంటి పనులు ఉపాధి హామీలో చేయిస్తాం. ఆకలి, పేదరికం మా ఊరి పొలిమేరలకు కూడా రావు. వ్యవసాయంతోపాటు ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు పెంచుకుంటారు. ప్రతి ఒక్కరూ పని చేస్తారు. సంతోషంగా జీవిస్తారు. ► ఉత్తమ గ్రామ పంచాయితీ 2021 అక్టోబర్ ► ఉత్తమ మహిళా సర్పంచ్ 2021 మార్చి 8 ► జాతీయ స్థాయిలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో ఉత్తమ గ్రామ పంచాయితీ ► పేదరికరహిత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానం ► బెస్ట్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అవార్డు 2023 మా ఊరికి సర్పంచ్గా నేను తొలి మహిళను. మహిళ అయిన కారణంగా నన్ను తక్కువ చేసి చూడడం మా దగ్గర ఉండదు. అంతా అభిమానంగా ఉంటారు. ఊరందరూ ఒక మాట మీద ఉంటారు కాబట్టి నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను’’ అని గ్రామ తొలి మహిళగా తన అనుభవాలను వివరించారు ప్రతిభ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పులిని ప్రేమిస్తారు.. ఆదివాసులను తరిమేస్తారు..!
గిరిజనుల ఇంటిలో మనువు, పురుడు,పుణ్యం, కార్యం ఏదైనా తొలిబొట్టు పెట్టి పిలుచుకునేది బావనే. పులికి ఆదివాసులకి ఇదే బంధుత్వం. ఫారెస్టు అధికారులతో సహా నాగరికులు అంతా పులిని క్రూర మృగంగా చూస్తే.. ఆదివాసులు మాత్రం పులిని ‘బావా’ అని సంబోధిస్తారు. గిరిజనులు బావకు ఇచ్చే మర్యాద పులికి ఇస్తారన్న మాట. ఆదివాసుల దైనందిన చేతల్లోనూ ఇదే కనిపిస్తుంది. తమ నివాసాల పరిధిలో సంచరించే పులి గుణం తెలుసుకొని మసులుకుంటారు. ఆడపులి, ముసలి బావ పులుల ఆవాసాల్లోకి దాదాపుగా ఆదివాసులు వేటకు వెళ్లరు. అవి తిని రేపటి కోసం దాచుకున్న జంతు మాంసపు భాగాలను తీసుకోరు. అది పులులకు ఆదివాసులకు మధ్య ఉన్న అనుబంధం. గిరిజనుల జీవన చర్యలు జంతుజాల జీవనచక్రంలో జోక్యం చేసుకోవు. ప్రకృతే వాళ్ల మధ్య ఆ విధమైన సర్దుబాటు చేసింది. ఇవేమీ పట్టకుండా అటవీ అధికారులు ఆగి, అదను చూసి ఆదివాసుల మీద పడుతున్నారు. అడవుల నుంచి వారిని తరిమేస్తున్నారు. ఆటవిక తెగలు, ఆధునిక ప్రపంచం రెండు వేర్వేరు సహజాతాలు. అడవిలో పుట్టి పెరిగారు. జంగల్ వాళ్లది. జల్, జమీన్ వాళ్లది. అటవీ సరిహద్దులు అనేవి రాష్ట్రాలకు, పాలకులకే గానీ, ఈ విభజన రేఖలు ఆదివాసులకు ఏమి తెలుసు. గ్లోబలైజేషన్ మీదపడి అడవిని విధ్వంసం చేస్తుంటే...మనుగడ కోసం గిరిజనం తావు దొరికిన చోటికి వెళ్లిపోతోంది. అది వారికి ప్రకృతే చూపించిన మార్గం. వెంటపడి తరుముతున్న ప్రపంచీకరణ విధ్వంసాన్ని నిలవరించి ఆదివాసులకు, ఆధునిక ప్రపంచానికి మధ్య ఉన్న అంతరాన్ని అధ్యయనం చేసి అపురూప మానవ జాతులను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా మూలవాసు లను నిలవరించాలనుకోవటం దుర్మార్గం. పర్యావరణ సమతూకానికి, అటవీ ఆవరణ వ్యవస్థ మనుగడకు పులుల సంరక్షణ అవసరమే. పులి పెరిగిన చోట తప్పనిసరిగా జంతు జీవజాల సమతుల్యత ఉంటుంది. పులులు సహజంగా పుట్టి పెరిగే చోట అభయారణ్యాలను అభివృద్ధి చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఫారెస్టు అధికారులు పదేపదే గిరిజన గూడేల మీద దాడులకు తెగబడు తున్న కవ్వాల్ పులుల అభయారణ్యం వాస్తవంగా పులుల శాశ్వత ఆవాసానికి అస్సలు అనుకూలం కాదు అనే వాదనలు చాలాకాలంగా వినవస్తున్నప్ప టికీ.. గడిచిన ఐదేళ్ల నుంచి అటవీ శాఖ ఈ అభయా రణ్యం నిర్వహణకు రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఇదిగో పులి, అదిగో పులి అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో శాశ్వత ఆవాసం కలిగిన ఒక్క పులిని కూడా అటవీ అధికా రులు చూపెట్టలేకపోయారు. ఎండాకాలంలో మహా రాష్ట్రలోని తాడోభా అడవుల నుంచి వలస వచ్చి పోయే పులులను సీసీ కెమెరాల్లో బంధించి ఇదే మన పులి అని చెప్పుకుంటున్నారు. ఈ వైఫల్యం నుంచి తప్పించుకోవటానికే అటవీ అధికారులు అన్యా యంగా ఆదివాసుల మీద పడుతున్నారు. అభయార ణ్యంలో మనుషులు సంచారం చేస్తున్నందువల్లే పులులు రావటం లేదనే శాస్త్రీయత ఏమాత్రం లేని వాదనను ముందుపెడుతున్నారు. నాగరిక మను షుల సంచారం, అటవిలో ఆదివాసుల జీవనం... రెండింటినీ ఒకే గాటున ముడిపెట్టి చూపిస్తున్నారు. ఆదివాసీ సంస్కృతి, జీవన విధానం విభిన్న మైనది. ఆటవిక సమాజంలో బావతోనే బంధుత్వం ఎక్కువ. గిరిజనుల ఇంటిలో మనువు, పురుడు, పుణ్యం, కార్యం ఏదైనా తొలిబొట్టు పెట్టి పిలుచుకు నేది బావనే. పులికి ఆదివాసులది ఇదే బంధుత్వం. నాగరికులు అంతా (ఫారెస్టు అధికారులతో కలిపి) పులిని క్రూర మృగంగా చూస్తే.. ఆదివాసులు మాత్రం పులిని ‘బావా’ అని సంబోధిస్తారు. గిరిజ నులు బావకు ఇచ్చే మర్యాద పులికి ఇస్తారన్న మాట. ఆదివాసుల దైనందిన చేతల్లోనూ ఇదే కనిపిస్తుంది. తమ నివాసాల పరిధిలో సంచరించే పులి గుణం తెలుసుకొని మసులుకుంటారు. గాండ్రించే పులిని ‘కోపగొండి’ అని, మందకొడి చలనం ఉన్న పులిని ‘పెంటిది’, వయసు మళ్లిన పులిని ‘ముసలి బావ’ ఇలా సంబోధిస్తారు. పెంటిది, ముసలి బావ పులుల ఆవాసాల్లోకి దాదాపుగా ఆదివాసులు వేటకు వెళ్లరు. అవి తిని రేపటి కోసం దాచుకున్న జంతు మాంసపు భాగాలను తీసుకోరు. అది పులులకు ఆదివాసులకు మధ్య ఉన్న అవినాభావ అనుబంధం. వేసవి కాలం మినహా మిగిలిన రెండు కాలాల్లో (వర్షాకాలం, చలికాలం) ఐదు గంటలకే అడవిలో సూర్యాస్తమయం అవుతుంది. అదే సమయంలో వన్య జీవరాశులు తావుల్లోంచి బయటికి వస్తాయి. చీకటి పడటానికంటే ముందే గిరిజనులు గుడిసెకు చేరుకుంటారు. ఏడు గంటల వరకు వంటావార్పు, భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని నిద్రలోకి జారు కుంటారు. రాత్రంతా వన్యప్రాణులు ఆడవిలో స్వేచ్ఛా ఆహార ఆన్వేషణ చేస్తాయి. మళ్లీ సూర్యో దయం వేళకు గుహలు, పొదల్లోకి వెళ్లిపోతాయి. తిరిగి ఆదివాసుల దిన చర్య మొదలవుతుంది. అటవీ ఆవరణ వ్యవస్థలో గిరిజనుల జీవన చర్యలు ఎక్కడ కూడా జంతుజాల జీవనచక్రంలో జోక్యం చేసుకోవు. ప్రకృతే వాళ్ల మధ్య ఆ విధమైన సర్దుబాటు చేసింది. ఇవేమీ పట్టకుండా అటవీ అధికారులు ఆగి, అదను చూసి ఆదివాసుల మీద పడుతున్నారు. ఆదివాసుల సాంస్కృతిక మూలాల విధ్వంసంతో మొదలైన ఈ దాడి వాళ్ల జీవనాన్ని, జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. వాళ్ల కాలి కింది నేల, జీవితాన్నిచ్చిన ప్రకృతి ఇప్పుడు పరాయిది అయిపోయింది. ఆదివాసులు అంటేనే నిత్య అనుమానితులుగా, పూర్తి అభద్రత జాతిగా మార్చేశారు. గత ఏడాది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం జలగలంచ గూడెం మీద పోలీసులు, ఫారెస్టు అధికారులు విరుచుకుపడ్డారు. మహిళల చీరలు లాగి, పసిపిల్లలను చెట్లకు కట్టే శారు. పురుషులను వన్యప్రాణి కంటే ఘోరంగా వేటాడినట్టు వెంటపడి కొట్టారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫారెస్టు శాఖ తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది తిరగక ముందే తాజాగా కొమ్రం భీం జిల్లా కాగజ్నగర్ మండలం కోలాంగొంది గూడెంపై పాశవిక దాడులకు తెగ బడ్డారు. మనం మనుషులుగా పుట్టినందుకు సాటి మనుషుల పట్ల కనీసం చూపాల్సిన కనికరం లేకుండా వారిని బంధించి వేంపల్లి కలప డిపోలో కుక్కిన తీరు జుగుప్సాకరం. ‘2005 డిసెంబర్ 13 తరువాత తిరస్కరణకు గురైన దరఖాస్తుదా రులందరినీ అడవి నుంచి వెళ్లగొట్టాలని సుప్రీంకోర్టు తీర్పుకు’ లోబడే తాము ఆదివాసులను బయటికి పంపిస్తున్నామని సమర్ధించుకోవటానికి చూడటం నీతిమాలిన చర్య. సుప్రీంకోర్టు తీర్పు మీద పునఃస మీక్ష జరగాలనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం రక్షిత అడ వులైనా, రిజర్వు అడవులైనా అందులో నివసించే గిరిజనులకు హక్కులు కల్పించాలి. పోడు భూము లకు పట్టాలు ఇవ్వాల్సిందేనని గిరిజనులు పోరాటం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రికి గాని, స్థానిక కలెక్టర్కు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధికారికి కానీ ఏ మాత్రం సమాచారం లేకుండా ఫారెస్టు అధికారులు ఏకపక్ష నిర్ణయంతో, గిరిజన గూడాల మీద పడి దాడులు చేయటం చట్టాలను ఉల్లంఘించటమే. దీనికి అటవీ శాఖ ప్రధాన సంరక్ష ణాధికారి తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంది. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే సెల్ : 94403 80141 -
ఆదివాసీలపై పోలీసుల దాష్టీకం
ఖమ్మం జిల్లాలో 40 మంది అదుపులోకి.. చర్ల(ఖమ్మం), న్యూస్లైన్: ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఖమ్మం జిల్లాలో రెండు ఆదివాసీ గ్రామాలపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆడా మగా తేడా లేకుండా 40 మందికిపైగా ఆదివాసీలను అదుపులోకి తీసుకున్నారు. చర్ల మండలంలోని ఎర్రంపాడు, చెన్నాపురం గ్రామాలకు ఆదివారం తెల్లవారుజామున పోలీసులు పెద్దసంఖ్యలో చేరుకుని ఇళ్లల్లో నిద్రిస్తున్న వారిని లేపి తుపాకులతో భయపెట్టారు. తమ వెంట రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తమను చూసి పారిపోయేందుకు యత్నించిన పలువురిని పట్టుకుని పిడిగుద్దులు గుద్దినట్లు తెలుస్తోంది. ఎర్రంపాడుకు చెందిన తొమ్మిది మందిని, చెన్నాపురానికి చెందిన 35 మందిని అదుపులోకి తీసుకున్నారని, వీరిలో 10-15 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. ఎర్రంపాడుకు చెందిన ముగ్గురిని గీసరెల్లి వద్ద వదిలేశారని స్థానికులు చెప్పారు. మరికొందరిని చర్ల పోలీస్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని చర్ల ఎస్సై దోమల రమేశ్ చెప్పారు.