breaking news
Abubakar Siddiqa
-
ఆ ఇద్దరూ కరుడుగట్టిన ఉగ్రవాదులు
సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కొత్తపల్లెలో పోలీసులు అరెస్టు చేసిన అబూబకర్ సిద్దిఖ్ అలియాస్ అమానుల్లా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్లు కరుడుగట్టిన ఉగ్రవాదులని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. తమిళనాడుకు చెందిన వీరు టెక్నికల్గా నిపుణులని, పక్కాగా పథకం వేసి బాంబు పేలుళ్లకు పాల్పడడంలో సిద్ధహస్తులని పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిని జూన్ 30న తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.రాయచోటి పోలీసు పరేడ్ మైదానం వద్ద గురువారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో డీఐజీ కోయ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే...‘‘అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 20 ఏళ్లుగా రాయచోటిలో ఉంటున్నారు. తప్పుడు పేర్లతో గుర్తింపు కార్డులు పొందారు. అబూ బకర్ సిద్దిఖ్ తమిళనాడు నాగూరు, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మధురై తిరుమంగళం, వేలూరులో జరిగిన పలు ఘటనల్లో నిందితుడు. సామూహిక దాడులు, పేలుళ్లు, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడంపై అతడి మీద కేసులు నమోదయ్యాయి.⇒ మహమ్మద్ అలీపై చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్లో, పోలీసు కార్యాలయం వద్ద బాంబు పెట్టడంపై కేసులు నమోదయ్యాయి. ఈ చర్యకు పాల్పడిన రోజే.. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చిలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 1999లో కొచ్చి–కుర్లా ఎక్స్ప్రెస్లో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.⇒ 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లలో అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ ప్రమేయం ఉంది. అప్పుడు రాయచోటి నుంచే కార్యకలాపాలు సాగించారు. స్థానికంగా పేద కుటుంబాల మహిళలను వివాహమాడి చిరు వ్యాపారాలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పోలీసులు తమిళనాడు పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టి.. భారీ కుట్రను భగ్నం చేశాయి.అల్ ఉమ్మా సంస్థతో అనుబంధంఉగ్ర సంస్థ అల్ ఉమ్మాతో అబూబకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీకి అనుబంధం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఉగ్ర సంస్థ. ఐసిస్ తరహా భావజాలం కలిగినది. నిందితులు గతంలో విదేశాలకు వెళ్లి వచ్చారు. వీరి వద్ద దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్క్ల మ్యాప్లు దొరికాయి.రాయచోటి నుంచే పలు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు? ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు జరిపారు? సహాయ సహకారాలు అందించినవారెవరు? ప్రతి విషయం క్షుణ్ణంగా విచారిస్తున్నాం. పేలుడు సామగ్రి ఎలా వచ్చింది? బంధువులు, స్నేహితులు, ఇతర సంబంధాలు అన్ని అంశాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం. స్థానికంగా శిక్షణ ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు. అబూబకర్, మహమ్మద్ అలీలను తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారు. ఈ కేసుపై నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి.సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు..ఉగ్రవాదులు ఉంటున్న ఇళ్లను తనిఖీ చేయగా సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు, భారీఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తువులు లభించాయి. వీటితో కర్ణాటకలోని మల్లేశ్వరం లాంటి 30 బాంబు పేలుళ్లకు పాల్పడవచ్చు. దాదాపు 50 ఐఈడీలు తయారు చేయగల సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం.పోలీసులను అడ్డుకున్న నిందితుల భార్యలు సోదాలకు వెళ్లినప్పుడు అబూబకర్ భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీమ్లు మహిళా పోలీసులపై దాడికి యత్నించారు. పేలుడు పదార్థాల గురించి వీరికి తెలుసా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. మహిళలు ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. కోర్టు రిమాండ్ విధించడంతో కడప కేంద్ర కారాగారానికి తరలించాం.⇒ ఉగ్రవాదుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలతో పాటు నాలుగు సూట్కేస్ బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. భయం.. భయం..రాయచోటిలో ఉగ్రజాడ తెలిసినప్పటి నుంచి అందరిలో భయం నెలకొంది. ఉగ్రవాదులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా చిన్న సమాచారం కూడా వెలుగులోకి రాకపోవడాన్ని పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు, తమిళనాడు పోలీసుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. ఎస్పీ విద్యాసాగర్నాయుడు, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులను టీమ్లుగా విభజించారు. ఉగ్రవాదుల ఇంటి చుట్టుపక్కల వారిని ఇప్పటికే విచారించిన పోలీసులు.. బంధువులు, స్నేహితులపై దృష్టిసారించారు. రోజూ డీఎస్పీ కార్యాలయానికి పలువురిని తీసుకొచ్చి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలు, సెల్ఫోన్ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. -
సిద్ధిక్ ఆదేశాల మేరకే విధ్వంసాలు : ఫక్రుద్దీన్ వాంగ్మూలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: తీవ్రవాది అబూబకర్ సిద్ధిక్ అదేశాల మేరకే తాము రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడ్డామని పోలీస్ ఫక్రుద్దీన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. చెన్నైలో ఫక్రుద్దీన్, చిత్తూరు జిల్లాలో పన్నా ఇస్మాయిల్, బిలాల్ మాలిక్ అనే తీవ్రవాదులు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. వీరిలో ఫక్రుద్దీన్ను పోలీసులు బుధవారం విచారించారు. పోలీసులు అందించిన వివరాల మేరకు ఫక్రుద్దీన్ అల్-ఉమా తీవ్రవాద ముఠాకు సన్నిహితుడు. పోలీసులపై బాంబులు విసిరి ఇమాం ఆలీ అనే తీవ్రవాదిని విడిపించుకుని పోయిన తర్వాతనే తీవ్రవాదుల రికార్డుల్లోకెక్కాడు. దుబారుు, ఆప్ఘనిస్తాన్లో తీవ్రవాద శిక్షణ పొందిన అబూబకర్ సిద్ధిక్ ఆదేశాలతోనే అనేక మంది హిందూ నేతల హత్యలకు పాల్పడ్డాడు. మదురై తిరుమగంళంలో బీజేపీ అగ్రనేత అద్వానీని హతమార్చేందుకు కుట్ర, వేలూరులో అరవిందరెడ్డి, వెల్లయప్పన్, మదురైలో బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి రమేష్, పాల వ్యాపారి సురేష్ హత్యలు సిద్ధిక్ సూచనల మేరకే అమలు చేశారు. ఇదిలా ఉండగా ముగ్గురు తీవ్రవాదులు అరెస్ట్ కాగానే చెన్నై నుంచి పరారైన సిద్ధిక్ కోసం పోలీసులు అనేక ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఆంధ్రా సరిహద్దుల్లోని అడువులను సైతం జల్లెడ పడుతున్నారు. సెల్ఫోన్ వినియోగించకుండా సిద్ధిక్ జాగ్రత్తలు తీసుకోవడంతో అతని ఉనికి కష్టసాధ్యమైంది. తమిళనాడుకు చేరుకునే ముందు అతను 40 మందికి తీవ్రవాద శిక్షణ ఇచ్చినట్లు సమాచారం అందింది. ఇలా శిక్షణ పొందిన వారిలో కొందరు రాష్ట్రంలో సంచరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు పదోన్నతులు తీవ్రవాదులను పట్టుకోవడంలో సాహసం చేసిన 20 మంది పోలీసులను సీఎం జయలలిత అభినందించడంతో పాటు వారికి పదోన్నతులు కల్పించారు. పుత్తూరు ఆపరేషన్లో తీవ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి పోరూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్స్పెక్టర్ లక్ష్మణన్ను ఆమె నేరుగా వెళ్లి పరామర్శించారు. లక్ష్మణన్తో పాటు మరో ఇన్స్పెక్టర్ సెంథిల్కుమార్ తదితరులు పదోన్నతులు పొందిన వారిలో ఉన్నారు.