జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్, ఇందిర జలప్రభ పథకాల కింద పండ్ల తోటలు సాగు...
ఎవరు అర్హులు
జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్, ఇందిర జలప్రభ పథకాల కింద పండ్ల తోటలు సాగు చేయాలనుకునే వారికి ఉపాధిహమీ జాబ్కార్డు ఉండాలి.
పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండాలి.
మెట్ట భూముల్లో, నీటి వసతి గల బోర్ల వద్ద మొక్కలు పెట్టుకోవచ్చు.
ఉపాధిహమీ, ఉద్యానవన శాఖ నుంచి ఎలాం టి లబ్ధి పొందని వారు మాత్రమే అర్హులు.
తోటలు పెట్టే ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీపై, ఇతరలకు తొంభై శాతం రాయితీపై డ్రిప్ సౌకర్యం అందిస్తారు.
ఈ రకాలు మేలు
అందుబాటులో బంగినపల్లి, బేనిషాన్, దశరి, కొత్తపల్లి కొబ్బరి, రసాలు మొక్కలు ఉన్నాయి.
నేలను సిద్ధం చేయాలిలా..
నీరు నిలవని సారవంతమైన నేలలు మామిడి సాగుకు అనూకులం.
చౌడు నేలలు పనికిరావు.
భూమిని రెండు మూడుసార్లు బాగా కలియదున్నాలి.
మొక్కలు నాటడానికి 3.4 వారాల ముందే మూడు ఫీట్ల లోతు, వెడల్పుతో 7.5 మీటర్ల విడిది ఉండేలా గుంతలకు తవ్వాలి.
మొక్కలు నాటేముందు ఒక్కో గుంతలో 50 కిలోల ఎండిన పశువుల ఎరువు, చెదలు పట్టకుండా 2 కిలోల సింగల్ సూపర్ ఫాస్పేట్, 100 గ్రాముల పారిడీల్ పొడిని మట్టిలో కలిపి మొక్కను పాతుకోవాలి.
ఎకరాకు 70 మొక్కలను నాటాలి.
నీటి యాజమాన్యం
మొక్కలు నాటిన వెంటనే ఒకటిన్నర పాదు వేసి నీరు ఇవ్వాలి.
వర్షాలు లేకుంటే 6 నెలల వరకు క్రమం తప్పకుండా 3-4 రోజులకోసారి నీరు పెట్టాలి.
2-3 సంవత్సరాల వరకు మొక్కను భద్రంగా కాపాడాలి.
{yిప్పు ద్వారా నీరు ఇచ్చినప్పుడు కాలాన్ని బట్టి రోజుకు 8-13 లీటర్లు మేర నీరందేలా చూడాలి.
సూక్ష్మపోషక లోపాల నివారణ
మొక్కల ఎదుగు దశలో సూక్ష్మపోషక లోపాల నివారణకు ఏడాదికి 2-3 సార్లు జూన్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో గానీ, మొక్కలు కొత్త చిగుళ్లు తొడుగుతున్నా దశలో గానీ లీటరు నీటిలో 3-5 గ్రాముల మల్టీప్లెక్స్ మందును కలిపి 2-3 సార్లు మొక్కలపై పిచికారీ చేయాలి.
కత్తిరింపులు
మొక్కలు నాటిన మొదట సంవత్సరం మొక్క కాండం మీద 50 సెంటీమీటర్ల వరకు ఎటువంటి కొమ్మలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మొక్క 60-90 సెంటిమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత ప్రధాన కాండం చివరకు కత్తిరించి 2-3 బలమైన కొమ్మలను ఎంచుకుని పెరగనివ్వాలి. మిగిలిన వాటిని కత్తిరించాలి.
పక్క కొమ్మల 80-90 సెంటీమీటర్లు పెరిగాక రెండోసారి కత్తిరించి రెండుమూడు కొమ్మలను ఉంచాలి.
మూడో దశలోనే కొమ్మలను కత్తిరించి చెట్లు గొడుగు ఆకారంలో పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
ఆర్థిక ప్రోత్సాహం
మామిడి సాగులో ఒక్కో మొక్కకు రోజుకు 50 పైసల చొప్పున నెలకు రూ.15లు ఇస్తారు. ఈ లెక్కన ఎకరంలోని 70 మొక్కలకు నెలకు రూ.1,050 చొప్పున ఇస్తారు. అంటే సంవత్సరానికి రూ.12,600ల చొప్పున మూడేళ్ల కాలానికి 37,800లు అందుతాయి.
ఆ తరువాత తోట కాపునకు వచ్చి ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుంది.
చెట్లు పెరిగిన కొద్ది కాత అధికమై ఆ ప్రకారం దాయం కూడా పెరుగుతుంది.
అంతర పంటలతో అదనపు ఆదాయం
మామిడిలో అంతర పంటలను సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు. తీగ జాతికి చెందిన కాకర, బీర, సోర, దోస, ఉల్లి, బీన్స్, క్యాబేజీతో పాటు పప్పు దినుసులైన పెసర, మినుమును అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు.