టుడే అప్‌ డేట్స్‌ | Today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌ డేట్స్‌

Jul 14 2017 7:24 AM | Updated on Sep 5 2017 4:02 PM

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల విమర్శల వేడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.

విపక్షాలతో రాజ్‌నాథ్, సుష్మ చర్చలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల విమర్శల వేడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితి, సిక్కిం సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ విషయాలపై పూర్తి వివరాలను విపక్షాలకు తెలపాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, సుష్మా స్వరాజ్‌ శుక్రవారం విపక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే విపక్ష నేతలకు ఆహ్వానం అందింది. కశ్మీర్‌ విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకే కేంద్రం ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది.

వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ రేపు
హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో.. త్వరలో ప్రారంభమవనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది.

17న విజయవాడకు వైఎస్‌ జగన్‌
హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న విజయవాడకు వెళుతున్నారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రేపటి నుంచి ‘మెడికల్‌’ సర్టిఫికెట్ల పరిశీలన
విజయవాడ : ఏపీలో ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కోర్సుల్లో కాంపిటెంట్‌ అథారిటీ సీట్ల (కన్వీనర్‌ కోటా) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 21వరకు ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ మేరకు గురువారం రాత్రి నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాథమిక మెరిట్‌ లిస్టును కూడా విడుదల చేశారు.

నడక భక్తులకు రోజుకు 20 వేల మందికే దర్శనం
శ్రీవారి కాలిబాట దివ్యదర్శనాన్ని ఇకపై టైం స్లాట్‌లో కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. రూ.300 టికెట్ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటకు 2500 మంది భక్తులకు కేటాయించి సజావుగా శ్రీవారి దర్శనం కేటాయిస్తున్నారు. దీనివల్ల క్యూలైన్లు కనిపించవు. అదే తరహాలోనే రోజులో 20వేల మంది కాలిబాట భక్తులకు టైం స్లాట్‌ కేటాయించనున్నారు.  ఈ కొత్త విధానం ఈనెల 17వ తేది సోమవారం నుండి గురువారం వరకు నాలుగురోజుల పాటు అమలు చేయాలని నిర్ణయించారు. ఇక  వారాంతంలో.. (శుక్ర, శని, ఆదివారాల్లో) కాలిబాట దివ్యదర్శనం రద్దు అమలు చేయనున్నారు.

మహబూబాబాద్‌ ఘటన నేపథ్యంలో భేటీ
మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారుల సంఘం గురు వారం మంజీరా అథితిగృహంలో ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సుమారు 35 మంది ఐఏఎస్‌ అధికారులు పాల్గొనగా.. దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చిం చారు. కాగా, ఐఏఎస్‌ అధికారుల సంఘం శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలవనుంది.

విశాఖ : ఇవాళ మన్యంలో కాం‍గ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

వరంగల్‌ : టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళీ భౌతికకాయానికి ఇవాళ ఎంజీఎంలో పోస్టుమార్టం
మురళీ హత్యకు నిరసనగా నేడు వరంగల్‌ బంద్‌కు పిలుపు

వీనస్‌ (Vs) ముగురుజా
వింబుల్డన్‌లో మహిళల పోరు చివరి అంకానికి చేరింది. అమెరికా స్టార్‌ వీనస్‌ విలియమ్స్, స్పెయిన్‌ క్రీడాకారిణి ముగురుజా టైటిల్‌ పోరుకు అర్హత పొందారు. వీనస్, ముగురుజాల మధ్య శనివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement