చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు | supreme court sends notice to chandra babu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు

Mar 6 2017 11:56 AM | Updated on Sep 2 2018 5:28 PM

చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు - Sakshi

చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు

ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఓటుకు కోట్లు వ్యవహారం అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందని ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లు కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొందరిని డబ్బుతో కొనేందుకు టీడీపీ ప్రయత్నించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఆయన ఇంట్లో ప్రలోభపెడుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. అంతేగాక టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. స్టీఫెన్‌సన్‌తో నేరుగా మాట్లాడినట్టు ఆధారాలు బయటపడ్డాయి. మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు చెప్పినట్టు ఫోన్ రికార్డుల్లో వెలుగుచూసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో బ్రీఫ్‌డ్ మీ అన్న గొంతు చంద్రబాబుదేనని తేలింది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఏసీబీ కోర్టులో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. సాక్ష్యాల ఆధారంగా చంద్రబాబుపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించగా.. చంద్రబాబు హైకోర్టులో సవాల్ చేశారు. ఓటు వేసేందుకు లంచం తీసుకుంటే అవినీతి కిందకు రాదని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించారు. చంద్రబాబుపై ఏసీబీ కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టివేయగా, ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement