
ఖతార్ చేసిన తప్పేంటి?
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఖతార్. ఈ దేశ విస్తీర్ణం హైదరాబాద్ విస్తీర్ణానికి రెట్టింపు..దేశ జనాభాలో దాదాపు మూడో వంతు భారతీయులే..
నిత్యం రాజకీయ అస్థిరత తాండవించే పశ్చిమాసియాలో మరో సంక్షోభం ముదురుతోంది. అయితే.. ఇది ఈ సారి అత్యంత సంపన్న దేశం ఖతార్ కేంద్రంగా రాజుకుంటోంది. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం గల ఈ దేశం మీద ఇప్పుడు పొరుగు దేశాలు ఎందుకు కత్తులు నూరుతున్నాయి? ఖతార్ చేసిన తప్పేంటి?
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఖతార్. ఈ దేశ విస్తీర్ణం హైదరాబాద్ విస్తీర్ణానికి రెట్టింపులో ఉంటుంది. జనాభా మాత్రం హైదరాబాద్లో సగమే ఉంటుంది. మొత్తం జనాభాలో 12 శాతం మాత్రమే ఖతార్ పౌరులు. మిగతా వాళ్లంత వలసదారులే. దేశ జనాభాలో దాదాపు మూడో వంతు భారతీయులే. మతం రీత్యా చూస్తే ముస్లింలు, క్రైస్తవుల తర్వాత మూడో స్థానంలో హిందువులున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు అధికం. అందుకే ఇతర దేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.
ఖతార్కు గత వారం కష్టకాలం మొదలైంది. జిహాదీ, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తూ, మద్దతిస్తోందంటూ అరబ్ దేశాలు ఖతార్పై భగ్గుమన్నాయి. సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టులు ఈ నెల ఐదో తేదీన ఖతార్తో దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి. రవాణా మార్గాలన్నిటినీ మూసివేశాయి. తమ తమ దేశాల్లోని ఖతార్ పౌరులు 14 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలనీ అల్టిమేటం జారీచేశాయి. పొరుగు దేశాల సహాయ నిరాకరణతో ఖతార్ విలవిలలాడిపోయింది.
అరేబియా ద్వీపకల్పంలోని చిన్న దేశమైన ఖతార్కు మూడువైపుల సముద్రం ఒక వైపు సౌదీ అరేబియాతో భూసరిహద్దులు ఉన్నాయి. ఖతార్కు వచ్చే పాల ఉత్పత్తులు, కూరగాయలు, ఆహార పదార్థాలు సౌదీ నుంచి రావాల్సిందే. ఈ మార్గాన్ని సౌదీ మూసివేయడంతో ఖతార్లో నిత్యావసర వస్తువులకు ఒక్కసారిగా కొరత ఏర్పడింది. చాలా విమానయాన సంస్థలు ఖతార్ నుంచి విమానాల రాకపోకలను రద్దు చేశాయి. మిగతా పొరుగు దేశాలు కూడా రవాణా మార్గాలను మూసివేయడంతో ఆహార పదార్థాల కొరత పెరిగిపోతోంది. దీంతో ప్రజలు ముందుజాగ్రత్తగా ఆహారం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడానికి మార్కెట్లకు వెల్లువెత్తుతున్నారు.
ఆరు సభ్యదేశాలున్న గల్ఫ్ సహకార మండలిలో కువైట్, ఒమన్ మాత్రమే ఖతార్తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తాజా వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించడానికి కువైట్ ముందుకు వచ్చింది. ఇక ఇరాన్ నౌకలు, విమనాల ద్వారా ఆహార పదార్థాలను ఖతార్కు పంపిస్తోంది. రష్యా కూడా సాయం చేసేందుకు అంగీకరించింది.
కొన్ని దేశాల్లో అస్థిర పరిస్థితులు నెలకొన్న సమయంలో అక్కడ నివసిస్తున్న విదేశీయులను విమానాలు లేదా నౌకల ద్వారా వారి స్వదేశాలకు తరలిస్తుంటారు. ఖతార్ ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు. పొరుగు దేశాల సహాయ నిరాకరణతో దేశం సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ స్థైర్యం కోల్పోకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దేశీయ వినియోగానికి అవసరమైన పాల ఉత్పత్తుల కోసం 4 వేల ఆవులను 60 విమానాల్లో తీసుకురావాలని నిర్ణయించింది. ఖతార్కు చెందిన పారిశ్రామికవేత్త మౌతాజ్ అల్ ఖయ్యత్ ఆస్ట్రేలియా నుంచి ఆవులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాడు. సెప్టెంబరు కల్లా దేశీయంగా పాల దిగుబడి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆవుల రాకతో ఈ నెలాఖరు నుంచే పాల ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించారు. 2022లో ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫుట్బాల్ క్రీడలను ఖతార్లో నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఇలాంటి సవాళ్లు ఎదురుకావడంతో వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.