లూటీకే యూటీ అంటున్నారు : శ్రీనివాస్‌గౌడ్ | Seemandhra people will try to make Looty hyderabad, Says Srinivas goud | Sakshi
Sakshi News home page

లూటీకే యూటీ అంటున్నారు : శ్రీనివాస్‌గౌడ్

Sep 24 2013 2:57 AM | Updated on Sep 1 2017 10:59 PM

లూటీ చేసేందుకే సీమాంధ్రులు హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: లూటీ చేసేందుకే సీమాంధ్రులు హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.  హైదరాబాద్‌ను యూటీ చేస్తే యుద్ధమే అని హెచ్చరించారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ గజిటెడ్ భవన్‌లో సకలజనభేరి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు కండ కావరంతో, కళ్తు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఎంతో సహనంతో ఉన్నామని, హైదరాబాద్ లో సమావేశం పెట్టినా ఓర్చుకున్నామని చెప్పారు. కానీ అధర్మం, అసత్యం పునాదుల మీద తెలంగాణ ఉద్యమం ఉందంటూ మాట్లాడితే సహించేది లేదన్నారు.
 
 అసత్యపు పునాదుల మీద తెలంగాణ ఉద్యమం నడిస్తే 50ఏళ్లకు పైబడి ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. ‘50 రోజుల క్రితం వరకు ప్రజలకు ఎవరో కూడా తెలియని నీవా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేది..’ అంటూ ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడిపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. ‘ఇంటర్ వరకు చదివి మధ్యలోనే చదువు ఆపేసిన నీవు చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడొద్దు..’ అని అన్నారు. బానిస బతుకులంటూ అవమానపరిచే విధంగా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. తాము అనుకుంటే హైదరాబాద్‌లో ఏఒక్క సీమాంధ్రుడూ ఉండలేడని హెచ్చరిం చారు. హైదరాబాద్‌ను యూటీ చేసినా కామన్ క్యాపిటల్ చేసినా ఇంకా కలిసి ఉండే ప్రసక్తే లేదన్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని హితవు పలికారు. అనంతరం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. 

Advertisement
 
Advertisement
Advertisement