
సౌదీలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టం ‘నతాఖా’ కింద అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం పెద్ద సంఖ్యలో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రియాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టం ‘నతాఖా’ కింద అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం పెద్ద సంఖ్యలో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తోటి కార్మికుల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. అరెస్టులను ఖండిస్తూ పారిశుద్ధ్య విభాగంలో పర్మినెంట్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ప్రధాన నగరాల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. రోడ్లపై చెత్త ఊడ్చేవారు, డంప్ చేసే వారు లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లు, షాషింగ్ మాల్స్, వ్యాపార సముదాయాల వద్ద యజమానులే చీపుళ్లు పట్టి చెత్తను శుభ్రం చేసుకున్నారు.
నతాఖా చట్టం కింద అరెస్టయిన వారిలో ఎక్కువ శాతం మంది పారిశుద్ధ్య కార్మికులే ఉన్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. అయితే వారిని ఉద్యోగాల్లో నియమించుకునే సమయంలో పత్రాలేవీ చూడకుండా, ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా పనిలోంచి తీసివేయడం ఏమిటని పర్మినెంట్ కార్మికులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తే వారి బతుకులు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.