ఒక్క డెయిరీ వ్యాపారం తప్ప మిగిలిన అన్ని వ్యాపారాల్లో హెరిటేజ్ ఫుడ్స్ నష్టాలను ప్రకటించింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక్క డెయిరీ వ్యాపారం తప్ప మిగిలిన అన్ని వ్యాపారాల్లో హెరిటేజ్ ఫుడ్స్ నష్టాలను ప్రకటించింది. ప్రధానమైన డెయిరీ వ్యాపారం లాభాల్లో ఉండగా, ప్రధానంగా దృష్టిసారిస్తున్న రిటైల్, అగ్రి, బేకరీ వ్యాపారాలు మాత్రం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో రిటైల్ విభాగం రూ.94 కోట్ల వ్యాపారంపై రూ.5 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
అలాగే అగ్రి, బేకరీ విభాగాలు సంయుక్తంగా రూ.18 కోట్ల ఆదాయంపై రూ. కోటి నష్టాన్ని మూటకట్టుకున్నాయి. అయితే, డెయిరీ వ్యాపారాన్ని కలిపితే మొత్తం మీద లాభాల్లో ఉన్నా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికరలాభంలో 30% క్షీణత నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే కాలానికి రూ.14 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాదికి రూ.10 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో ఆదాయం రూ.402 కోట్ల నుంచి రూ.425 కోట్లకు పెరిగింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో అరవింద్ పండలై, విష్ణు రాజు నంద్యాలను అదనపు డెరైక్టర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నిరుత్సాహకర ఫలితాలతో హెరిటేజ్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 6.08% నష్టపోయి రూ.202.30 వద్ద ముగిసింది.