పూట భోజనమే సామాజిక బాధ్యతా..?
కార్పొరేట్ సంస్థలకు గవర్నర్ ప్రశ్న
* ప్రజల జీవితాలను మెరుగుపరిచే కార్యక్రమాలు చేపట్టాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ‘ఏదో ఒకపూట భోజనం పెటి.. రోడ్డు మీద నాలుగు మొక్కలు నాటి.. తమ సామాజిక బాధ్యత తీరిపోయిందని కొన్ని సంస్థలు అనుకుంటున్నాయి. ఇది సరికాదు. సమాజంలో ప్రజల జీవితాలను మెరుగుపరిచి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాలు చేపట్టాలి.’ అని గవర్నర్ నరసింహన్.. కార్పొరేట్ సంస్థలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ కొండాపూర్లోని స్పెషల్ పోలీస్ బెటాలియన్ ప్రాంగణంలో ప్రముఖ సాఫ్ట్వే ర్ సంస్థ ‘సైయంట్’ ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ, నేషనల్ డిజిటల్ లిటడ రసీ మిషన్ సెంటర్ను గవర్నర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైయంట్ సంస్థ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి సామాజిక బాధ్యతగా పోలీస్ బెటాలియన్లో డిజిటల్ లైబ్రరీ, డిజి టల్ లిటరసీ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
సైయంట్ ఫౌండేషన్ కల్పించిన ఈ సదుపాయాలు కేవలం ప్రారంభోత్సవానికే పరిమితం కాకూడదని, వచ్చే ఏడాది వీటి ఫలితాలను తనకు తెలపాలని కోరారు. కంప్యూటర్ను జ్ఞానాన్ని అందించే ఉత్తమ సేవకుడిగా చూడాలన్నారు. ప్రస్తుతం డిజిటల్ లైబ్రరీ ద్వారా ప్రపంచంలోని అన్ని అంశాలను తెలుసుకునే అవకాశం విద్యార్థులకు కలిగిందన్నారు.
తేలికగా జవాబులు లభిస్తాయని కంప్యూటర్పై ఆధారపడితే మెదడు పనిచేయడం తగ్గి, బలహీనంగా తయారవుతుందని విద్యార్థులకు సూచించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న సైయంట్ సంస్థ.. ప్రతిభగల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు.
డిజిటల్ ఇండియా స్ఫూర్తితో..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డిజిటల్ ఇండియా స్ఫూర్తితో తెలంగాణలో మొట్టమొదటిసారిగా కొండాపూర్ పోలీస్ బెటాలియన్ పాఠశాలలో డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ లిటరసీ మిషన్ సెంటర్ను ప్రారంభించామని సైయం ట్ ఫౌండేషన్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి తెలిపారు.
స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం కింద 54 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం తోపాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా తీసుకున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కంప్యూటర్ అక్షరాస్యత ను కలిగి ఉండేలా డిజిటల్ లిటరసీ మిషన్ సెంటర్లో కోర్సులను అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ శ్రీనివాసరావు, బెటాలియన్ కమాం డెంట్ రవిశంకర్, డీసీపీ కార్తికేయ పాల్గొన్నారు.