కాంగ్రెస్‌లో మండలి పోరు! | Fighting in Congress Council | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో మండలి పోరు!

Sep 30 2015 4:17 AM | Updated on Mar 22 2019 6:16 PM

కాంగ్రెస్‌లో మండలి పోరు! - Sakshi

కాంగ్రెస్‌లో మండలి పోరు!

రంగారెడ్డి జిల్లాలో రాజకీయం వేడెక్కింది...

రెండు సీట్ల ‘హస్త’గతానికి ముందస్తు వ్యూహం
- అభ్యర్థుల కూర్పుపై కసరత్తు
- పరిశీలనలో కేఎల్లార్, సుధీర్ పేర్లు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
రంగారెడ్డి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. శాసనమండలి బరిలో నిలిచేందుకు కాంగ్రెస్‌లో నాయకుల మధ్య రేసు మొదలైంది. స్థానిక సంస్థల కోటాలో రెండు స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది. గాంధీభవన్‌లో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ అధ్యక్షతన పార్టీ నేతలు సర్వే సత్యనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కేఎల్లార్, కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి తదితరులు సమావేశమై అభ్యర్థుల కూర్పుపై చర్చించారు.

స్థానిక సంస్థల్లో పార్టీకి తగినంత బలం ఉన్నప్పటికీ, అధికారపార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌తో బలా బలాలు మారిపోయాయి. ఈ తరుణంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై ఇంకా స్పష్టత రానప్పటికీ, విజ యతీరాలకు చేరడమే లక్ష్యంగా గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చిం ది. మారిన సమీకరణలతో రెండు సీట్లను గెలుచుకోవడానికి సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో టీడీపీతో అవగాహన కుదుర్చుకునే అంశంపై సమావేశంలో చర్చించారు. చెరో సీటుకు పోటీ చేయడం ద్వారా కారుకు కళ్లెం వేయడం సాధ్యమవుతుందనే అంచనాకొచ్చా రు. టీడీపీ సంకేతాలకు అనుగుణంగా ముందడుగు వేయాలనే అభిప్రాయానికొచ్చారు.
 
పోటీకి సబిత విముఖత!
శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విముఖత చూపారు. అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేయడానికి పోటీ చేయాల్సిందేనని సీనియర్లు పట్టుబట్టినప్పటికీ, ఆమె సున్నితంగా తిరస్కరించారు. అభ్యర్థి ఎవరైనా అంతిమ లక్ష్యం కాంగ్రెస్ గెలవడమేనని.. మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు.

సామాజిక సమతుల్యతలో భాగంగా ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించాలని నిర్ణయించారు. అయితే, కేఎల్లార్ మాత్రం తన అంతరంగాన్ని బయటపెట్టలేదు. కొంత సమయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ కేఎల్లార్ వెనుకడుగు వేస్తే ఎల్‌బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ పేర్లను సీరియస్‌గా పరిశీలిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement