‘డేరా’ హింసాకాండ.. అనూహ్య మలుపు | Dera property willbe seized to pay for damages, High court | Sakshi
Sakshi News home page

‘డేరా’ హింసాకాండ.. అనూహ్య మలుపు

Aug 25 2017 8:45 PM | Updated on Sep 17 2017 5:58 PM

‘డేరా’ హింసాకాండ.. అనూహ్య మలుపు

‘డేరా’ హింసాకాండ.. అనూహ్య మలుపు

గుర్మీత్‌ సింగ్‌పై కోర్టు తీర్పు అనంతరం ఆయన భక్తులు ధ్వంసం చేసిన ఆస్తుల విలువను డేరా సంస్థ నుంచే ముక్కుపిండి వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది.

ఛండీగఢ్‌: అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌ సింగ్‌కు అన్యాయం జరిగిందంటూ ఆయన భక్తులు, డేరా స్వచ్ఛ సౌదా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఉత్తరభారతంలోని హరియాణా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసకాండ సృష్టించి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు.

అయితే, ఈ ఘటనల్లో ధ్వంసమైన ఆస్తుల విలువను డేరా సంస్థ నుంచే ముక్కుపిండి వసూలు చేయాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. పంజాబ్‌, హరియాణా హైకోర్టు శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా వెలువరించిన ఆదేశాల్లో.. డేరా సంస్థకు చెందిన అన్ని ఆస్తులను తక్షణమే జప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం డేరాలు విధ్వంసం చేసిన ఆస్తుల విలువను.. వారి సంస్థ నిధుల నుంచే వసూలు చేయాలని సూచించింది. పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసమేకాక హింసాకండలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం మధ్యాహ్నం సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్‌ సింగ్‌ అలియాస్‌ బాబా గుర్మీత్‌ సింగ్‌ రాం రహీంను దోషిగా తేలారు. 2002లో గుర్మీత్‌ తన ఆశ్రమంలో సాధ్విలుగా  ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement