ఐఫోన్తో మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న యాపిల్ సంస్థ మరో కొత్త మోడల్ ఫోన్ను నేడు విడుదల చేయనుంది.
ఐఫోన్తో మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న యాపిల్ సంస్థ మరో కొత్త మోడల్ ఫోన్ను నేడు విడుదల చేయనుంది. స్మార్ట్ఫోన్ సెగ్మెంట్కు మార్కెట్ విస్తృతంగా పెరుగుతుండటంతో దాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. సిలికాన్ వ్యాలీలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కొత్త 5ఎస్ మోడల్ విడుదల కానుంది. ఇది చూడటానికి ఇంతకు ముందు మోడళ్లలాగే ఉండొచ్చు గానీ, సరికొత్త ప్రాసెసర్, కొత్త గ్రాఫిక్స్ సామర్థ్యాలతో మరింత వేగంగా పనిచేస్తుందని ఫారెస్టర్ విశ్లేషకుడు చార్లెస్ గోల్విన్ అంటున్నారు. అంతేకాదు, ఇంతకుముందు వాటి కంటే దీని ధర కూడా తక్కువట. చాలా రంగులలో కూడా ఇది రాబోతోంది.
ముందుగా ఇది బంగారు రంగులో ఉండి, వేలిముద్రలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనివల్ల ఫోన్ పోయినా.. యజమాని తప్ప వేరెవ్వరూ దీన్ని ఉపయోగించలేరన్న మాట. ప్రధానంగా చైనాతో పాటు అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్లలో కొనుగోలు దారులు దీనిపై ఎక్కువ మోజు పడొచ్చని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న ఫోన్లకు ఇటీవలి కాలంలో డిమాండ్ బాగా పెరుగుతోంది. బీజింగ్లో బుధవారం మరో కార్యక్రమం జరుగుతుందని కూడా యాపిల్ సంస్థ తెలిపింది.