బాధ్యతలు స్వీకరించిన కొప్పుల | Took charge of the KOPPULA | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన కొప్పుల

Dec 20 2014 2:08 AM | Updated on Sep 2 2017 6:26 PM

చీఫ్‌విప్‌గా నియమితులైన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పదవీబాధ్యతలు చేపట్టారు.

 హాజరైన ఈటెల, నాయకులు
 కరీంనగర్ సిటీ/ధర్మపురి: చీఫ్‌విప్‌గా నియమితులైన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పదవీబాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీలో తనకు కేటాయించిన కార్యాలయంలో ఉదయం ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, కోరుట్ల, మంథనిఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు హాజరై కొప్పులను అభినందించారు.
 
 మంత్రి పదవిని ఆశించిన కొప్పుల చీఫ్‌విప్ పదవిని ముందుగా నిరాకరించడం తెలిసిందే. ఆయన పదవీబాధ్యతలు చేపట్టకపోవడంతో టీఆర్‌ఎస్‌లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. చివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసిన తరువాత కొప్పుల చీఫ్‌విప్‌గా కొనసాగడానికే మొగ్గుచూపారు. ముహూర్తం ప్రకారం శుక్రవారం తన కార్యాలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కొప్పుల ఈశ్వర్ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement