నాణ్యమైన విద్య అందించాలి

There Is Need To Provide Quality Education Says Janardan Reddy - Sakshi

అధ్యాపకులు స్వీయ మూల్యంకణం బేరీజు వేసుకోవాలి

ఉద్యోగ విరమణ పొందిన ప్రొఫెసర్ల సేవలు అవసరం

పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కేయూ ఇన్‌చార్జి వీసీ డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి

సాక్షి, కేయూ క్యాంపస్: రాష్ట్రంలో పాఠశాల నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రమాణాలు పెంపొందించి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కేయూ ఇన్‌చార్జి వీసీ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రధానంగా హాజరు శాతం పెంచేలా కృషి చేయాలని, అధ్యాపకులు స్వీయ మూల్యం కణం బేరీజు వేసుకోవాలని సూచించారు. కేయూ ఇన్‌చార్జి వీసీగా నియామకమైన తర్వాత  తొలిసారి సోమవారం క్యాంపస్‌కు వచ్చిన ఆయన అన్ని విభాగాల అధ్యాపకులతో నిర్వహంచిన సమావేశంలో మాట్లాడారు. కొందరు పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు లేవని, సబ్జెక్టుల అంశాలు చెప్పలేక పోతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 29 లక్షల మంది విద్యార్థులు ఉండగా నిత్యం 30శాతం మంది గైర్హాజరవుతున్నారని తెలిపా రు. ఇదే పరిస్థితి కళాశాల విద్యలోనూ ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా కేయూలో హాజరుశాతం గురించి అడగ్గా సైన్స్‌ విభాగాల్లో 80 శాతం, ఆర్ట్స్‌ విభాగాల్లో 50 శాతం ఉందని ఆయా విభాగాల అధిపతులు తెలిపారు. పీజీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తీరిక సమయాలు, సెలవుల్లో వారికి విద్యాబోధన చేయాలని, ఇందుకు వర్సిటీల హెచ్‌వోడీలు అధ్యాపకులు సహకరించాలని అన్నా రు. వనరుల కొరత సాకుగా చూపకుండా కౌన్సిలర్‌ సిస్టం అమలు చేయాలని తెలిపారు. ఫార్మాసీ విభాగం ప్రొఫెసర్‌ ఎం.సారంగపాణి మాట్లాడుతూ కేయూలో 391 అధ్యాపక పోస్టులకు 128 మంది పనిచేస్తున్నారని పలు విభాగా ల్లో ఇద్దరు ముగ్గురే ఉన్నారని, రిటైర్‌ అయిన సీనియర్‌ ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకుంటే బాగుంటుందని అనగా.. విభాగాల వారీ గా ఎంత మంది ఉన్నారు.. జాబితా తయారు చేయాలని వీసీ సూచించారు. అందులో ఉచితంగా సేవలను అందించే, గెస్ట్‌ ఫ్యాకల్టీలుగా ఉండేవారి జాబితా ఇస్తే ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో వసతులకు నిధులు అవసరమని, అధ్యాపకుల కొరత ఉం దని కోఎడ్యూకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సి పాల్‌ పి.మల్లారెడ్డి తెలుపగా ప్రతిపాదనలు ఇస్తే వచ్చే ఏడాది బడ్జెట్‌లో నిధులను కేటాయించేలా చూస్తానని వీసీ హామీ ఇచ్చారు.

ఎమ్మెస్పీ ఐదేళ్ల కోర్సుల విద్యార్థులకు బోధన చేయడానికి అధ్యాపకుల కొరత ఉందని కెమిస్ట్రీ విభాగం అధిపతి డాక్టర్‌ జి.హన్మంతు అనగా  రెగ్యులర్‌ అధ్యాపకుల నియామకం అయ్యేవరకు గెస్ట్‌ఫ్యాకల్టీగానే తీసుకోవాలని సూచించారు. మీవద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని అడగ్గా.. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీయన్‌ స్టడీసెంటర్‌ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని పొలిటికల్‌సైన్స్‌ విభాగం అధిపతి సంజీవరెడ్డి చెప్పగా.. సెమినార్లు, వర్క్‌షాప్‌ను నిర్వహించబోతున్నట్లు కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ సుజాత మాట్లాడుతూ బయాలజీ ఉపాధ్యాయులకు వర్క్‌షాప్‌ నిర్వహించబోతున్నామన్నారు. కేయూ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కోల శంకర్‌ మాట్లాడుతూ కేయూలో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఖాళీగా ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులను అర్హులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని కోరారు. కేయూ టెక్నికల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పుల్లా శ్రీనివాస్, డాక్టర్‌ విష్ణువర్ధన్, కేయూ ఎన్‌జీవో జనరల్‌ సెక్రటరీ వల్లాల తిరుపతి, ఏఆర్‌ పెండ్లి అశోక్, డాక్టర్‌ మహేష్‌ తదితరులు వీసీతో మాట్లాడారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ కె.పురుషోత్తంమాట్లాడారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top