‘ఈవోడీబీ’లో తెలంగాణ టాప్‌!  | Telangana Top in 'EODB' | Sakshi
Sakshi News home page

‘ఈవోడీబీ’లో తెలంగాణ టాప్‌! 

Nov 1 2017 2:53 AM | Updated on Nov 1 2017 2:53 AM

సాక్షి, అమరావతి: ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈవోడీబీ)’ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. హరియాణా, పశ్చిమబెంగాల్‌ తర్వాతి స్థానాల్లో నిలవగా.. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో ఉంది. ప్రపంచ బ్యాంకుతో కలసి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డీఐపీపీ)’ఈవోడీబీ ర్యాంకులను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. 2017 సంవత్సరానికి గాను ర్యాంకుల కోసం తగిన సమాచారం ఇవ్వడానికి రాష్ట్రాలకు అక్టోబర్‌ 31 వరకు గడువిచ్చారు. తాజాగా ఆ గడువును నవంబర్‌ 7 వరకు పొడిగించారు.

ఈ ఏడాది సెంట్రల్‌ ఇన్‌స్పెక్షన్‌ సిస్టమ్, ఆన్‌లైన్‌ ద్వారా భూముల కేటాయింపులు, సింగిల్‌ విండో పాలసీ, నిర్మాణ అనుమతులు, రాష్ట్రాల మధ్య వలస కూలీల ఒప్పందాలు వంటి 105 సంస్కరణల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించనున్నారు. ఇందులో ఇప్పటివరకు రాష్ట్రాలు అందజేసిన సమాచారం ప్రకారం.. తెలంగాణ 59.95 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. నవంబర్‌ 7 నాటికి అందే పూర్తి సమాచారాన్ని పరిశీలించిన అనంతరం ‘ఈవోడీబీ’తుది ర్యాంకులను ఖరారు చేస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement