రైతుదీక్ష విజయవంతమైన స్ఫూర్తితో విద్య, వైద్యం, యువతకు ఉపాధికల్పన అంశాలపై పోరాడాలని తెలంగాణ
టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రైతుదీక్ష విజయవంతమైన స్ఫూర్తితో విద్య, వైద్యం, యువతకు ఉపాధికల్పన అంశాలపై పోరాడాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా వైద్యరంగంపై నవంబర్ 13న సదస్సును నిర్వహించాలని, నవంబర్ చివరివారంలోనే విద్యా పరిరక్షణ యాత్రను నిర్వహించాలని, దీనిద్వారా విద్యారంగ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
రైతుదీక్షపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ, జేఏసీ నిర్మాణం, వివిధ రంగాల్లో పరిస్థితులపై అధ్యయనం వంటి అంశాలపై కీలక నిర్ణయాలను సమావేశంలో తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో జేఏసీ కమిటీని పునర్వ్యవస్థీకరించడంతో పాటు జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిదాకా నిర్మాణాన్ని నవంబర్లోగానే పూర్తిచేసుకోవాలని తీర్మానించారు. ప్రైవేటు పరిశ్రమల్లోనూ 85 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని కోరుతూ డిసెంబర్లో పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు.