'గల్ఫ్‌ మృతులకు రూ.5లక్షలు ఇవ్వాల్సిందే' | Sakshi
Sakshi News home page

'గల్ఫ్‌ మృతులకు రూ.5లక్షలు ఇవ్వాల్సిందే'

Published Sun, Oct 1 2017 8:10 PM

telangana governement should pay exgracia to gulf death telangana people : Jeevan reddy   - Sakshi

జగిత్యాల టౌన్ : గల్ఫ్‌లో మృతిచెందిన ప్రవాసుల కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని జగిత్యాల ఎమ్మెల్యే టీ. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన చిట్టం మల్లయ్య (42) గుండెపోటుతో సెప్టెంబర్ 17న యూఏఈలోని షార్జా లో మృతిచెందగా శుక్రవారం మృతదేహం స్వగ్రామానికి చేరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై విభాగం ఉచితంగా అంబులెన్సు ద్వారా మృతదేహాన్ని పంపించింది. జగిత్యాల జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు నుంచి అంబులెన్స్‌ వెళుతుండగా కల్లెడ మాజీ సర్పంచ్ అంకతి గంగాధర్ నాయకత్వంలో మృతుని బంధువులు అంబులెన్సును ఆపారు.

విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే టీ.జీవన్ రెడ్డి, ప్రవాసి మిత్ర అధ్యక్షుడు మంద భీంరెడ్డి జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్దకు చేరుకొని అంబులెన్సులోని మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం జిలా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మహేశ్వర్ ను కలిసి గల్ఫ్ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గల్ఫ్ ఎన్నారైలు ప్రతినెలా ఒక వెయ్యి కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం మాతృదేశానికి పంపిస్తూ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో తగిన కేటాయింపులు చేయాలని, ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలను గల్ఫ్ కార్మిక కుటుంబాలకు విస్తరింపచేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement