బీజేపీతోనే సమగ్రాభివృద్ధి | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే సమగ్రాభివృద్ధి

Published Sat, Dec 1 2018 7:49 AM

Telangana Elections Rajnath Singh Election Campaign Nalgonda - Sakshi

భారతీయ జనతా పార్టీతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. హాలియాలో శుక్రవారం బీజేపీ సాగర్‌ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పక్కనే నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ ఉన్నా స్థానికంగా తాగునీటి సమస్య ఉండడం దారుణమన్నారు. కాంగ్రెస్, టీడీపీల పాలన చూశారని ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. 

త్రిపురారం (నాగార్జునసాగర్‌) : బీజేపీతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం హాలియాలో దేవరకొండ ప్రధాన రహదారి సమీపంలో శివాజీ మైదానంలో బీజేపీ సాగర్‌ అభ్యర్థి కంకణాల నివేదితాశ్రీధర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరై మాట్లాడారు. సోదర సోదరీ మణులకు స్వాగతం.. తెలంగాణ అమర వీరులకు జోహార్లు అంటూ ఆయన తెలుగులో ప్రసంగించడంతో సభకు హాజరైన ప్రజలంతా కేకలు, చప్పట్లతో హోరెత్తించారు. భారీ నీటి ప్రాజెక్టు ఉన్న సాగర్‌లో తాగునీటి సమస్య ఉండడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

టూరిజం కేంద్రంగా పేరుపొందిన నాగార్జునసాగర్‌లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బా«ధాకరమన్నారు. ప్రతిష్టాత్మకమైన నాగార్జునసాగర్‌ అంటే దేశంలో ఎంతో పేరుందని.. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హాస్టల్స్, ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడం శోచనీయమన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పేదల కోసం ప్రారంభించిన ఆయుష్మాన్‌భవ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు.  రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి పేద వాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో నరేంద్రమోదీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకం కింద పేద వారికి ఇళ్ల కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తున్నా.. తెలంగాణలో మాత్రం ఈ పథకం అమలు కావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, వృద్ధులకు రూ.2వేల పింఛన్, డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, టీడీపీల పాలన చూశారని ఓ సారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. సాగర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితాశ్రీధర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. విజయం సాధిస్తే తాను విజయోత్సవ కార్యక్రమానికి హాజరవుతానన్నారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వండి
నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో బరిలో ఉన్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులిద్దరూ వయస్సు పైబడిన వారేనని, తనను గెలిపిస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానని కంకణాల నివేదితాశ్రీధర్‌రెడ్డి ప్రజలను కోరారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నియోజకవర్గంలో తాగు, సాగునీరు, విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన లభించాలంటే బీజేపీ కమలం గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను శాలువా, గజమాలతో సన్మానించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కంకణాల శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, కిసాన్‌ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబయ్య, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మిట్టపల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్‌ మనాది రవీందర్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు చెన్ను వెంకటనారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి వాసుదేవుల జితేందర్‌రెడ్డి, పోగుల నాగార్జున్‌రెడ్డి, చలమల వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

1/2

బహిరంగ సభకు హాజరైన జనం

2/2

సభలో అభివాదం చేస్తున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, నాయకులు

Advertisement
Advertisement