సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య

Published Thu, Mar 19 2015 1:57 AM

సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య - Sakshi

  • ఆమెను కిడ్నాప్ చేసి మోసగించిన ఆలయ చైర్మన్
  •  నిందితుడికిప్పటికే రెండు పెళ్లిళ్లు.. భూ సెటిల్మెంట్ల కేసులు
  •  అతన్ని అరెస్టు చేసిన   ఐదు రోజులకే ఘటన
  • సాక్షి, హైదరాబాద్: రాజధానికి చెందిన అనూష (22) అనే యువతి బుధవారం తెల్లవారుజామున నాగార్జునసాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులతో కలిసి కారులో ఓ దర్గాకు వెళ్తూ మార్గమధ్యంలో ఈ దారుణానికి పాల్పడింది. ఆమెను మాయమాటలతో కిడ్నాప్ చేసి మోసగించిన ఓ చీటర్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఐదు రోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌పార్క్ కాలనీకి చెందిన అనూష ఇంజనీరింగ్ చేసి, స్థానికంగా బోటిక్ షాప్ నిర్వహిస్తోంది.

    ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ గుంటి రాజేశ్ (33) ఆమెను మాయమాటలతో లోబర్చుకుని ఫిబ్రవరి 27న కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా అయిన రాజేశ్‌కు వివాదాస్పద స్థలాలు కొనే, సెటిల్‌మెంట్లు చేసే చరిత్ర కూడా ఉంది. అతనికిప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నాడు. 2003లో భారతి అనే ఆమెను పెళ్లి చేసుకోగా ముగ్గురు పిల్లలు కలిగారు.

    2010లో మన్సూరాబాద్‌లో ఉండే రోమాసింగ్ అనే ఇద్దరు పిల్లల తల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. తనను మోసగించి రెండో పెళ్లి చేసుకున్నాడంటూ ఆమె నెల క్రితమే సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో రాజేశ్‌పై ఫిర్యాదు చేసింది. అతనిపై హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ పోలీసుస్టేషన్లలో భూ వివాదాల కేసులు కూడా ఉన్నాయి. అతనిపై పీడీ చట్టం ప్రయోగించడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో మరో పెళ్లి చేసుకునేందుకు వేట ప్రారంభించిన రాజేశ్, ఆ క్రమంలోనే అనూషతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలతో లోబర్చుకుని ఫిబ్రవరి 27న ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి మార్చి 14న రాజేశ్‌ను అరెస్టు చేశారు. అనూష వాంగ్మూలం మేరకు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టి జైలుకు తరలించారు. రాజేశ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు.

    ఈ నేపథ్యంలో డిప్రెషన్‌కు లోనైన అనూష కొద్ది రోజులుగా తనలో తాను కుమిలిపోసాగింది. దాంతో తండ్రి శ్యాంసుందర్‌రెడ్డి, తమ్ముడు రాజేంద్రనాథ్, నాయనమ్మ లక్షీనర్సమ్మ ఆమెను తీసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి కారులో నెల్లూరు జిల్లా రహమతాబాద్ దర్గాకు బయల్దేరారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సాగర్ నూతన బ్రిడ్జి వద్దకు చేరుకోగానే బహిర్భూమికని చెప్పి కారు దిగిన అనూష ఎంతసేపటికీ తిరిగిరాలేదు.

    చుట్టుపక్కలంతా వెదికిన అనంతరం విజయపురిసౌత్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెల్లవారాక అనూష మృతదేహం బ్రిడ్జి కింద నీటిలో పోలీసులకు కనబడింది. ఆమెకు పాదాలు, నడుము దగ్గర తీవ్రగాయాలయ్యాయి. అనూష మృతదేహాన్ని సాగర్‌లోని కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించి, పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.

    అనూష మృతితో గ్రీన్‌పార్క్ కాలనీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. సైబరాబాద్ జా యింట్ పోలీస్ కమిషనర్ శశిధర్‌రెడ్డి, ఎల్బీనగర్ డీసీ పీ తస్వీర్ ఇక్బాల్, ఏసీపీ సీతారాం చైతన్యపురి ఠాణా కు చేరుకుని రాజేశ్ కేసు విషయంపై ఆరా తీశారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement