
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఎల్బీ స్టేడియం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మహాసభలకు దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసే ప్రాంతాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కొత్వాల్ పేర్కొన్నారు. భద్రత, బందోబస్తు విధుల కోసం నగర పోలీసు విభాగంలోని 9 వేల మందికి తోడు మరో మూడు వేల మందిని మోహరిస్తున్నామని వివరించారు.
వీరికి అదనంగా క్విక్ రెస్పాన్స్ టీమ్స్, కమాండో టీమ్స్, షీ–టీమ్స్, క్రైమ్ టీమ్స్, సెక్యూరిటీ టీమ్స్తో పాటు సాయుధ బలాలు విధుల్లో ఉంటాయన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముఖ్యఅతిథులు నివసించే ప్రాంతాల్లో, వారు ప్రయాణించే ప్రదేశాల్లో నిఘాను ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ప్రధాన వేదికతో పాటు ఇతర వేదికల సమీపంలో ఉన్న నిజాం కళాశాల, పబ్లిక్గార్డెన్స్, ఎన్టీఆర్ స్టేడియం తదితర చోట్ల పార్కింగ్ ప్రాంతాలు గుర్తించామని తెలిపారు. సభా ప్రాంగణంలో డీసీపీ నేతృత్వంలో భద్రతా ఏర్పాటు చేస్తున్నామని, కమాండ్ కంట్రోల్ రూంలో ఉండే సీసీ కెమెరాల సాయంతో నిరంతరం పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపులు నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు.
పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు...
తెలుగు మహాసభల నేపథ్యంలో శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 9 వరకు ఎల్బీ స్టేడియం కేంద్రంగా ట్రాఫిక్ మళ్లించారు. ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్ రోడ్కు మళ్లిస్తారు. అబిడ్స్, గన్ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గన్ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి ఛాపెల్ రోడ్కు పంపిస్తారు. బషీర్బాగ్ చౌరస్తా నుంచి జీపీవో వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోఠి మీదుగా పంపిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్నగర్ వై జంక్షన్ వైపు పంపిస్తారు. లిబర్టీ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్నగర్ మీదుగా మళ్లించనున్నారు.