మహిళల రక్షణ కోసం ‘స్త్రీ’ 

STREE Scheme For Women Will Launch Home Minister Muhammad Ali - Sakshi

పథకాన్ని ప్రారంభించిన హోం మంత్రి 

గోల్కొండ: మహిళా సాధికారత, భద్రత కోసం ఓ వేదిక కల్పించడం ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్, హైదరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తంగా రూపొందించిన స్త్రీ పథకాన్ని శనివారం హైదరాబాద్‌లోని తారామతి బారాదరి ఆడిటోరియంలో ప్రారంభించారు. మహిళలకు సమున్నత గౌరవం, సమానత్వం, సాధికారత కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. సమాజంలో వివిధ వర్గాల మహిళలను ఓ వేదికపైకి తేవడం స్త్రీ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళలు, పోలీసులను ఒకే వేదికపైకి తెచ్చి మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు మహిళా హక్కులు, చట్టంలో వారికున్న హక్కులను ఈ వేదిక ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.

మహిళల పట్ల జరుగుతున్న హింసను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిగి మహిళల సలహాలు తీసుకుంటామని వివరించారు. స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, రక్షణ, సమానత్వం, గౌరవం తదితర విషయాలపై ఈ వేదికపై చర్చ జరుగుతుందని తెలి పారు. మహిళా సా«ధికారత, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తామని పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నెట్‌వర్క్‌ తయారు చేస్తామని, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ‘స్త్రీ’గ్రూప్‌ ఏర్పాటు చేసి సబల మహిళా వలంటీర్లను ఏర్పాటు చేసి సబల శక్తి వలంటీర్ల గ్రూపులను తయారు చేస్తామని చెప్పారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ అదనపు కమిషనర్లు షికా గోయెల్, అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top