సీనియర్ నాయకులు గ్రూపు రాజకీయాలను విడనాడి కార్యకర్తలను పట్టించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
సీనియర్ నాయకులు గ్రూపు రాజకీయాలను విడనాడి కార్యకర్తలను పట్టించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా ఇక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయిందని, దీనికి నేతలందరూ బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. ప్రచార లోపమే ఓటమికి కారణమని, ఇప్పటికైనా నేతల మధ్య ఐక్యత అవసరమని చెప్పారు.
ఇప్పుడు పార్టీని పునర్నిర్మించుకోవాలని, ఎందుకు ఓడిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని, తరచుగా సమీక్షాసమావేశాలు జరగాలని ఎంపీ రాపోలు అనంతభాస్కర్ అభిప్రాయపడ్డారు. పార్టీని ప్రక్షాళన చేయాలని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. అసలు పార్టీలో ఉన్నవారు ఎవరో, లేనివారు ఎవరో స్పష్టత లేదని.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మాజీ మంత్రులను నియమించాలని ఆయన చెప్పారు. ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసినవారిని ఏరివేయాలని, వారందరినీ పార్టీ నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.