ప్రతి గ్రామ సర్పంచ్కు ముఖ్యమంత్రి వలే అన్ని అధికారాలు ఉంటాయని వికారాబాద్ సబ్కలెక్టర్ ఆలుగు వర్షిణి
తాండూరు రూరల్ : ప్రతి గ్రామ సర్పంచ్కు ముఖ్యమంత్రి వలే అన్ని అధికారాలు ఉంటాయని వికారాబాద్ సబ్కలెక్టర్ ఆలుగు వర్షిణి అన్నారు. బుధవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలోని ఠాగూర్హాల్లో ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మహిళ సంఘాల సభ్యులకు ‘గ్రామజ్యోతి’పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ‘మన ఊరు-మన ప్రణాళిక’ ఆధారంగాగే ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి నాలుగేళ్ల ప్రణాళిక రూపొంది స్తామన్నారు. రూ.కోటి నుంచి రూ.నాలుగు కోట్ల వరకు నిధులు మంజూరు చేసి అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి గ్రామస్తులతో కమిటీ వేస్తామన్నారు. గ్రామజ్యోతిలో గ్రామస్తులు అడిగిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామంలో ఉన్న అనాథలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. వివిధ శాఖల నుంచి గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయన్నారు. గ్రామాభివృద్ధి చెందాలంటే సర్పంచ్ కీలకమన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయురాలిలా..
తాండూరు మండలంలోనిప్రజాప్రతినిధులు, అధికారులకు సబ్కలెక్టర్ ఆలుగు వర్షిణి గ్రామజ్యోతి కార్యక్రమంపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అంశాలపై క్షుణ్ణంగా వివరించారు. తరగతి గదిలో విద్యార్థులకు బోధించే టీచర్లా వ్యవహరించారు. ప్రతి విషయం బోర్డుపై రాసి సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, ఎంపీపీ లక్ష్మమ్మ, తహసీల్దార్ గోవింద్రావు, ఎంపీడీఓ జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.