రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఓటు గల్లంతు | Sakshi
Sakshi News home page

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఓటు గల్లంతు

Published Thu, Nov 29 2018 11:02 AM

 The Revenue Inspector Was Surprised By The Failure Of The Vote - Sakshi

రాజేంద్రనగర్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తన ఓటును వినియోగించుకునేందుకు వచ్చిన ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఓటు గల్లంతవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. రాజేంద్రనగర్‌ కృష్ణానగర్‌ హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన రామకృష్ణ చేవెళ్ల తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఎన్నికల్లో భాగంగా ఆయనకు విధులను కేటాయించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి బుధవారం నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది.

రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధిలోని కిషన్‌బాగ్‌ గురునానక్‌ స్కూల్‌లో బుధవారం సంబంధించిన కార్యక్రమం జరిగింది. రామకృష్ణ తన ఓటును వినియోగించుకునేందుకు ఓటర్‌ కార్డు డబ్ల్యూపీకే 2581933తో పోలింగ్‌ బూత్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది లిస్టులో పరిశీలించి రామకృష్ణ ఓటు లేదని నిర్ధారించారు.

దీంతో ఆశ్చర్యానికి గురైన రామకృష్ణ మరోసారి లిస్టు అంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక వెనుతిరిగాడు. ఒక అధికారి పేరు ఓటర్‌ లిస్టులో లేకపోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.  
 

Advertisement
Advertisement