వంద మండలాలకే వర్తింపు! | RBI writes letter to state on Rescheduled loans | Sakshi
Sakshi News home page

వంద మండలాలకే వర్తింపు!

Aug 10 2014 2:53 AM | Updated on Sep 2 2017 11:38 AM

తెలంగాణలో మూడు జిల్లాల పరిధిలోని వంద మండలాల్లో మాత్రమే పంట రుణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ అంగీకరించింది.

రుణాల రీషెడ్యూల్‌పై రాష్ట్రానికి ఆర్‌బీఐ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూడు జిల్లాల పరిధిలోని వంద మండలాల్లో మాత్రమే పంట రుణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గత ఏడాది తొమ్మిది జిల్లాల పరిధిలోని 415 మండలాలు కరువు, తుపాను ప్రభావానికి లోనుకావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం వాదించినప్పటికీ ఆర్‌బీఐ పట్టించుకోలేదు. ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో  కలిపి 100 మండలాల్లో మాత్రమే కరువు, తుపాను ప్రభావం నెలకొందని అభిప్రాయపడింది.
 
ఈ మండలాల్లో మాత్రమే రుణాల రీషెడ్యూల్‌కు అనుమతిస్తామని తెలిపింది. ఆర్‌బీఐ పంపిన లేఖ ప్రకారం.. ఈ మండలాల్లో పంట రుణాల చెల్లింపుపై ఏడాది పాటు మారటోరియం విధించనున్నారు. అనంతరం రైతులు బ్యాంకులకు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా శుక్రవారం అధికారులు చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం... మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రుణాల రీషెడ్యూల్ చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ, శనివారం ఆర్‌బీఐ నుంచి రాష్ట్రానికి అందిన లేఖలో మాత్రం ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు రుణాల రీషెడ్యూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement