అరుదైన ఖురాన్‌.. ఏడాదిలో ఒకసారి బయటికి..

Rare Quran Can Be Seen Only On Milad Un Nabi In Ghattu Mandal - Sakshi

జామీయా మసీదులో అతి చిన్న ఖురాన్‌

సాక్షి, గట్టు (గద్వాల): సుమారు 238 ఏళ్ల నాటివిగా భావిస్తున్న అరుదైన.. అగ్గి పెట్టేకన్నా చిన్న సైజులోని పవిత్ర ఖురాన్‌ గ్రంథాలను మిలాదున్‌ నబీ సందర్భంగా బయటకు తీశారు. గట్టులోని జామీయా మసీదు, బిచ్చాలపేటలోని మసీదులో ఈ గ్రంథాలు ఉండగా.. ఏడాదిలో ఒకేఒక్క సారి మాత్రమే బయటకు తీస్తారు. మొత్తం 480 పేజీలు... 30 పారే (పర్వాలు)లు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇందులోని అక్షరాలను భూతద్దం ద్వారా చూస్తేనే కంటికి కన్పిస్తాయి. ఇక్కడి ముస్లింలు తరతరాలుగా ఈ గ్రంథాలను పవిత్రంగా బావిస్తూ, భద్రపరుస్తూ వస్తున్నారు. ఖురాన్‌ను మంత్రోచ్ఛరణల మధ్య మత పెద్దలు బయటకు తీస్తారు. కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే సందర్శనార్థం ఉంచి మళ్లీ లోపల భద్రపరుస్తారు. ఈ గ్రంథాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయనేది ఇక్కడి వారి నమ్మకం.

మొగల్‌ కాలం నుంచి..
మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో గట్టులో జామీయా మసీదును నిర్మించినట్లుగా స్థానిక ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. తరతరాలుగా ఈ అతి చిన్న పరిమాణం (ఇంచున్నర) ఉన్న ఖురాన్‌ గ్రంథాన్ని ఎంతో భక్తితో, జాగ్రత్తగా మసీదులో భద్రపరుస్తున్నారు. మక్కా, మదీనా నుంచి ఈ గ్రంథంతో పాటు ఆసర్‌ ముబారక్‌ (మహమ్మద్‌ ప్రవక్త వెంట్రుక) తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రతీ ఏడాది వీటిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాలకు  చెందిన ముస్లీంలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top