4 లక్షల మందికి రంజాన్‌ కానుక | Ramzan Gift To 4 Lakh People In Telangana | Sakshi
Sakshi News home page

4 లక్షల మందికి రంజాన్‌ కానుక

May 22 2018 3:46 AM | Updated on May 22 2018 8:07 AM

Ramzan Gift To 4 Lakh People In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ కానుకగా కొత్త దుస్తులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 800 మసీదు కమిటీల ఆధ్వర్యంలో రం జాన్‌ కానుకల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 400, హైదరాబాద్‌లో 400 మసీదులను గుర్తించింది. ప్రతిమసీదు పరిధిలో 500 పేద కుటుం బాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త దుస్తులు గల ప్యాకెట్లను పంపిణీ చేయనుంది. ఒక్కోదానిలో రూ.525 విలువ గల కుర్తా, పైజామా, సల్వారు, కమీజు, చీర, బ్లౌజ్‌ అందించనుంది. కానుకల పంపిణీ కార్యక్రమాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్‌బోర్డు అధికారులు పర్యవేక్షిస్తారు.

ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ హ్యాండ్లూమ్‌ అండ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(టెస్కో)తో రంజాన్‌ దుస్తుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త దుస్తుల కోసం సుమారు రూ.21 కోట్లను వెచ్చిస్తోంది. 800 మసీదుల్లో దావతే ఇఫ్తార్‌ విందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 400, జీహెఎంసీ పరిధిలో 400 మసీదుల్లో దావతే ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లకు చర్యలు చేపట్టింది. ప్రతి నియోజకవర్గానికి 4 మసీదుల చొప్పున ఎంపిక చేసి 4 లక్షల మందికి విందు ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం మసీదుకు లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.8 కోట్లు వెచ్చిస్తోంది. 

జూన్‌ మొదటి వారంలో ..
నిరుపేద ముస్లింలకు రంజాన్‌ కానుక పంపిణీ ప్రక్రియను జూన్‌ మొదటివారంలో పూర్తి చేసేవిధంగా మైనారిటీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలకు దుస్తుల సరఫరా ప్రక్రియ ప్రారంభమైంది. రంజాన్‌ కానుక, దావతే ఇఫార్త్‌కు కలిపి ప్రభుత్వం రూ.30 కోట్లను మంజూరు చేసిన విషయం విదితమే.  
 

Advertisement
 
Advertisement
Advertisement