టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ రావాలి | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ రావాలి

Published Tue, Apr 2 2019 3:06 PM

 Puvvada Ajay Kumar Election Campaign In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పార్టీ నిర్ణయించిన అభ్యర్థి నామా నాగేశ్వరరావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం రఘునాథపాలెం మండలంలో ఎన్నికల ప్రచారం ప్రారంభంలో భాగంగా మండలంలోని కేవీబంజరలోని దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, మండల సర్వతోమాఖాభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. గత ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించిన విధంగానే ఎంపీగా నామా నాగేశ్వరరావుకు ఓట్లు వేసి, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు అజ్మీరా వీరునాయక్, కుర్రా భాస్కర్రావు, మందడపు సుధాకర్, గుండా మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. 


వాకర్స్‌ను ఓట్లు అభ్యర్థించిన టీఆర్‌ఎస్‌ నాయకులు 
ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఓట్లు వేసి గెలిపించాలని టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతిని«ధులు ఓటర్లను కోరారు. సోమవారం ఉదయం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లా రాజకీయాలకు నామా నాగేశ్వరరావు కొత్త కాదని, ఇతర పార్టీల అభ్యర్థులు గజకర్ణ, గోకర్ణ విద్యలతో జనం ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

అలాంటి నేతలను నమ్మవద్దని, టీఆర్‌ఎస్‌ పార్టీని, టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని ఆదరించాలని కోరారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక ఖమ్మం అభివృద్ధి మారిపోయిందని, సాగునీటి రంగంలో ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే యజ్ఞం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని, పార్లమెంట్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలని కోరారు. కార్యక్రమంలో తాత మధు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement